రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సోమవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సముచిత స్థానం దక్కింది. సకల జనుల సంక్షేమానికి పెద్దపీట వేసిన సర్కారు, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఈ యేడాదే ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఇప్పటికే జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వైద్య కళాశాలల ఏర్పాటు పనులు సాగుతుండగా, తాజా నిర్ణయంతో జిల్లాకో వైద్య కళాశాల రానుంది. అలాగే, దవాఖానాల్లో మెరుగైన చికిత్సతోపాటు రోగులకు బలవర్ధకమైన ఆహారం అందించేందుకు డైట్ చార్జీలు పెంచింది. ఇటు సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టింది. పేదోడి సొంతింటి కలను సాకారం చేసేందుకు బ్రహ్మాండమైన స్కీంను అమల్లోకి తేనున్నది. సొంత జాగ ఉంటే రూ.3 లక్షలు ఇవ్వనుండగా, 36 వేల మందికి ప్రయోజనం కలుగనున్నది.
నేతకార్మిక కుటుంబాలకు అండగా నిలిచేందుకు రైతుబీమా తరహాలో నేతన్న బీమా తీసుకురానున్నది. ఆసరా కింద వయసు సడలింపుతో ఈ యేడాది కొత్తగా 42 వేల మందికి పింఛన్లు అందించనున్నది. ‘మన ఊరు.. మన బడి’ కింద 829 పాఠశాలలకు కొత్త రూపు తీసుకురావడంతోపాటు 7 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజనిక్ కిట్లను అందించనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు టూరిజం సర్క్యూట్ కింద శ్రీరాజరాజేశ్వర, అన్నపూర్ణ ప్రాజెక్టులను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నది. మొత్తంగా బడ్జెట్పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా, మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
కరీంనగర్, మార్చి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సోమవారం శాసనసభలో 2,56,958.51కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో గతంలో మాదిరిగానే అన్నివర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసి, నిధుల వరద పారించారు. అందులో ఉమ్మడి జిల్లాకు సముచిత స్థానం కల్పించారు. ఇప్పటికే జగిత్యాల, పెద్దపల్లిలో మెడికల్ కాలేజీల ఏర్పాటు పనులు వేగంగా సాగుతుండగా, తాజాగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇటు విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారు.
సొంత జాగ ఉన్న పేదోడి సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో 3 లక్షల సాయం అందించేందుకు బ్రహ్మాండమైన స్కీంను తేనున్నారు. అలాగే, నేత కార్మికులు, గౌడ కులస్తులు, భవన నిర్మాణ కార్మికుల కోసం సరికొత్తగా పథకాలు తెస్తామని చెప్పారు. 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్లు అందించనున్నారు. అలాగే ‘మన ఊరు.. మన బడి’ కింద పాఠశాలలను ఆధునీకరించనున్నారు. మొత్తంగా సంక్షేమంతోపాటు అభివృద్ధికి పెద్దపీట వేయగా, బడ్జెట్ను ప్రతి ఒక్కరూ స్వాగతించారు. సబ్బండ వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. కరీంనగర్లో తెలంగాణ కులసంఘాల జేఏసీ నాయకులు, సిరిసిల్లలో ఆయా వర్గాల నాయకులు, మెట్పల్లి గీత కార్మికులు సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు.
యాభై దాటినకాన్నించే కష్టాలన్నీ మొదలైతన్నై. పని చేత కాదు. కాళ్లు.. రెక్కలు సక్కగ పనిచేయవ్. కూలీ జేసుకుంటెనే పైస దొరికేది. పైసలకు శానా తిప్పలైతది. అట్లాంటి టైంల పింఛిన్ అత్తె బాగుండు అనిపించేది. కానీ, 65 ఏండ్లత్తెగనీ పింఛిన్ రాకపోయేది. శానా అవస్థలు పడుతున్నం. మాలాంటోళ్ల పరిస్థితిని గమనించే సీఎం సార్ 57 ఏండ్లకే పింఛిన్ ఇత్తండు. ఇట్లాంటి నిర్ణయం తీసుకునుడంటే మామూలు ముచ్చట కాదు. దేవునసోంటి మనిషి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఇది.
– కోట భానయ్య, దుబ్బపల్లి మంథని మండలం
రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న కార్మికుల కోసం సరికొత్త పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడుత లక్ష మందికి సబ్సిడీపై మోటర్ సైకిళ్లను అందజేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించినట్లు మంత్రి హరీశ్రావు ప్రకటించారు. దీని ద్వారా జిల్లాలో 4 నుంచి 5 వేల మందికి ప్రయోజనం చేకూరే అవకాశమున్నది.
