శంకరపట్నం, జూన్ 3: తెలంగాణలో వ్యవసాయం దండుగ కాదు పండుగ అని నిరూపించిన ఘనత సీఎం కేసీఆర్దేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ పేర్కొన్నారు. శనివారం శంకరపట్నం మండలంలోని 6 క్లస్టర్ రైతు వేదికల్లో రైతు దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాచాపూర్లో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను 22 రోజుల పాటు జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. ఒకో రోజు ఒకో అంశంపై రాష్ట్రంలో సాధించిన అభివృద్ధిని చాటుతున్నామని చెప్పారు. 20 ఏళ్ల క్రితం తెలంగాణలో ప్రజలు బికుబికుమంటూ జీవించేవారని, అటు మావోయిస్టులు ఇటు పోలీసుల మధ్య బతుకువెల్లదీసేవారన్నారు. నిత్యం రైతు ఆత్మహత్యల వార్తలు వింటుండేవాళ్లమన్నారు. నాడు టీడీపీ, కాంగ్రెస్ల పాలనలో కరెంటు కోతల వల్ల రైతులు ఇబ్బందులు పడేవారని, క రెంట్ ఎప్పుడు వస్తుందో..? ఎప్పుడు పోతుం దో తెలియక రాత్రంతా బావుల వద్దే పడిగాపులు కాసేవారని గుర్తు చేశారు. ఇంకా ఎరువుల కోసం రైతులు దుకాణాల వద్దకు వెళ్లి చెప్పులను వరుసలో పెట్టిన పరిస్థితులు ఇంకా కండ్లముందే కదలాడుతున్నాయని, ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. నాటి దుస్థితిని సీఎం కేసీఆర్ పూర్తిగా మార్చివేశారని, వ్యవసాయాన్ని పండుగలా చేశారని వివరించారు.
కరెంటు బిల్లులు పెంచవద్దని అప్పటి సీఎం చంద్రబాబుకు లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు. ఈ పరిస్థితిని మార్చాలని ప్రొఫెసర్ జయశంకర్ నేతృత్వంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడితే కరెంటు ఉండదని, తీగలపై రైతులు బట్టలు ఆరేసుకోవాల్సి ఉంటుందని అప్పటి సీఎం కిరణ్కుమార్ ఎద్దేవా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ సీఎం కేసీఆర్ సాగుకు 24 గంటల కరెంట్ ఇచ్చి కిరణ్కుమార్రెడ్డి మాటలు తప్పని నిరూపించారని చెప్పారు. సేద్యానికి నిరంతర కరెంటు, సమృద్ధిగా కాళేశ్వరం జలా లు, రైతు బీమా, రైతు బంధు, తదితర పథకాల తో తెలంగాణలో రైతు రాజ్యం వచ్చి వ్యవసాయం పండుగలా మార్చారని కొనియాడారు. కిందికి పారే గోదావరిని ఎత్తిపోసి కోటి ఎకరాల మాగాణాన్ని సస్యశ్యామలం చేసి కాళేశ్వరం ప్రాజెక్టుతో ఘన చరిత్ర సృష్టించారన్నారు.
నాడు రాష్ట్రంలో 68 లక్షల 17వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే నేడు దాదాపు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించే స్థాయికి చేరుకున్నామన్నారు. తెలంగాణ తప్ప దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతులు పండించిన ధాన్యాన్ని కొనడం లేదని, ఇంతటి అభివృద్ధి ఫలాలు కేవలం సీఎం కేసీఆర్తో మాత్రమే సాధ్యమయ్యాయని వినోద్కుమార్ ఉద్ఘాటించారు. అనంతరం నూతనంగా నిర్మించిన రైతు వేదిక మందిరాన్ని ఎమ్మెల్యే రసమయితో కలిసి ప్రారంభించారు. మధ్యాహ్నం వినోద్కుమార్తో పాటు ఎమ్మెల్యే రసమయి, సుడా చైర్మన్ జీవీ రామక్రిష్ణారావు కాచాపూర్కు రాగా, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. యువకులు బైక్లపై ర్యాలీగా రాగా, రైతులు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లను అందంగా అలంకరించి వెంట వచ్చారు. పలికారు. బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు వారిని గజమాలతో సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా, ఎమ్మెల్యే రసమయి తనదైన బాణీలో ఉద్యమ పాటలు పాడి ప్రజలను అలరించారు. ఈ సందర్భంగా యువరైతు నాగిరెడ్డి తెలంగాణలో వ్యవసాయంలో వచ్చిన మార్పులను చక్కగా వివరించారు. ఇక్క డ ఎంపీపీ సరోజన, జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రావు, సర్పంచ్ కొండ్ర రాజయ్య, వైస్ ఎంపీపీ రమేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మైపాల్, ఏడీఏ శ్రీనివాస్, ఉప సర్పంచ్ మల్గరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కేసీఆర్ పాలనలో రైతు కండ్లలో ఆనందం
సీఎం కేసీఆర్ పాలనలో రైతు రాజ్యం సిద్దించింది. కర్షకుడి కండ్లలో ఆనందం చూస్తున్నాం. నాడు సీమాంధ్ర పాలకులు దండుగ అన్న వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే. ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రజల బతుకులు ఎంత బాగుంటాయో సాధించి చూపించారు. ఇకడి ప్రజల ఆశీర్వాదంతోనే నేను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవగలిగా. రైతు దినోత్సవం జరుపుకోవడం దేశంలోనే కేసీఆర్ ఘనతగా చెప్పుకునే రోజులు వచ్చాయి. రైతు రాజ్యం రావాలంటే తెలంగాణ రావాలని కేసీఆర్ ఆకాంక్షించి నెరవేర్చారు. చంద్రబాబును నాడు కరెంట్ బిల్లులు తగ్గించాలని ఉద్యమం చేస్తే రైతులను పిట్టల్లా కాల్చి చంపించాడు. ఉద్యమ కాలంలో నేను ఉద్యమ పాటలతో కేసీఆర్ వెంట నడిచా. తెలంగాణ వస్తేనే రైతులు గొప్పగా బతుకుతారని ఆకాంక్షించాం. నాడు సరార్కు తహసిల్ కట్టే స్థితి నుంచి నేడు సర్కారే రైతుకి పెట్టుబడి అందించే స్థితికి తెచ్చాం. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుతో మూడు కాలాలలో రైతులకు నీళ్లు అందించే స్థితికి చేరుకున్నాం. మండుటెండలలో చెరువులు, కుంటలు జలకళతో కళకళలాడుతుండగా రైతులు ఆనందంతో నీళ్ల పండుగ జరుపుకుంటున్నారు. ఇదంతా నేడు తెలంగాణ సాధించిన ఘనత.
– రసమయి బాలకిషన్, మానకొండూర్ ఎమ్మెల్యే