అధికార పార్టీ బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది. ముందు నుంచి చెప్పినట్టుగానే అధినేత కేసీఆర్.. సిట్టింగ్లకే పట్టం కట్టారు. ఒకేసారి ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి, అందులో పది చోట్ల పాతవారికే అవకాశమిచ్చారు. మూడు చోట్ల మాత్రమే కొత్త వారు కాగా, వేములవాడలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు చాన్స్ ఇచ్చారు. అయితే చెన్నమనేని రమేశ్బాబు పౌరసత్వం కోర్టు పరిధిలో ఉందని, అనివార్య పరిస్థితుల్లో ఇక్కడ కొత్తవారికి అవకాశమిచ్చామని అధినేత స్పష్టత ఇచ్చారు. అలాగే కోరుట్ల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు కోరిక మేరకు తన తనయుడు డాక్టర్ సంజయ్కు అవకాశమిచ్చారు. ఇక హుజూరాబాద్ నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉండడమే కాదు, ప్రజలతో మంచి సంబంధాలున్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డికి చాన్స్ ఇచ్చారు. మొత్తంగా అభ్యర్థుల ప్రకటనతో అధినేత కేసీఆర్ ఉత్కంఠకు తెరదించడమే కాదు, ప్రతిపక్షాలకు ఒక రకంగా సవాల్ విసిరారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సమాయత్తం అవుతుండగా.. ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఊహించని విధంగా ప్రకటనతో ఏం చేయాలో తెలియని స్థితికి చేరుకున్నాయి.
– కరీంనగర్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సాధారణంగా రాజకీయాల్లో టికెట్ల కేటాయింపు ప్రక్రియ అంటే మూడు నాలుగు సార్లు జాబితాలు ఇస్తారు. కానీ, అధినేత కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా సరికొత్త అర్థం చెబుతూ వస్తున్నారు. 2018లో మాదిరిగానే ఈ సారి సైతం అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి దమ్మున్న నాయకుడని మరోసారి అనిపించుకున్నారు. రాష్ట్రంలో 119 సీట్లకు కేవలం నాలుగు మినహా.. 115 సీట్లను ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పూర్తిగా ఖరారు చేశారు. రెండో జాబితా అంటూ సాగదీతకు అవకాశం లేకుండా అన్ని సీట్ల విషయంలో స్పష్టతనిచ్చారు. నిజానికి ఉమ్మడి జిల్లాలో మూడు నాలుగు సీట్లు ఇప్పుడే ప్రకటించరంటూ ప్రచారం సాగినా.. ప్రతిపక్షాలు సైతం ఏమి జరుగుతుందో చూద్దాం అంటూ వేచి చూసినా.. వీటిని పక్కన పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ తనకున్న ఆత్మవిశ్వాసంతో ఒకేసారి పేర్లు ప్రకటించారు. దీంతో అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠకు తెరపడింది. అంతేకాదు, గులాబీ సైన్యం నేటి నుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రచార బరిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నది.
ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు
అభ్యర్థుల ప్రకటన విషయంలో ప్రతిపక్షాలు సరికొత్త ఎత్తుగడలు వేసేందుకు సిద్ధమయ్యాయి. ఆయా పార్టీలకు అభ్యర్థులు లేకపోవడం, ఇతర పార్టీల్లో ఎక్కడైనా సిట్టింగ్లకు అవకాశం రాకపోతే వారిని తమ పార్టీలోకి లాగుదామనే దురాలోచన చేశాయి. అంతేకాదు బీఆర్ఎస్లో ఎక్కడైనా అసమ్మతి వస్తే.. వాటికి ఆజ్యం పోయాలనే కుట్రలు కుతంత్రాలు చేశాయి. కానీ, ఇటువంటి వాటికి అవకాశం లేకుండా సీఎం కేసీఆర్ ఒకేసారి 13 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దమ్ముంటే సిట్టింగ్లకు సీట్లు ఇచ్చి గెలువాలంటూ విమర్శలు చేసిన నేపథ్యంలో సిట్టింగ్కే అవకాశం దక్కడంతో ఏమిచేయాలో పాలు పోలేని దుస్థితిలోకి వెళ్లాయి. అంతేకాదు, బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన పూర్తి కాగా.. కాంగ్రెస్ ఇంకా దరఖాస్తులు స్వీకరిస్తున్నది. అది పూర్తయ్యేది ఎప్పుడో.. అభ్యర్థుల ప్రకటన ఎప్పుడో అన్న ఆందోళన ఆ పార్టీలో కనిపిస్తున్నది. మరోవైపు బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా మొదలైనట్లుగానే కనిపించడం లేదు. తాజా ప్రకటన సంబంధిత పార్టీల్లో వణుకు పుట్టిస్తున్నది.
