తెలంగాణ రాష్ట్రంలోనే సేద్య ఖిల్లాగా పేరుగాంచిన జగిత్యాల జిల్లా, నేడు అతలాకుతలామవుతున్నది. పోయినేడు యాసంగి వరకు ఏ రందీ లేకుండా సాగు చేసుకున్న రైతాంగం, ఈసారి అరిగోసపడుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే దశాబ్ధాలనాటి కష్టాలను చూస్తున్నది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం నిలిచిపోయి.. పోయినేడు వరకు వరదాయినిగా నిలిచిన వరదకాలువ నేడు వట్టిపోయి.. మండుటెండల్లో మత్తళ్లు దుంకిన చెరువులు, కుంటలు ఇప్పుడు అడుగంటి..
భూగర్భజలాలు పాతాళానికి చేరి ఎవుసం ఆగమైంది. సాగునీరు, కరెంట్ మొదలు ధాన్యం కొనుగోళ్ల దాకా కష్టాలు వెంటాడుతుండగా.. రైతాంగం తల్లడిల్లుతున్నది. కనీస భరోసానిచ్చేవారు లేక దిగాలు చెందుతున్నది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జగిత్యాల రోడ్ షోకు వస్తుండగా.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. అభిమాన నేత ప్రసంగాన్ని వినేందుకు కర్షకలోకమే కాదు, సామాన్యప్రజానీకం కూడా తరలివచ్చేందుకు సిద్ధమైంది.
జగిత్యాల, మే 4 (నమస్తే తెలంగాణ) : 112 టీఎంసీల సామర్థ్యం.. 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే లక్ష్యంతో నాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణమైంది. అయితే, పాలకుల పట్టింపులేనితనంతో నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా తగ్గిపోయింది. 1994లో 90.30 టీఎంసీలకు, 2013లో 80.13 టీఎంసీలకు కుచించుకుపోయింది. మొత్తంగా 31 టీఎంసీల నీటి నిల్వను కోల్పోయినా, నిపుణులు మాత్రం 28 శాతం సామర్థ్యం తగ్గిందని ప్రకటించారు. ఇక ఎగువన మహారాష్ట్రలో కట్టిన అనేక చెక్డ్యాంలు, ప్రాజెక్టుల వల్ల గోదావరిలో నీటి లభ్యత సైతం తగ్గింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ వచ్చిన తర్వాత వరద కాలువ ద్వారా కాళేశ్వర జలాలతో ఎస్సారెస్పీని నింపాలని కేసీఆర్ సర్కారు భావించింది.
ఆ మేరకు ఎస్సారెస్పీ పునర్జీవ పథకానికి సీఎం కేసీఆర్ రూపకల్పన చేయడమే కాదు, 2017 ఆగస్టు 10న ప్రాజెక్టు వద్ద అంకురార్పణ చేశారు. 122 కిలోమీటర్ల పొడవు ఉన్న వరద కాలువపై మూడు పంప్ హౌస్లు నిర్మించారు. జగిత్యాల జిల్లాలో రాంపూర్, రాజేశ్వర్రావుపేటతోపాటు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ వద్ద పంప్హౌస్లు నిర్మించారు. 2019 వరకు రాంపూర్, రాజేశ్వర్రావుపేట పూర్తి చేసి, 2020 నుంచి వరద కాలువ గుండా నీటిని రాంపూర్, రాజేశ్వర్రావుపేట పంప్హౌస్ల వరకు ఎత్తిపోశారు. తర్వాత ఏడాది పథకాన్ని పూర్తి చేసి ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలను తరలించారు. అప్పటి నుంచి వరద కాలువ ఏడాది పొడవునా సజీవంగా మారి రైతాంగానికి భరోసానిచ్చింది. నేడు ఆ పరిస్థితి మారిపోయింది. ఐదారేండ్లుగా జీవనదిని తలపించిన ఆ కాలువ, ఇప్పుడు నీళ్లు లేక వెలవెలబోతున్నది.
