దేశంలో పెను మార్పు కోసం మహోద్యమనేత కేసీఆర్ పిడికిలి బిగించారు. నాడు స్వరాష్ట్ర సాధన కోసం కదిలిన ఆయన, నేడు ఉజ్వల భారత్ కోసం అడుగు వేశారు. రెండు దశాబ్దాల క్రితం ఉద్యమపార్టీకి పురుడు పోసి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునఃప్రతిష్టించి, అనతికాలంలోనే రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారు. ఇప్పుడు 75 ఏండ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఆగమైన దేశ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు సంకల్పించారు. దసరా శుభముహూర్తాన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చగా, ఆయన సాహసోపేత నిర్ణయాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలు స్వాగతిస్తున్నారు. 21 ఏండ్ల పార్టీ ప్రస్థానంలో అడుగడుగునా వెంట నడిచినట్టుగానే.. భారత్ రాష్ట్ర సమితికి అండగా ఉంటామని ప్రతినబూనుతున్నారు.
కరీంనగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) అక్టోబర్ 5: గులాబీ పార్టీ 21 ఏండ్ల ప్రస్థానంలో ఎన్నో మలుపులకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వేదికైంది. సమైక్య వాదులు బీ(టీ)ఆర్ఎస్ను బలహీన పరచడానికి అనేక కుట్రలు చేసినా.. మరింత ఎత్తుకు ఎదిగింది. సభ్యత్వాల నమోదులోనూ రికార్డు సృష్టించడమే కాదు, ప్రతి ఎన్నికల్లోనూ గెలుపుబావుటా ఎగురవేసింది. రాష్ట్ర సాధన నుంచి బంగారు తెలంగాణ నిర్మాణం వరకు అండగా నిలిచిన ఈ గడ్డ, ఇప్పుడు బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నది. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఇన్నాళ్లూ రాష్ర్టానికే పరిమితమైన గులాబీ పార్టీ ఇక నుంచి దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టడంపై ప్రతి ఒక్కరూ సంతోష పడుతున్నారు. తెలంగాణ గడ్డపై నుంచి ఒక జాతీయ పార్టీ పురుడు పోసుకోవడం చారిత్రాత్మకమని, విజయదశమినాడు ఏది ప్రారంభించినా విజయాలను చేకూరుస్తుందని పేర్కొంటున్నారు. విజన్ ఉన్న వ్యక్తి వెంటే విజయం ఉంటుందని, అది కేసీఆర్కు ఉందనే అభిప్రాయాలను పార్టీ నాయకులే కాదు, మేధావులూ వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిలువెత్తు నిదర్శనం తెలంగాణలో అమలవుతున్న పథకాలు, కండ్ల ముందు కనిపిస్తున్న ఫలాలే అని చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 లక్షలపై చిలుకు సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ బీ(టీ)ఆర్ఎస్ అని, ఇంతటి బలం ఉన్న పార్టీ.. మరింత బలోపేతం కావడానికి అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా దోహద పడుతుందని అభిప్రాయపడుతున్నారు.
2001 ఏప్రిల్ 27 : కేసీఆర్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలుగుదేశం పార్టీకి, తన శాససభ సభ్యత్వానికి రాజీనామా చేసి, టీఆర్ఎస్ ఆవిర్భావానికి నాంది పలికారు.
2001 మే 17 : కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాల వేదికగా ‘సింహగర్జన సభ’ నిర్వహించారు. లక్షలాది మంది సమక్షంలో తెలంగాణ రాష్ట్ర స మితి పార్టీ ఏర్పాటును కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ వచ్చేదాకా మడమ తిప్పబోనని ప్రతి న బూనారు. అప్పటి వరకు ప్రపంచ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఈ సభ విజయవంతం చేసిన ఘనత ఈ గడ్డకు దక్కింది.
