పార్లమెంట్ సంగ్రామానికి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ నుంచే సమరశంఖం పూరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మరోసారి పోరుబాట పట్టారు. గులాబీ అభ్యర్థులను విజయతీరాల వైపు నడిపించే లక్ష్యంతో ఈ నెల 24వ తేదీ నుంచి బస్సుయాత్రను ప్రారంభించారు. అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఆయన రోడ్షోలు నిర్వహిస్తూ.. నాటి పాలనకు నేటి పాలనకు తేడాలను పోలుస్తూ ఆలోచింపజేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ఎండగట్టి, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలువాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. ఇంకా కాళేశ్వరంపై ప్రతిపక్షాల ఆరోపణలు, అందులోని వాస్తవాలను విడమరిచి చెప్పడంతోపాటు అనేక అంశాలను కండ్ల ముందుంచుతున్నారు.
ఇలా ఎనిమిది రోజులుగా ఇతర జిల్లాల్లో నిర్వహించిన రోడ్షోలకు ప్రజల నుంచి విశేష స్పందన రాగా, నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో ఆది నుంచీ అండగా నిలిచిన ఉమ్మడి జిల్లా ప్రజలు గులాబీబాస్కు అపూర్వ స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. అధినేత ఎప్పుడొస్తారా..? అని ఇటు ప్రజలు, అభిమానులు, అటు నాయకులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. నేటి రాత్రి 8 గంటల తర్వాత రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో జరిగే భారీ రోడ్షోలో కేసీఆర్ పాల్గొని, ప్రసంగించనుండగా, కార్మికలోకం కదలివచ్చేందుకు సిద్ధమైంది. సింగరేణిని అభివృద్ధిలో పరుగులు పెట్టించి, తమ జీవితాల్లో వెలుగులు నింపిన అభిమాన నేత రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.
కరీంనగర్, మే 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత నెల 24 నుంచి రోడ్షోలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ అంతటా కలియ తిరిగేందుకు పోరుబాటకు రూటు ఖరారు చేయగా, మిర్యాలగూడ నుంచి ప్రారంభమై.. అన్ని నియోజకవర్గాల మీదుగా సాగుతున్నది. ఇప్పటికే ఎనిమిది రోజులుగా రోడ్షోలు విజయవంతం కాగా, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం తొమ్మిదో రోజు అంటే గురువారం జమ్మికుంటలో రోడ్ షో జరగాలి. కానీ, ఎన్నికల కమిషన్ విధించిన ఆంక్షల నేపథ్యంలో ఈ రోడ్ షో వాయిదా పడింది. నేటి రాత్రి 8 గంటల తర్వాత గోదావరిఖనిలో నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. గడిచిన ఎనిమిది రోజులుగా సాగిన రోడ్షోలు, హాజరైన జనం, కేసీఆర్ మాట్లాడుతున్న తీరు, ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ప్రతిపక్షాల గుండెళ్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఓటమి భయంతో నాయకులకు ముచ్చెమటలు పడుతున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా.. కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాలున్నాయి. వీటితోపాటు నిజామాబాద్ లోక్సభా స్థానం పరిధిలోకి జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలు వెళ్తాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని మూడు లోక్సభ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కేసీఆర్ రోడ్షో మ్యాప్ తయారు చేశారు. ఆది నుంచీ కలిసొచ్చిన ఉమ్మడి జిల్లాలో రామగుండం, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల మొత్తం నాలుగు ప్రాంతాల్లో రోడ్షోలకు తేదీలు ఖరారు చేశారు. ఈనెల 3న రాత్రి 8 గంటల తర్వాత రామగుండంలో రోడ్షో నిర్వహించి, ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రి అక్కడే బస చేసి, 4న సాయంత్రం ఆరు గంటలకు మంచిర్యాలలో జరిగే రోడ్షోలో పాల్గొంటారు. ఆ తర్వాత కరీంనగర్లోని కేసీఆర్ భవన్కు చేరుకొని బస చేస్తారు. 5న జగిత్యాలలో సాయంత్రం ఆరు గంటలకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. ఆ రోజు అక్కడే బస చేసి, 6న నిజామాబాద్లో సాయంత్రం ఆరు గంటలకు జరిగే రోడ్షోకు వెళ్తారు. తిరిగి ఈనెల 9న కరీంనగర్లో సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించే రోడ్షోలో పాల్గొని ఇక్కడే బస చేస్తారు. 10న సాయంత్రం ఐదు గంటలకు సిరిసిల్లలో నిర్వహించే రోడ్షోలో పాల్గొని, అనంతరం అక్కడి నుంచి సిద్దిపేటలో జరిగే రోడ్డు షోకు వెళ్తారు.