జగిత్యాల జిల్లాలో 1221 చెరువులు, కుంటలు ఉండగా.. వీటి కింద మొత్తం 59,601 ఎకరాల సాగు భూమి ఉన్నది. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో ఈ చెరువులు, కుంటల కింద ఏనాడూ 25 వేల ఎకరాలకు మించి సాగు కాలేదు. యాసంగిలో అయితే 10వేల నుంచి 15 వేల ఎకరాలకు మించి సాగు చేయలేదు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ సర్కారు మిషన్ కాకతీయ పథకం కింద 341 చెరువులను పునరుద్ధరించింది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతోపాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నీటిని మళ్లించి అన్ని చెరువులు, కుంటలను నింపేందుకు మార్గం సుగమం చేశారు.
ఎస్సారెస్పీ ద్వారా 875 చెరువులను నింపగా, 346 చెరువులను ఎల్లంపల్లి ద్వారా నీటిని నింపే ప్రక్రియ విజయవంతంగా చేపట్టారు. పోయిన యాసంగిలో చెరువులు, కుంటల కింద పూర్తిస్థాయిలో 59,601 ఎకరాలు సాగు చేయగా, అందుకోసం 5.57 టీఎంసీల నీటిని వినియోగించారు. అయితే, ఈ యేడాది పరిస్థితి మారింది. వరదకాలువలో నీటి ప్రవాహం లేక కాలువ పొడవునా చెరువులు కళతప్పాయి. మార్చి నుంచే చాలా వరకు అడుగంటి దర్శనమిచ్చాయి. దీంతో రైతులు గతంలో ఎన్నడూ లేనివిధంగా సాగునీటికి తండ్లాడారు. పంటలు ఎండిపోతోంటే కన్నీరు పెట్టారు.
ఎస్సారెస్పీ పునర్జీవ పథకం నాన్కమాండ్ ఏరియాలుగా ఉన్న కొడిమ్యాల, మల్యాల, కథలాపూర్, మేడిపల్లి, మెట్పల్లి మండలాల దశను మార్చింది. 2020 నుంచి వరదకాలువలో నిండుగా నీరుండడం, అలాగే తూములు ఏర్పాటు చేయడంతో పరిస్థితి మారింది. ఆ ఐదు మండలాల్లోని 32 చెరువులను నేరుగా నింపడంతో భూగర్భజలాలు పైపైకి చేరాయి. 2018కు ముందు ఏప్రిల్, మేలో సగటున 10 మీటర్లకు లోతున ఉన్న జలాలు 2023 మే నాటికి సగటున 6 మీటర్లకు వచ్చాయి. ఫలితంగా అప్పుడు యాసంగిలో 44,697 ఎకరాలు సాగు చేయగా, పోయిన యాసంగిలో 64,571 ఎకరాలు సాగయింది. అంటే సాగు విస్తీర్ణం 19,604 ఎకరాలు (43 శాతం) పెరిగింది. అయితే, ఈ యాసంగిలో పరిస్థితి మారింది. వరదకాలువ వట్టిపోవడం, భూగర్భ జలాలు అడుగంటడం, విద్యుత్ సరిగా లేకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది.
ఎస్సారెస్పీ నుంచి జగిత్యాల, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సాగునీరు తీసుకెళ్లేందుకు కాకతీయ కాలువను తవ్విన విషయం తెలిసిందే. ఆ కాలువకు డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేసినా.. ప్రాజెక్టులో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఆ డిస్ట్రిబ్యూటరీలకు నీరు సరిగ్గా అందడం లేదు. పునర్జీవ పథకంలో భాగంగా కాళేశ్వరం నీటిని వరదకాలువ గుండా ఎస్సారెస్పీకి నీటిని తరలించిన విషయం తెలిసిందే కాగా.. ఈ నేపథ్యంలోనే వరద కాలువ-కాకతీయ కాలువకు మధ్య లింక్ కలిపితే ప్రయోజనం ఉంటుందని కేసీఆర్ సర్కారు భావించింది.