2004 జూన్ 7: యూపీఏ ప్రభుత్వానికి మద్దతు పలికిన కేసీఆర్, తనదైన స్థాయిలో చక్రం తిప్పి, ఆ యేడాది జూన్ 7న రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించేలా చేయగలిగారు. అప్పుడు కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. ఈ ఘనత కూడా ఈ గడ్డకే దక్కింది. 2005 జనవరిలో కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు కూడా టీఆర్ఎస్ విజయమే. అప్పుడు కూడా కరీంనగర్ ఎంపీగానే ఉన్నారు.
2006 సెప్టెంబర్ 12: తెలంగాణ కోసం తన పదవిని తృణప్రాయంగా భావించారు. కరీంనగర్ లోక్సభ స్థానానికి రాజీనామా చేశారు.
2006 డిసెంబర్ 7: కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నికల్లో 2,01,582 ఓట్ల మెజార్టీనిచ్చి ఈ గడ్డ ప్రజలు కేసీఆర్ను గెలిపించారు. ప్రత్యేక తెలంగాణవాదానికి మద్దతు పలికారు.
2009 నవంబర్ 11: రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆమరణ నిరాహార దీక్ష కోసం బయలు దేరిన కేసీఆర్ను అల్గునూరు చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు ఈ ప్రాంత ప్రజలు ఎదురేగి కేసీఆర్కు మద్దతుగా నిలిచారు. ఈ గడ్డపై జరిగిన అరెస్ట్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.
2011 సెప్టెంబర్ 23: సకలజనుల సమ్మెకు కరీంనగర్ గడ్డ మీద నుంచే ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో జరిగిన సభలో సకలజనుల చారిత్రక సమ్మెకు రణభేరీ మోగించారు. ఈ సమ్మె యావత్తు దేశం దృష్టిని ఆకర్షించింది.
2012 నవంబర్ 7, 8: తేదీల్లో టీఆర్ఎస్ రెండు రోజుల పాటు కార్యవర్గ స మావేశాలను కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ప్రతిమ హోటల్ వేదికగా ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో అనేక వి ప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.
2013 సెప్టెంబర్ 7: తెలంగాణ సాధనకు పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణా శిబిరాలను నిర్వహించి తొలి శిబిరాన్ని హుజూరాబాద్ కేంద్రంగా ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఆనాడు బ్రోచర్లు, పుస్తకాల ద్వారా అందించిన సమాచారం, నాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి ఆనాడు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించిన తీరు ఉద్యమం వైపు అందరినీ కదిలించింది.
2014 ఏప్రిల్ 13: ఆనాడు జరిగిన సార్వత్రిక ఎన్నికలకు శ్రీ రాజరాజేశ్వర కళాశాల వేదికగా జరిగిన బహిరంగ సమావేశంలో తొలి సమర శంఖారావం పూరించారు. అద్భుత విజయాన్ని సాధించి తొలిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టింది.
2014 ఆగస్టు 5: ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తదుపరి ఆనాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి అధికారిక పర్యటన చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలో సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా తొలగించేందుకు మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు ఈ గడ్డపై నుంచి ప్రకటించారు. ఈ పథకం ప్రస్తుతం దేశ దృష్టిని అకర్షించడమే కాదు.. యావత్ దేశానికి రోల్మాడల్గా నిలిచింది.
2015 జూలై 4: రాష్ట్రంలో అంతరించిపోతున్న అటవీ సంపద పెంచాలన్న లక్ష్యంతో చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని మొదట హుస్నాబాద్లో ప్రారంభించారు. ప్రస్తుతం దిగ్విజయంగా కొనసాగుతున్నది.
2016 మే 2: ప్రాజెక్టుల రీ డిజైనింగ్కు శ్రీకారం చుట్టిన తర్వాత కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దడంలో భాగంగా ఆనాటి ఉమ్మడి జిల్లాలోని మేడిగడ్డ వద్ద కాళేశ్వర ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేశారు. ఈ పథకం పనులు ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని స్వల్పకాలంలో పూర్తిచేసి రికార్డు సృష్టించడానికి ఈ గడ్డ వేదికైంది.