పేదల ఆశలు, ఆకాంక్షలకు జీవం పోస్తూ.. ప్రభుత్వం తాజాగా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. సగటు జీవి ఇల్లు కట్టుకునేలా ఊతం ఇచ్చింది. సొంత జాగ ఉన్న వారు డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించుకోవడానికి 3 లక్షల చొప్పున సాయం ఇస్తామని ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో నియోజకవర్గానికి 3 వేల ఇండ్ల చొప్పున కేటాయిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాల్లో 39 వేల మందికి లబ్ధి కలుగనున్నది.
వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి వయో పపరిమితిని ప్రభుత్వం 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ కరోనా కారణంగా అమలులో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని చెప్పిన మంత్రి హరీశ్రావు.. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సడలించిన వయోపరిమితి ప్రకారం కొత్త లబ్ధిదారులకు పింఛన్లను ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో 42 వేల మంది లబ్ధి పొందనున్నారు.
తాజా బడ్జెట్లో ప్రభుత్వం వ్యవసాయరంగానికి పెద్దపీట వేసింది. 24,254 కోట్లను ప్రతిపాదించింది. దీని ద్వారా.. ఉమ్మడి జిల్లాలో ఈ యేడాది రైతుబంధు, రైతు బీమాతోపాటు పలు సబ్సిడీ పథకాల కింద 6.5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది. అలాగే, ఈ మార్చిలోగా 50వేలలోపు, వచ్చే ఏడాది 75 వేల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. దీని ద్వారా లక్షా 80 వేల మంది రైతులకు ప్రయోజనం కలుగునున్నది.
రాష్ట్ర సంక్షేమ సారథి సీఎం కేసీఆర్. ఈసారి బడ్జెట్ రైతు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రవేశపెట్టారు. రానున్న సంవత్సర కాలంలో ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడుతాయి. ప్రతి నియోజకవర్గానికి పుష్కలంగా నిధులు అందుతాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్న.
– కోరుకంటి చందర్, రామగుండం ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో కరీంనగర్ జిల్లాకు మెడికల్ కళాశాల రావడం హర్షణీయం. దీనిని బట్టి సీఎం కేసీఆర్కు జిల్లాపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. మెడికల్ కళాశాల ఏర్పాటు వల్ల జిల్లాలో వైద్య సేవలు మరింతగా మెరుగుపడుతాయి. అనేక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. జిల్లా వాసుల చిరకాల కోరికను సీఎం కేసీఆర్ ఈ బడ్జెట్లో తీర్చినందుకు కృతజ్ఞతలు.
సర్కారు దవాఖానల్లో రోగులకు మంచి పోషకాహారాన్ని అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకోసం డైట్ చార్జీలను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది. టీబీ, క్యాన్సర్ రోగులకు ప్రస్తుతం బెడ్ ఒక్కంటికీ ఇచ్చే డైట్ చార్జీలను 56 నుంచి 112కు, అలాగే సాధారణ రోగులకు ఇచ్చే డైట్ చార్జీలను బెడ్ ఒక్కంటికీ 40 నుంచి 80కి పెంచింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ దవాఖానల్లో రోజుకు సుమారు 1500 నుంచి 2 వేల మంది వరకు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తున్నది. సరాసరి చూసినా రోజుకు వెయ్యి నుంచి 1500 మందికి మంచి ఆహారం అందనున్నది. ఈ పథకం పేద కుటుంబాలకు అండగా నిలువనున్నది. అలాగే, ఆరోగ్య శ్రీ సేవల పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచినట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో 9,76,879 ఆరోగ్య శ్రీ కార్డులుండగా, వేలాది మంది ఈ సేవలను పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఏటా ఉమ్మడి జిల్లాలో లక్షా 50 వేలకుపైగా మంది ఆరోగ్యశ్రీని వినియోగించుకుంటున్నారు.
