మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో చిన్న జయంతి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. మంగళవారం ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా నాలుగు రోజులుగా దాదాపు లక్షకు పైగా భక్తులు తరలిరాగా గుట్టంతా భక్తజనసంద్రమైంది. దీక్షాపరులతో కాషాయశోభితమైంది. అత్యంత భక్తి శ్రద్ధలు, నియమ నిష్ఠలతో దీక్ష తీసుకొన్న దీక్షాపరులు శుక్రవారం వరకు మాల విరమణ చేసి వెళ్లొస్తాం అంజన్నా.. అని మొక్కుకుంటూ తిరుగు పయనమయ్యారు. కాగా వేడుకల్లో భాగంగా శుక్రవారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ చేశారు.
ఉత్సవాలకు తొలిరోజు నామమాత్రంగానే భక్తులు రాగా మిగతా మూడు రోజులు కాలినడకన, వివిధ మార్గాల ద్వారా వెల్లువలా తరలి వచ్చారు. దీంతో పురాతన, కొత్త కోనేరు, మాల విరమణ మండపం స్థలాలు కిక్కిరిసిపోయాయి. దీక్షలను విరమించిన భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చిన భక్తుల వాహనాలతో జేఎన్టీయూ నుంచి బొజ్జపోతన వరకు ఏర్పాటుచేసిన మూడు వాహన పార్కింగ్ స్థలాలు, గుట్ట కింద గల వాహన పార్కింగ్ స్థలం పూర్తిగా నిండిపోయాయి. ఉత్సవాల సందర్భంగా జగిత్యాల డీఎస్పీ ప్రకాష్, మల్యాల సీఐ రమణమూర్తి, మల్యాల ఎస్ఐ మంద చిరంజీవి సిబ్బందితో కలిసి బందోబస్తు చర్యలు చేపట్టారు.