సేద్యంలో ఎలా ముందుకెళ్లాలి.. ఏ సీజన్లో ఏ పంట వేయాలి..? నష్టాలు ఎలా అధిగమించాలో సంపూర్ణ అవగాహన కోసం కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన రైతు వేదికలు సరికొత్తగా మారుతున్నాయి. ఇప్పటిదాకా కర్షకుల ముచ్చట్లకు కేంద్రాలుగా మారి, విజ్ఞానాన్ని పంచిన వేదికలు దృశ్యమాలికలుగా రూపుదిద్దుకుంటున్నాయి.
అన్నదాతలకు సాగులో మరిన్ని మెళకువలు, సాగులో సస్యరక్షణ చర్యల కోసం నేరుగా సంబంధిత శాస్త్రవేత్తలు, రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేస్తుండగా, పైలెట్ ప్రాజెక్టు కింద ఉమ్మడి జిల్లాలో తిమ్మాపూర్, మల్యాల, సిరిసిల్ల, గుండారం వేదికలకు చాన్స్ దక్కింది. ఇప్పటికే ఆయా సెంటర్లలో వీడియో కాన్ఫరెన్స్ పరికరాల ఇన్స్టాలేషన్ ప్రక్రియ చివరి దశకు చేరగా, త్వరలోనే ప్రారంభించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.
– కరీంనగర్, జనవరి 14 (నమస్తే తెలంగాణ)
రైతుల పక్షపాతిగా ముద్రపడిన కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయంలో అనేక సంస్కరణలు తెచ్చింది. రైతులు ఒక చోట సమావేశమై వారి సమస్యలను చర్చించుకుని అవగాహన పెంచుకునేందుకు, ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు, రాయితీలు వంటి ప్రయోజనాల గురించి సమగ్రంగా తెలుసుకునేందుకు ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో ప్రతి 5వేల హెక్టార్లకు ఒక క్లస్టర్గా విభజించి దానికి ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించింది. వ్యవసాయ విస్తర ణ అధికారి పర్యవేక్షణలోనే రైతు వేదికలు నిర్మించి, సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి వేదికలో రైతుల ప్రాతినిథ్యం ఉండేలా రైతుబంధు సమన్వయ సమితుల పేరిట రాజ్యాంగ బద్ధమైన కమిటీలను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా రైతు వేదికలను రైతులు ఎంతోగొప్పగా వినియోగించుకునేలా ప్రోత్సహించింది.
కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన రైతు వేదికలను మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. అందులో భాగంగా కొన్నింటిలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నది. వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వంలోనే ఇలాంటి ఆలోచనలు జరిగాయి. క్లస్టర్ పరిధిలో రైతులు ఎలాంటి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి..? భూముల రకాలను బట్టి ఏ పంటలు వేస్తే లాభం జరుగుతుంది..? రైతు వేదికల పరిధిలో ఏ రోజు వాతావరణం.. ఎలా ఉంది..? అనే సమగ్రమైన వివరాలను ఇక్కడి నుంచే అందించాలని కేసీఆర్ సర్కారు ఆలోచనలు చేసింది.
చివరికి రైతులు పండించిన ఉత్పత్తులకు ఆ సీజన్లో గిట్టుబాటు ధరలు రాకుంటే రైతు బంధు సమితుల ఆధ్వర్యంలో భద్రపర్చి డిమాండ్ ఏర్పడినపుడు విక్రయించుకునే పరిస్థితులు రైతులకు రావాలనే భావించింది. అయితే, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం రైతులకు వీడియో కాన్ఫరెన్స్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి.
మొదట పైలెట్గా ప్రతి నియోజకవర్గానికి ఒక రైతు వేదికను తీర్చిదిద్దాలని భావించిన సర్కారు, ఇప్పుడు పైలెట్గా జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని తుది నిర్ణయం తీసుకుంది. వీడియో కాన్పరెన్స్ల ద్వారా వ్యవసాయ శాఖతోపాటు దానికి అనుబంధంగా ఉన్న ఉద్యాన, పట్టు, మల్బరీ, మత్స్య, పశుసంవర్ధక, విద్యుత్, నీటి పారుదల శాఖలకు సంబంధించిన సేవలను కూడా రైతులకు అందుబాటులోకి తేబోతున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతు వేదికల్లో నాలుగింటిని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని ఎంపిక చేశారు. కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్, జగిత్యాల జిల్లాలో మల్యాల, పెద్దపల్లి జిల్లాలో గుండారం, సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రైతు వేదికల్లో సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే వీటిని ప్రారంభించే అవకాశాలున్నాయి.
టీఎస్ స్వాన్ ద్వారా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా అధికారులు రైతులతో నేరుగా కాన్ఫరెన్స్ నిర్వహించుకునే అవకాశం ఏర్పడుతోంది. ఇప్పటి వరకు కేవలం జిల్లా, మండల స్థాయిలో సంబంధిత అధికారులతో హైదరాబాద్లోని కమిషనరేట్ స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ఇప్పుడు రైతులకు కూడా కలుగబోతున్నది.
రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించడం వల్ల ఎన్నో ప్రయోనాలు ఉంటాయి. రైతులకు నిపుణులతో శిక్షణ కూడా ఇవ్వవచ్చు. సాగులో వచ్చే మార్పులు, ఆధునిక వ్యవసాయ విధానాలను ఎప్పటికపుడు రాష్ట్ర, జిల్లా స్థాయిలో అందించే అవకాశం ఏర్పడుతుంది. రైతులు వ్యవసాయంపై మరింత అవగాహన పెంచుకుని సమయానుకూలంగా సస్యరక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జిల్లాకు ఒక రైతు వేదికను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇపుడు అదే పనిలో ఉన్నాం. అయితే వీటిని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించబోతున్నాం.
– వాసిరెడ్డి శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారి, కరీంనగర్