2018 ఫిబ్రవరి 26: రైతాంగ చరిత్రలో నూతన అధ్యాయానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ అంబేద్కర్ మైదానంలో జరిగిన సభా వేదికగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాదు.. రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఇదే వేదికపై నుంచి ప్రకటించారు.
2018 మే 10: లక్షలాది మంది రైతుల ఆశలకు జీవం పోస్తూ హుజూరాబాద్ నియోజకవర్గం శాలపల్లి- ఇందిరానగర్ వేదికగా జరిగిన సభలో రైతు బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ పథకాన్ని అన్ని రాష్ర్టాలు అమలు చేసే యోచనలో ఉన్నాయి.
2018 సెప్టెంబర్ 7: ప్రభుత్వాన్ని రద్దుచేసిన తర్వాత తొలి ఎన్నికల ప్రచారాన్ని ప్రజా ఆశీర్వాద సభ పేరుతో పూర్వ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ గడ్డ వేదికగా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు.
2019 జనవరి 1: రెండోసారి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు వచ్చారు. ప్రాజెక్టుల బాటతో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. 1న రాత్రి తీగలగుట్టపల్లికి చేరుకుని, 2న మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్హౌస్ను పరిశీలించారు. 3న రోడ్డుమార్గాన కన్నెపల్లి నుంచి అన్నారం దాకా గ్రావిటీ కెనాల్, సుందిళ్ల బ్యారేజీ, సుందిళ్ల, రాజేశ్వరరావుపేట పంప్హౌస్లను పరిశీలించారు.
2019 మార్చి 6: పార్లమెంట్ ఎన్నికల మొదటి సన్నాహక సమావేశాన్ని ఎస్ఆర్ఆర్ కళాశాల వేదికగా ఏర్పాటు చేయగా.. ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సభ యావత్తు రాష్ట్రంలోని టీఆర్ఎస్ శ్రేణులకు ఒక దిశానిర్దేశంలా నిలిచింది.
2021 ఆగస్టు 16: దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధుకు శ్రీకారం చుట్టారు. హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా ఈ పథకం ప్రారంభించి సరికొత్త చరిత్ర సృష్టించారు. మొదట హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. ఇప్పటి వరకు 13 వేలకుపైగా కుటుంబాలకు యూనిట్లు అందించగా, దళితబిడ్డలకు ఒక భరోసా దొరికింది. ఇక్కడ సత్ఫలితాలు ఇవ్వడంతో ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. నియోజకవర్గానికి 1500 యూనిట్లు అందింస్తున్నారు.
2022 ఆగస్టు 29: పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభలో దేశ రాజకీయాలను ప్రస్తావించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇదే వేదికపై నుంచి జాతీయ రాజకీయాల్లో వెళ్దామని ప్రకటించారు. బీఆర్ఎస్ విషయాన్ని ప్రస్తావించకుండానే.. జాతీయ రాజకీయాలకు వెళ్లేందుకు మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరారు.
2022 అక్టోబర్ 5: దేశ ప్రజల అభ్యున్నతిని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ నూతన జాతీయ పార్టీని ప్రకటించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఆయన బుధవారం మధ్యాహ్నం 1.19 గంటలకు ప్రకటన చేశారు. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. అధినేత కేసీఆర్తోపాటు 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు ఆ తీర్మానంపై సంతకాలు చేశారు. ఈ సమావేశానికి సుమారు 8 రాష్ర్టాలకు చెందిన నేతలు కూడా హాజరయ్యారు.