కరీంనగర్ గడ్డపై ఓటమెరుగని నాయకుడు గంగుల కమలాకర్
23 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో వరుస విజయాలే తప్ప ఓటమి అంటే తెలియని నాయకుడు గంగుల కమలాకర్. ఎన్నిక ఏదైనాసరే ప్రత్యర్థులను మట్టి కరిపించి.. ప్రజల అండదండలతో అలవోకగా విజయం సాధించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. మహామహులు కూడా ఒకటి రెండు సార్లు గెలువడానికే నానా ఇబ్బందులు పడ్డ కరీంనగర్ గడ్డపైనుంచి మూడు సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం నాలుగోసారి విజయ సాధించేందుకు అడుగులు వేస్తున్నారు. పదవులెన్ని వచ్చినా నిత్యం ప్రజలతో మమేకం కావడానికి ఆయకు ఇష్టపడతారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ఇందిరానగర్ నుంచి మొదటి సారిగా 2000లో మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచారు. ఆ తర్వాత 2005లో నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేటర్గా విజయం సాధించారు. కౌన్సిలర్గా, కార్పొరేటర్గా ఆయన అందించిన సేవలు ఎమ్మెల్యేను చేశాయి. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 30,450 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన గంగుల, తెలంగాణ ఉద్యమం సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతాన్ని నిరసిస్తూ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆయన పోరాటాలు చేశారు. ఈ క్రమంలోనే టీడీపీని వీడి 2013 ఆరంభంలో గులాబీ పార్టీలోకి వచ్చారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 24,750 ఓట్ల మెజార్టీతో రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో 14,976 ఓట్ల మెజార్టీతో హాట్రిక్ సాధించి కరీంనగర్ నియోజకవర్గ చరిత్రలోనే రికార్డు సృష్టించారు. సాధారణంగా రాజకీయ నాయకులకు గెలుపోటములు ఉంటాయి. కానీ, తన 23 ఏండ్ల రాజకీయ చరిత్రలో గెలుపే తప్ప ఓటమి అనేది తెలియకుండా ముందుకుసాగుతున్న గంగుల, నాలుగోసారి విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమయ్యారు.
ప్రజల మధ్యనే రసమయి బాలకిషన్
పాట ఆయనకు ప్రాణం. ప్రజలే ఆయనకు దైవం. పాటతో మొదలైన రసమయి బాలకిషన్ ప్రస్థానం, ప్రజలతో మమేకమైంది. ఉద్యమ సమయంలో తన ఆటాపాటలతో ప్రజలను ఉర్రూతలూగించిన ఆయన, మానకొండూర్లో ప్రగతిని పరుగులు పెట్టించడంలోనూ అదే పంథాను కొనసాగిస్తున్నారు. ‘తొలి పొడుపు’ పేరిట నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. 2001 నుంచి తెలంగాణ ధూంధాం ఫౌండేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన, 2014లో మానకొండూర్ నియోజకవర్గం నుంచి మొదటి సారిగా పోటీచేసి విజయం సాధించారు. 2015లో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. 2018లో మానకొండూర్ నుంచి రెండోసారి విజయం సాధించారు. 2021 నుంచి రెండోసారి సాంస్కృతిక సారథి చైర్మన్గా కొనసాగుతున్నారు. నాడు కరువు ప్రాంతంగా అల్లాడిన మానకొండూర్ను నేడు సిరులకు నిలయంగా మార్చడంలో కీలకంగా పనిచేశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గ ముఖ చిత్రాన్నే మార్చిన తీరు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజలతో మమేకం అవుతున్న తీరును గుర్తించి, అధినేత కేసీఆర్ మరోసారి మానకొండూర్ నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో రసమయి ఈ సారి హ్యాట్రిక్ సాధించేందుకు తన పావులు కదుపుతున్నారు.