వరదకాలువ నుంచి నీటిని కాకతీయ కాలువలోకి మళ్లిస్తే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని గుర్తించింది. 30 కోట్ల వ్యయంతో 3,006 క్యూసెక్కుల సామర్థ్యంతో మూడు కిలోమీటర్ల పొడువున లింక్ కెనాల్ను నిర్మించింది. వరదకాలువ 88.400 కిలోమీటర్ వద్ద లింక్ కెనాల్ను ప్రారంభించి, కాకతీయ ప్రధాన కాలువ 97.460 కిలోమీటర్ వద్ద కలిపింది. దీంతో కాకతీయ కాలువపైన డీ-70 నుంచి డీ-94 వరకు ఉన్న డిస్ట్రిబ్యూటరీల పరిధిలో సాగునీరు అందడంతోపాటు రైతులకు లబ్ధి చేకూరింది. ధర్మపురితోపాటు చొప్పదండి, కరీంనగర్, పెద్దపల్లి, మంథని, వరంగల్ ప్రాంతాల్లోని రైతులకు భరోసానిచ్చింది. అయితే, నేడు కాళేశ్వరం నుంచి నీరు లేకపోవడంతో ఈ లింక్ కెనాల్ కూడా ప్రయోజనం లేకుండా పోయింది.
ఎన్నడూ లేని విధంగా రైతులు ఈ యాసంగిలో అష్టకష్టాలు పడుతున్నారు. సాగునీరు మొదలు కరెంట్, ధాన్యం కొనుగోళ్లు ఇలా అన్నింటా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటిదాకా సాగునీటికి తండ్లాడగా, ఇప్పుడు ధాన్యం అమ్ముకునేందుకు నరకం చూస్తున్నారు. భగీరథ ప్రయత్నం చేసి పంటలను కాపాడుకున్నా.. అరకొరగా వచ్చిన పంటను అమ్మేందుకు అరిగోసపడుతున్నారు. కోతలు కోసి కొనుగోలు కేంద్రాలను ధాన్యాన్ని తరలిస్తున్నా.. వారం పది రోజుల వరకు వడ్ల విక్రయం కోసం చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్లు మార్కెట్కు, కొనుగోలు కేంద్రాలకు తెచ్చినప్పటి నుంచి తాము ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాలున్నాయి. జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రం నిజామాబాద్ లోక్సభా స్థానం పరిధిలోకి వెళ్తాయి. అయితే, ఆది నుంచీ ఈ రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు గులాబీ పార్టీకి కంచుకోటలా ఉన్నాయి. రాష్ట్రం రాక ముందు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచారు. అప్పటి నుంచి ఆమె ఈ ప్రాంత అభివృద్ధిలో తనదైన ముద్రవేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పసుపు బోర్డు పేరిట ఆడిన నాటకంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి గెలిచినా.. అసెంబ్లీ పరిధిలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తున్నారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత చూస్తే బీఆర్ఎస్ అభ్యర్థులే వరుస విజయం సాధిస్తున్నారు.
కోరుట్ల స్థానంలో వరుసగా మూడు సార్లు, జగిత్యాలలో వరుసగా రెండు సార్లు గెలిచారు. బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం, కేసీఆర్పై అపార నమ్మకంతోనే ఇక్కడి ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. అందుకే ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్కే జైకొడుతున్నారు. నాలుగు నెలల క్రితం ప్రభుత్వం మారగా.. ప్రస్తుత పరిస్థితులను కండ్లారా చూస్తున్నారు. నాటికీ నేటికీ పరిస్థితులను బేరీజు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి గులాబీ జెండా వైపు అడుగులు వేస్తున్నారు. ఆరు గ్యారెంటీలు వందరోజుల్లో అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ను.. మత విద్వేషాలతో రెచ్చగొట్టే బీజేపీని నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎక్కడికి వెళ్లినా మద్దతు తెలుపుతున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం జగిత్యాల న్యూ బస్టాండ్లో రోడ్డు షో నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు పాత బస్టాండ్లో బస్సుయాత్రను ప్రారంభించి, అక్కడి నుంచి తహసీల్ చౌరస్తా, అంగడిబజార్, ఫారెస్ట్ ఆఫీస్ మీదుగా న్యూ బస్టాండ్ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించనునన్నారు. శనివారం రాత్రి బస్సుయాత్ర, రోడ్ షో ప్రాంతాలను ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు పరిశీలించారు.