మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం మరో విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సూపర్ హిట్ అయిన కేసీఆర్ కిట్ పథకం స్ఫూర్తిగా ఇప్పుడు గర్భిణుల ఆరోగ్యంపై దృష్టిపెట్టింది. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో అత్యధికంగా అనీమియా (రక్తహీనత) ప్రభావం ఉన్న తొమ్మిది జిల్లాల్లో పంపిణీ చేయడంతో సత్ఫలితాలు రాగా, ఇక రాష్ట్రవ్యాప్తంగా అందజేయాలని సంకల్పించింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లాకు 750 కిట్లు చేరుకోగా, కాబోయే తల్లులకు త్వరలోనే పంపిణీ చేసేందుకు వైద్య,ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నది.
– పెద్దపల్లి, మే16
పెద్దపల్లి, మే16: తల్లి ఆరోగ్యమే బిడ్డకు శ్రీరామ రక్ష. గర్భిణులు ఆరోగ్యంగా ఉంటే కడుపులోని పిండం ఆరోగ్యంగా ఎదుగుతుంది. అందుకు పౌష్టికాహారం తప్పనిసరి. కానీ రాష్ట్రంలో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన చాలా మంది గర్భిణులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు ప్రసవ సమయంలో ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. అవగాహన రాహిత్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి దుస్థితి పూర్తిగా తొలగిపోవాలని, ప్రసవ సమయంలో ఆడబిడ్డలకు ఎలాంటి అనారోగ్య ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర సర్కారు సంకల్పించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. గర్భందాల్చిన 3 నుంచి 6నెలల మధ్య ఒకసారి, 6 నుంచి 9 మాసాల మధ్య రెండో సారి కిట్ ఇవ్వనున్నది.
రక్తహీనత నుంచి విముక్తి..
మాతా, శిశు సంరక్షణకు మొదటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యంమిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వసతులను కల్పించడంతో పాటు కేసీఆట్ కిట్ వంటి విప్లవాత్మక పథకాలను తీసుకొచ్చారు. సర్కారు దవాఖానాల్లోనే ప్రసవాల సంఖ్యను గణనీయంగా పెంచేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఎనీమియా లోపంతో గర్భిణులు పడుతున్న అవస్థలను, ప్రాణాంతకమైన ముప్పు నుంచి వారిని బయటకు తీసుకు వచ్చేందుకు నూట్రిషన్ కిట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రక్తహీనత(ఎనీమియా) లోపం అన్నది గర్భిణులకు శాపంగా మారుతోంది. అలాంటి వారికి ప్రసవాలు సంక్లిష్టంగా మారుతున్నాయి. ఎనీమియా నివారించడంతో మాతృ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ న్యూట్రిషన్ కిట్ను అందజేస్తున్నది.
కిట్లో ఏముంటాయంటే..
ఎనీమియాతో బాధపడే గర్భిణులకు పౌష్టికాహారం అందించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రధాన ఉద్దేశం. ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్స్లను పోషకాహారం ద్వారా అందించి రక్తహీనత తగ్గించడం, హీమోగ్లోబిన్ శాతం పెంచడం ఈ కిట్ల పంపిణీ లక్ష్యం. ఒక్కో కిట్కు రూ.1962 చొప్పున ప్రభుత్వం వెచ్చిస్తున్నది. కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కిలో ఖర్జూర, ఐరన్ సిరప్ మూడు బాటిల్స్, 500 గ్రాముల నెయ్యి, అల్బెండజోల్ మాత్రలు, కప్పు, ప్లాస్టిక్ బాస్కెట్ వంటివి కిట్లో ఉంటాయి.
జిల్లాకు చేరిన 750 కిట్లు
గర్బిణుల్లో రక్తహీనత తగ్గించి, మాతృమరణాలను నివారించడమే లక్ష్యంగా ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ శ్రీకారం చుట్టింది. తొలుత అత్యధికంగా ఎనీమియా (రక్తహీనత) ప్రభావం ఉన్న తొమ్మిది జిల్లాలు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, వికారాబాద్లో ప్రారంభించి, అందజేసింది. ఇప్పుడు మిగిలిన జిల్లాలో అందజేయాలని నిర్ణయించి, జిల్లాలకు సరఫరా చేస్తున్నది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లాకు 750 న్యూట్రిషన్ కిట్లు చేరాయి. పెద్దపల్లి ఎంసీహెచ్కు 524, గోదావరిఖని దవాఖానకు 158, మంథని ఎంసీహెచ్కు 68 కిట్లు పంపించగా వీటిని త్వరలోనే గర్భిణులకు అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.