కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 22: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ నడిబొడ్డున అద్భుతంగా నిర్మించిన ‘కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్హౌస్’ బోర్డును సోమవారం తొలగించారు. దశాబ్దాల కింద నిర్మించిన కరీంనగర్ ఆర్అండ్బీ అతిథి గృహం శిథిలావస్థకు చేరుకోవడంతో కేసీఆర్ ప్రభుత్వం 7.50 కోట్లు వెచ్చించి జీ ప్లస్ వన్ పద్ధతిలో సకల హంగులతో ఆధునిక భవనాన్ని నిర్మించింది.
దీనికి కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్గా పేరు పెట్టింది. గతేడాదే దీనిని అప్పటి మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న గెస్ట్ హౌస్ల్లో ఇది అద్భుతంగా ఉండడంతో అందరి దృష్టినీ ఆకర్శించింది. అయితే తాజాగా ఈ గెస్ట్ హౌస్ నేమ్ బోర్డును తొలగించడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఎవరు తొలగించారనేది..? ఆర్అండ్బీ అధికారులు కూడా స్పష్టత ఇవ్వడం లేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితోనే కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్తో ఉన్న బోర్డును తొలగించిందన్న విమర్శలు వస్తున్నాయి. మరో పక్క జరిగిన ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులపైనే ఆరోపణలు సంధిస్తున్నారు. కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ పేరులో కేసీఆర్ అనే పదం వస్తున్నదన్న అక్కసుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పేరు తొలగించదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కరీంనగర్ జిల్లాకే తలమానికంగా మారిన కరీంనగర్ సర్యూట్ రెస్ట్ హౌస్ బోర్డును ఎవరు తొలగించారో..? ఎందుకు తొలగించారో..? నగర ప్రజలకు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉన్నది. గతంలో చాలా పార్టీలకు చెందిన వ్యక్తులు కరీంనగర్ పేరును మార్చాలని ప్రగల్భాలు పలికారు. ఇది వాళ్ల పనేనా..? అని అనుమానం వస్తున్నది. ఏదేమైనా బోర్డును తిరిగి యథావిధిగా ఏర్పాటు చేయాలి.
– ఒక ప్రకటనలో కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్రావు
కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్హౌస్ పేరిట ఉన్న బోర్డు తొలగింపు పని మంత్రి పొన్నం ప్రభాకర్దేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఒక ప్రకటనలో ఆరోపించారు. కరీంనగర్ పేరును గొప్పగా చెప్పుకునేలా ఆధునిక హంగులతో భవనాన్ని నిర్మించి కరీంనగర్ సర్యూట్ రెస్ట్ హౌస్ అని పేరు పెడితే, దీనిని తొలగించి మంత్రి పొన్నం ఆర్అండ్బీగా మార్చుకుంటున్నారని దుయ్యబట్టారు.
ఈఈ అతిథి గృహానికి కరీంనగర్ పేరు ఉండడం పొన్నం ప్రభాకర్కు ఇష్టం లేదా..? కరీంనగర్కి గొప్ప పేరు రావడం నచ్చడం లేదా..? చెప్పాలని ప్రశ్నించారు. కరీంనగర్ అనే పదంపై పొన్నంకు ఎందుకంత కోపమో..? చెప్పాలని, ఇక్కడి ప్రజలు ఆయన్ను మూడుసార్లు ఓడించారనే ఆక్రోశమా..? లేక ఆ పేరులో కేసీఆర్ కనిపిస్తున్నారనే ఆందోళనతోనా..? చెప్పాలని ప్రశ్నించారు. గతంలో కరీంనగర్ పేరు మార్చాలని బీజేపీ నాయకులు మాట్లాడారని, ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఒక్కటై కరీంనగర్ పేరు ఎకడా కనిపించకుండా చేస్తున్నాయని విమర్శించారు.