దేశమంతా ఆసరా అయితడు
మాది నిరుపేద కుటుంబం. నేను కిరాణా దుకాణం నడిపిస్తున్న. నా భార్య కూలి పనికి పోతది. కష్టాలతో బతుకుబండిని ఎల్లదీస్తున్నం. తెలంగాణ వచ్చినంక మా అసోంటి దివ్యాంగులకు మంచి రోజులు వచ్చినయ్. రూ.3016 పింఛన్ ఇచ్చి కేసీఆర్ సార్ మమ్మల్ని ఆదుకుంటున్నడు. ఏ దారి లేనోళ్లకు దేవుడే దిక్కు అన్నట్లు మాకు ఆయనే దిక్కైండు. ఇప్పుడు కొత్తగా బీ(టీ)ఆర్ఎస్ పార్టీ పెట్టిండని మా పిలగండ్లు చెప్పింన్రు. ఇప్పటికే పార్టీ ఉన్నంక మళ్లీ గిదెందుకు పెట్టిండని అడిగిన. ఆ పార్టీ మన తెలంగాణ మందమే పని చేస్తది, ఇప్పుడు పెట్టిన బీఆర్ఎస్ దేశం మొత్తం పని చేస్తదని చెప్పింన్రు. నాకు శానా సంతోషం వేసింది. ఇప్పటిదాక తెలంగాణల ఉన్నోళ్లకే మంచి పథకాలు అందుతున్నయి. ఇగ కేసీఆర్ సార్ ప్రధాని అయితే దేశం మొత్తం గిసోంటి పథకాలు అందుతయి.
– ఇరుగురాల అంజయ్య, దివ్యాంగుడు, కోట్లనర్సింహులపల్లి(గంగాధర)
అందరికీ పెద్ద దిక్కయితడు
కేసీఆర్ సారు ఇండ్రోజులు ఒక్క తెలంగాణకే పెద్ద దిక్కైండు. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి దేశం మొత్తానికి పెద్ద దిక్కయితడని తెల్సి సంబురపడ్డ. నేను కూలి పనికి పోవుకుంట బతుకుతున్న. నాకు రూ.2016 వితంతువు పింఛన్ వత్తంది. కూలి పైసలకు తోడు పింఛన్తోటి సంతోషంగ ఇల్లు గడుస్తంది. తెలంగాణల ఉన్న ముసలోళ్లు, వితంతువులు, దివ్యాంగులు, ఇట్ల తెలంగాణల ఉన్న ప్రతి ఒక్కలకు కేసీఆర్ సార్ ఏదో రకంగా సాయంజేత్తున్నడు. ఆయన ప్రధాని అయితే దేశంల ఉన్న అందరికీ ఇట్లనే ఏదో ఒక సాయం అందుతది. దేశం మొత్తం సంతోషంగా ఉంటది.
– కోరుకండ్ల గంగవ్వ, వితంతువు, బూరుగుపల్లి (గంగాధర)
కేసీఆర్తోనే దేశాభివృద్ధి
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఅర్ సేవలు దేశానికి చాలా అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్ కనుమరుగవుతున్న తరుణంలో కేసీఅర్ భారత్ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించడం గర్వించదగ్గ విషయం. జాతీయ రాజకీయాల్లో మన రాష్ట్ర నాయకుడు పార్టీ నెలకొల్పడం మన రాష్ర్టానికే గర్వకారణం. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమ పార్టీని స్థాపించి, ఎన్నో కాష్టాలతో తెలంగాణను సాధించారు. అంతే కాకుండా అధికారంలోకి వచ్చి రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ మార్చారు. ప్రస్తుతం దేశం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని గుర్తించి కేసీఅర్ భారత్ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించడం సంతోషకరం. కేసీఅర్తోనే దేశం అభివృద్ధి చెందుతుంది.
– యాళ్ల రాజేశ్వర్రెడ్డి, ఎంపీటీసీ, తుమ్మనపల్లి (హుజూరాబాద్ రూరల్)
చారిత్రక నిర్ణయం
సీఎం కేసీఆర్ బీ(టీ)ఆర్ఎస్ ఏర్పాటు చేయడం చారిత్రక నిర్ణయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. రైతుల కోసం తీసుకొచ్చిన రైతు బీమా, రైతు బంధు పథకాలు దేశ రైతాంగానికి అవసరం. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు పెరుగడంతో సామాన్యులపై భారం పడింది. బీఆర్ఎస్తో దేశ ప్రజలకు న్యాయం జరుగుతది.
– కొత్త తిరుపతిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ వెన్కేపల్లి-సైదాపూర్ (సైదాపూర్)