అభివృద్ధే ఆయన లక్ష్యం వొడితల సతీశ్కుమార్
తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్న అణుకువ ఆయనది. స్థాయి ఏదైనా సరే ఒదిగి ఉండడం, ఎదుటివారిని గౌరవించడం, వచ్చిన వారికి చేతనైనా సహాయం చేయడం హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ నైజం. ఈ సారి సైతం హుస్నాబాద్ నుంచి సతీశ్బాబు పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి మరోసారి అవకాశం కల్పించారు. 1995 నుంచి 2001 వరకు సింగాపూర్ సర్పంచ్గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, 2001లో బీఆర్ఎస్లో చేరారు. 2002లో మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2005 నుంచి 2012 వరకు సింగిల్విండో చైర్మన్ పదవులు నిర్వహించారు. వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్గానూ పనిచేశారు. 2014లో హుస్నాబాద్ నుంచి మొదటి సారి పోటీ చేసి.. విజయం సాధించిన ఆయన, అప్పటి నుంచి విజయ పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. 2018లో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా రెండోసారి విజయం సాధించారు. మూడోసారి బరిలో నిలిచి హాట్రిక్ సాధించేందుకు అడుగులు వేస్తున్నారు.
ప్రజలతో మమేకం సుంకె రవిశంకర్
మొదటిసారి చొప్పదండి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నిత్యం ప్రజలతో మమేకం అవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఐదేండ్లలో నియోజకవర్గ ముఖ చిత్రాన్నే మార్చివేశారు. ప్రాజెక్టుల నుంచి నియోజకవర్గానికి నీళ్లు తీసుకొని రావడం, వరదకాలువ తూముల ద్వారా సాగుకు నీరు అందేలా చూడడం, ‘పొద్దు పొడుపు’ పేరిట నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిర్విరామంగా పనిచేస్తున్న సుంకె రవిశంకర్కు చొప్పదండి నుంచి మరోసారి పోటీచేసేందుకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించారు. 2007 నుంచి 2009 వరకు ప్రజారాజ్యం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా, మానకొండూర్, పెద్దపల్లి కమిటీల ఏర్పాటు ఇన్చార్జిగా కొనసాగారు. 2009 డిసెంబర్లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అక్కడి నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూనే.. చొప్పదండి అభివృద్ధి కోసం తన వంతు పాత్రను పోషించారు. ఈ తరుణంలో 2018లో చొప్పదండి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ తరపున ఎన్నికయ్యారు. కొండగట్టు పుణ్యక్షేత్రం అభివృద్ధి గురించి సీఎం కేసీఆర్కు విన్నవించి నిధులు మంజూరు చేయించారు. చొప్పదండిలో చాలా మండలాలు.. ఒకనాడు కరువుకు కేరాఫ్గా ఉండేవి. కానీ నేడు అవే బంగారు భూములుగా మారాయి. ఈ నేపథ్యంలో రెండోసారి ఇదే గడ్డపై నుంచి విజయం సాధించడానికి సుంకె పావులు కదుపుతున్నారు.
క్రికెటర్ నుంచి రాజకీయ నాయకుడిగా పాడి కౌశిక్రెడ్డి
కౌశిక్ రెడ్డి ఆజానుబావుడు. చూడగానే గుర్తించే రూపం ఆయనది. రూపానికి తగినట్టుగానే ఆయన మనసు కూడా ఉంటుంది. ఏదైనా సమస్య పరిష్కారం కోసం పట్టుబడితే, అది పూర్తయ్యేదాకా విడిచిపెట్టరు. ఆయన తండ్రి సాయినాథ్రెడ్డికి 2001 నుంచి బీఆర్ఎస్తో కొనసాగిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. నిజానికి కౌశిక్రెడ్డికి క్రికెట్పై అమితాసక్తి. పట్టుదలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడారు. తర్వాత రాజకీయాలవైపు మళ్లారు. 2009లో అప్పటి సీఎం వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్లో చేరి, యువనేతగా నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్నారు. 2018లో జరిగిన హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థి ఈటల రాజేందర్కు గట్టి పోటీ ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు అకర్షితుడై 2021 జూలై 21న బీఆర్ఎస్లో చేరారు. గతేడాది జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున విస్తృత ప్రచారం చేసి తనదైన ముద్రవేశారు. తాను ఓడిపోయినా కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన అధినేత కేసీఆర్ 2021 డిసెంబర్ 2న ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 2023 మార్చి 4న మండలి విప్గా నియమితులయ్యారు. 2023 ఏప్రిల్ 19 నుంచి బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జిగా కొనసాగుతూనే.. వంద కోట్ల నిధులు తెచ్చి హుజూరాబాద్ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి.. కౌశిక్రెడ్డికి అవకాశం కల్పించారు. ఈ ప్రాంతంపై తనకున్న పట్టుతో అద్భుతమైన విజయం సాధించేందుకు ఆయన తన వ్యూహరచన చేస్తున్నారు.