‘మన ఊరు.. మన బడి’ కింద ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 7,289 కోట్లతో బడులను దశల వారీగా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. దీని కింద ఈ యేడాది 9,123 పాఠశాలలను 3,497 కోట్లతో ఆధునీకరించనున్నది. మన ఉమ్మడి జిల్లాలో 2,514 ప్రభుత్వ బడులు ఉండగా, ఈ యేడాది 829 పాఠశాలలకు కొత్త రూపురానున్నది. రాబోయే విద్యాసంవత్సరం నుంచి 1,971 స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం అమల్లోకి రానున్నది. ఒకే యేడాదిలో 829 పాఠశాలలు అన్ని రకాలుగా ఆధునీకరణకు నోచుకోవడంపై ఇప్పటికే ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతున్నది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలు, జూనియర్ కాలేజీల్లో 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు ప్రభుత్వం ఉచితంగా హెల్త్ అండ్ హైజనిక్ కిట్లను పంపిణీ చేస్తామని ప్రకటించింది. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో లక్ష మంది బాలికలకు లబ్ధి కలుగుతుంది.
నేతన్నలకు అండగా నిలించేందుకు సర్కారు మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతు బీమా తరహాలోనే ఐదు లక్షల రూపాయల నేతన్న బీమా పథకాన్ని ఈ యేడాది నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. నిజానికి సిరిసిల్ల కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రకటించారు. బడ్జెట్లో ప్రవేశపెడుతామని చెప్పారు. ఆ మేరకు తాజా బడ్జెట్లో ప్రకటించారు. ఈ పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలోని 23 వేల మంది మరమగ్గాల కార్మికులు, 1,713 చేనేత కార్మికుల కుటుంబాలకు భరోసా దక్కనున్నది.
బడ్జెట్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడేలా ఉన్నది. అన్ని వర్గాల భవిష్యత్తును నిర్దేశించింది. సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. విద్య, వైద్య రంగాలకు చోటుకల్పించిన సమ్మిళిత బడ్జెట్. సొంత స్థలమున్న పేదలు ఇండ్లు కట్టుకొనేందుకు రూ.3 లక్షలు కేటాయించటం, ఈ ఏడాది 4 లక్షల కుటుంబాలకు వర్తింపజేయటం హర్షణీయం. లక్షమంది భవన నిర్మాణ కార్మికులకు ద్విచక్రవాహనాలివ్వటం చారిత్రాత్మకం.
– తానిపర్తి భానుప్రసాద్రావు, ఎమ్మెల్సీ
పేదోళ్లకు సొంతింటి కలను సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్ సారుకు వేలదండాలు. మాది ధర్మపురి మండలం ఆరెపల్లి. నేను, నా భర్త ఇద్దరం కూలీ పని చేసుకుంట మా ఇద్దరి పిల్లలను చదివించుకుంటున్నం. మా ఊళ్లోనే మాకు గుంటన్నర భూమి ఉంది. దాంట్లోనే చిన్న గుడిసె ఏసుకుని ఉండెటోళ్లం. వానలకు కూలిపోయినంక కిరాయికి ఉంటున్నం. కూలి పైసలు తిండికే సరిపోతున్నయ్. సొంతిల్లు కట్టుకునే యోగం లేదనుకొని కిరాయి ఇంట్లనే ఎల్లదీస్తున్నం. సొంత జాగ ఉన్నోళ్లకు ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు ఇస్తమని మంత్రి హరీశ్రావ్ సారు చెప్తున్నప్పుడు విన్న.. శానా సంతోషమనిపించింది. పేదల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు శతకోటి వందనాలు. ధర్మపురి నరసింహస్వామి దయతో సల్లంగ ఉండాల్నని కోరుకుంటున్న. ఎప్పటికీ ఆ సారు ముఖ్యమంత్రిగ ఉంటెనే గరీబోళ్ల బతుకులు బాగుపడతయ్.
– బట్టల స్వప్న, ఆరెపల్లి, (ధర్మపురి)
కాళేశ్వరం సర్క్యూట్ టూరిజం అభివృద్ధి కోసం 1500 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాళేశ్వరం జలాలతో మధ్యమానేరు వాటర్హబ్గా మారింది. అలాగే అనంతసాగర్ రిజర్వాయర్ రెండు గుట్టల మధ్య ఉన్నది. ఈ రెండు ప్రాంతాలను పర్యాటకకేంద్రాలుగా తీర్చి దిద్దడానికి ఇప్పటికే పర్యాటక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించింది. బడ్జెట్లో నిధులు కేటాయింపు వల్ల ఈ రెండు ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు మార్గం సుగమమైంది.
దళిత బంధు కింద పెద్ద మొత్తంలో లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం తాజా బడ్జెట్లో 17,700 కోట్లను కేటాయించింది. ఇప్పటికే నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారుల చొప్పున.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో 1200 మందికి లబ్ధి చేకూరనున్నది. వచ్చే సంవత్సరానికి రెండు లక్షల మందికి లబ్ధి చేకూరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా సుమారు 5 నుంచి 10 వేల మంది కుటుంబాలకు లబ్ధి కలుగునున్నది.
జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించి, ఇప్పటికే ఆ హామీని అమల్లో పెట్టారు. పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ అనుమతి మేరకు.. సింగరేణి ఆధ్వర్యంలో రామగుండంలో వైద్య కళాశాల పనులు నడుస్తున్నాయి. జగిత్యాలకు గతేడాది మంజూరు కాగా.. పనులు వేగంగా సాగుతున్నాయి. కాగా, కరీంనగర్కు మెడికల్ కాలేజీ ఇవ్వాలని నాటి సమైక్య ప్రభుత్వాల నుంచి ఇక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతూనే ఉన్నారు. ఇన్నాళ్లకు ఆ కల నేరవేరింది. జిల్లా కేంద్రంలో ఇప్పటికే 500ల పడకల దవాఖాన ఉంది. దీనిని 750కి పెంచేందుకు కసరత్తు జరుగుతున్నది. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీని ఈ యేడాదే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తాజాగా, బడ్జెట్లో ప్రకటించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కళాశాల తెచ్చి తీరుతామని గతంలో మంత్రి కేటీఆర్ చెప్పినట్లుగానే.. ఇచ్చింది. కేటీఆర్ కృషితో ఇప్పటికే సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని దవాఖాన 300 బెడ్ల సామర్థ్యానికి పెరిగింది. వేములవాడలో మరో వంద పడకల వైద్యశాల ఆధునిక సౌకర్యాలతో మెరుగైన సేవలందిస్తున్నది. ఇప్పుడు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని చెప్పడంపై రాజన్న సిరిసిల్ల జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైనది. పేదవాడి సొంతింటి కల నెరవేరుతుంది. పేదల కడుపు నింపేలా, యువతకు ఉపాధి కల్పించేలా ఈ బడ్జెట్ ఉన్నది. ఎస్సీల అభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించారు. రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కళాశాలలకు, పామాయిల్ సాగుకు, పర్యాటక రంగానికి, ఎస్సీ, ఎస్టీలు, బీసీ సంక్షేమం కోసం రూ.5698 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమం కోసం రూ.117 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని ఇతర పుణ్యక్షేత్రాలను యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయడానికి బడ్జెట్లో నిధులు కేటాయించారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ఈ బడ్జెట్ ఉన్నది.
– డాక్టర్ ఎం సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే
కార్మికక్షేత్రమైన సిరిసిల్లలో మెడికల్ కాలేజీ రావడం శుభపరిణామం. మెరిట్, రిజర్వేషన్లలో సీటు రాని విద్యార్థులకు ఇది మంచి అవకాశం. రూ.కోట్లు పెట్టి సీటు కొంటున్నారు. దాని కోసం అప్పులు చేస్తున్నారు. మన జిల్లాకు మెడికల్ కాలేజీ రావడం వల్ల డాక్టర్ కావాలన్న పేద విద్యార్థుల కల నెరవేరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడుతాయి. మంత్రి కేటీఆర్ కృషిని జిల్లా ప్రజలు ఎప్పటికీ మరువద్దు. విద్యలో ముందుండి డాక్టర్ కావాలన్న విద్యార్థులు ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఎందరో వాళ్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. కేటీఆర్ చేసిన కృషికి మనకు డాక్టర్ల సంఖ్య కూడా పెరుగుతుంది.
– డాక్టర్ శోభారాణి, ఐఎంఏ వింగ్స్ మహిళా చైర్మన్ (సిరిసిల్ల)
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆదేశానికే ఆదర్శం. దళితబంధుపై విమర్శలు చేస్తున్న వారికిది చెంపపెట్టు. రైతన్నల మాదిరిగానే నేతన్నలకు రూ.5 లక్షల బీమా వర్తింపజేయడం హర్షణీయం. దేశ చరిత్రలో ఏనాడూ చేనేత, మరమగ్గాల కార్మికులను గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ పథకాలతో నేత కార్మికుల బతుకుల్లో వెలుగులు చూస్తున్నాం. 57 ఏళ్ల వయసున్న వారందరికీ వృద్ధాప్య పింఛన్లు ఇచ్చి అండగా నిలుస్తామన్న సర్కారుకు కృతజ్ఞతలు.
అల్లాడి రమేశ్, సెస్ మాజీ చైర్మన్, రాజన్న సిరిసిల్ల