కార్మిక క్షేత్రమైన సింగరేణిలో కేసీఆర్ ప్రభుత్వం వెలుగులు నింపింది. కార్మికుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేయడమే కాకుండా.. సంక్షేమానికి పెద్దపీట వేసింది. లాభాల్లో కార్మికులకు ఇచ్చే మొత్తాన్ని పెంచడమేకాకుండా, అనేక కార్యక్రమాలను అమలుచేసింది. కొత్త ప్రాజెక్టుల వైపు సింగరేణిని ప్రోత్సహించింది. సమైక్య రాష్ట్రంలో ఎదురైన కష్టాలను తొలగించి.. సింగరేణిని ప్రగతి పథంలో నడిపింది. సౌరవిద్యుత్లో నూతన అధ్యాయం లిఖించింది. సింగరేణిని ప్రైవేటీకరణ చేయడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలను పోరాటాలతో అడ్డుకున్నది. ఈ విషయంలో ప్రధానికే లేఖలు రాసింది. మరోవైపు కార్మికులకు ఆదాయ పన్ను రద్దు చేయాలని ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కింది. ఇంకా 16,966 ఉద్యోగాలు ఇచ్చింది. 13,485 కారుణ్య నియమాకాలు చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే గతంలో ఏ ప్రభుత్వాలు చేయనంతగా సింగరేణిని అభివృద్ధి పథంలో తీసుకెళ్లింది. దీంతో నేటి కేసీఆర్ రోడ్షోకు కార్మికలోకం తరలివచ్చేందుకు సిద్ధమైంది.
కరువు ఛాయలు కమ్ముకోవడం, కాళేశ్వరంపై కాంగ్రెస్ రాజకీయాలు చేయడం, వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోవడం వంటి పరిస్థితులను అన్ని వర్గాల ప్రజలు కండ్లారా చూస్తున్నారు. నాటికీ నేటికీ పరిస్థితులను బేరీజు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ జెండా వైపు అడుగులు వేస్తున్నారు. నిజానికి ఇప్పటికే కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. అభ్యర్థులు ఎక్కడికెళ్లినా ప్రజల నుంచి ఆదరణ కనిపిస్తున్న ది. వారు కేసీఆర్ సర్కారు చేసిన అభివృద్ధిని కం డ్ల ముందుంచుతూనే.. భవిష్యత్లో ఏమి చేస్తా రో చెబుతున్నారు. కానీ, కాంగ్రెస్, బీజేపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు వందరోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పినా.. ఆచరణలో మాత్రం విఫలమైంది. నేటి వరకు మహిళలకు ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగిలిన వాటిని అమలు చేయలేదు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వర్తింప చేస్తున్నట్టు చెబుతున్నా.. మెజార్టీ ప్రజలకు ఇంకా అందుబాటులోకి రాలేదు.
కౌలు రైతులు, రైతులకు ఎకరాకు 15 వేలు, వ్యవసాయ కూలీలకు 12 వేలు, వరికి 500 బోనస్, మహిళలకు ప్రతినెలా 2500, ఇల్లులేని వారికి ఇంటి స్థలం, 5 లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం, యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్, చేయూత కింద 4 వేల పింఛన్ వంటివి అమలు కావడం లేదు. ఆరు గ్యారెంటీలే కాదు, మొత్తంగా 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ నిర్లక్ష్యంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దీంతో ఆ పార్టీ నానా తంటాలు పడుతున్నది. బీజేపీ పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది. తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కిన మోదీ నుంచి మొదలుకొని.. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు ఇవ్వకపోవడం వంటివి ఆ పార్టీకి సవాలుగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్కే ఆదరణ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో నేటి నుంచి జరిగే కేసీఆర్ రోడ్షోలు మరింత ఊపునిస్తాయని పార్టీ శ్రేణు లు భావిస్తున్నాయి. అంతేకాదు, రోడ్షో వల్ల రాజకీయ పరిణామాలు మారడమే కాకుం డా.. బీఆర్ఎస్ అభ్యర్థులు మంచి మెజార్టీతో విజయం సాధిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్ పాలనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచింది. ప్రధానంగా సాగునీరు, కరెంట్, రైతుబంధు, పంటల కొనుగోళ్లు.. ఇలా అన్ని రకాలుగా అందించిన ప్రోత్సాహంతో ఎవుసం పండుగలా సాగింది. తెలంగాణ వచ్చిన కొత్తలో అంటే 2014లో అన్ని పంటలు కలిపి 11,79,013 ఎకరాల్లో సాగు చేస్తే.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సాగు 22,41,066 ఎకరాలకు చేరింది. అంటే సాగు విస్తీర్ణం 10,62,053 ఎకరాలకు పెరిగింది. అందులో వరి సాగు 3,63,776 ఎకరాల నుంచి 12,35,223 ఎకరాలకు చేరింది. అంటే దాదాపు 8,71,447 ఎకరాల్లో సాగు పెరిగింది.
సాగు చేసే రైతుల సంఖ్య కూడా 3,57,725 నుంచి 9,25,343కు చేరింది. పదేళ్లలో 5,67,618 లక్షల మంది కొత్తగా సాగుబాట పట్టడం కనిపించింది. అలాగే, ఉమ్మడి జిల్లాలో 13,97,118 మెట్రిక్ టన్నుల దిగుబడి ఉంటే.. పదేళ్లలో 28,60,702 మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఈ లెక్కన 14,63,584 మెట్రిక్ టన్నుల దిగుబడి అదనంగా వచ్చింది. 2018కి ముందు అంటే రైతుబంధు రాక ముందు 14,29,562 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంటే.. రైతుబంధు అమలు తర్వాత 22,41,066కు సాగు పెరిగింది. అంటే 8,11,504 ఎకరాలు పెరిగింది. రైతుబంధు రావడం ఇదే సమయంలో కాళేశ్వరం జలాలు తరలిరావడం కలిసిరాగా.. పదేళ్లపాటు కర్షకలోకం నిరందిగా ఎవుసం చేసింది.
ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ రాష్ట్రంలో రైతుబంధు అమలు చేసిన విషయం తెలిసిందే. సాగు సమయంలో రైతులు పెట్టుబడికి ఇబ్బంది పడొద్దనే ఉద్దేశ్యంతో 2018 మే 10న హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం విదితమే. పదేళ్ల పాలనలో పదకొండు విడుతల కింద ఉమ్మడి జిల్లాలో 7,750.68 కోట్ల చిలుకు పెట్టుబడి సాయం అందించింది. ఈ లెక్కన ఒక సీజన్లో చూస్తే.. రమారమి 700 నుంచి 800 కోట్ల వరకు.. అదే ఏడాదికి 1400 నుంచి 1600 కోట్ల వరకు సాయం అందింది.
సంక్షేమ రంగాన్ని చూస్తే.. 2014 వరకు అన్ని రకాల పింఛన్లు కలిపి 2,28,639 మందికి ఇవ్వగా.. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ సంఖ్య 5,88,589కు పెరిగింది. అంటే స్వరాష్ట్రంలో 3,59,950 మందికి కొత్తగా పింఛన్ అందింది. అలాగే, 2014 వరకు అన్ని పింఛన్లకు కలిపి నెలకు 6.55 కోట్లు ఇస్తే.. ఆ మొత్తం 125.38 కోట్లకు పెరిగింది. అంటే నెలకు 118.83 కోట్లు అదనంగా ఇచ్చింది.
దశాబ్ధాల తరబడి కరువు రాజ్యమేలిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. కేసీఆర్ చొరవతో సుభిక్షంగా మారింది. ప్రధానంగా వ్యవసాయరంగం బలోపేతమైంది. కాళేశ్వరం జలాలు తరలిరావడంతో ఎటుచూసినా పచ్చదనం పరుచుకున్నది. మండుటెండల్లోనూ ప్రాజెక్టులు కళకళలాడగా.. చెరువులు, కుంటలు మత్తళ్లు దూకాయి. ఫలితంగా మత్స్య పరిశ్రమ ఒక్కటే కాదు, కులవృత్తులు పునర్జీవం పోసుకున్నాయి. నాడు కరువు ఛాయలకు కేరాఫ్గా నిలిచిన రాజన్న సిరిసిల్ల, కేసీఆర్ పాలనలో సస్యశ్యామలమైంది. భూగర్భజలాలు పెరిగి ఐఏఎస్లకే ఒక పాఠ్యాంశంగా మారింది.
అంతేకాకుండా అసంపూర్తిగా ఉన్న మధ్యమానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాకుండా.. ప్రాజెక్టుల రీడిజైన్ కింద కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి, యుద్ధ ప్రాతిపదికన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లతోపాటు పంపుహౌస్లను పూర్తి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కింది. అతి తక్కువ కాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాకుండా.. మేడిగడ్డ నుంచి కొండపోచమ్మసాగర్ వరకు నిరాటంకంగా నీటిని ఎత్తిపోసి, అక్కడి నుంచి ఎగువమానేరుకు నీరందించిన చరిత్ర కూడా కేసీఆర్దే.
సాగునీటి కొరతకు కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపారని రైతులతోపాటు సబ్బండ వర్గాలు సంబుర పడుతున్న వేళ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కరువును కూడా తీసుకొచ్చింది. మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగాయని సాకుగా చూపి.. నీటిని ఎత్తిపోయడం ఆపేసింది. దాంతో ఎక్కడికక్కడ సాగునీటి సమస్య మొదలైంది. పోయినేడు ఎండల్లోనూ నిండుగా ఉన్న చెరువులు, కుంటలు, ఈసారి అడుగంటాయి. ప్రాజెక్టులు డెడ్ స్టోరీజీకి చేరాయి. భూగర్భ జలాలు పాతాళానికి అంటా యి. నాడు నిత్యం నీటితో కళకళలాడిన వరదకాలువ ప్రస్తుతం వట్టిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మళ్లీ ఉమ్మడి జిల్లాలో ఎటుచూసినా కరువు ఛాయలే కనిపిస్తున్నాయి. కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కారు వివక్ష చూపడంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఇటు అరకొరగా వచ్చిన ధాన్యం దిగుబడులను కొనడంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తుండగా, రైతాంగం ఆగమవుతున్నది. ఈసారి భారీగా నష్టపోయింది. దీని ప్రభావం అన్నిరంగాలపైనా పడుతున్నది.