ప్రధాని మోదీ పేద, మధ్యతరగతి కుటుంబాల కడుపుకొడుతుండు. ఇప్పటికే మండిపోతున్న నిత్యావసర ధరలతో సతమతవుతుంటే మరోవైపు గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతూ నడ్డి విరుస్తున్నడు. పేదల గురించి మరిచి తన మిత్రులైన అదానీ, అంబానీలకు మేలు చేస్తున్నడు. ఓ వైపు ధరల పెంపుతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి నోరు మెదుపుతలేరు. గుజరాత్కు గులాంలా మారిన్రు. నేనొక్కటే అడుగుతున్న ఈ ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో మోదీ ఏ ఒక్క వర్గానికైనా మేలు జరిగిందా..? చెప్పాలి. వెంటనే పెంచిన ధరలు తగ్గించాలి.
– పూడూర్లోని కరీంనగర్ -జగిత్యాల ప్రధాన రహదారిపై జరిగిన ధర్నాలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ప్రధాని నిరంకుశ పాలన నశించాలి
ప్రజా వ్యతిరేక విధానాలతో నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోతున్న ప్రధాని మోదీ నిరంకుశ పాలన నశించాలి. పేదోళ్ల కడుపులు కొడుతూ ఉన్నోళ్ల కడుపు నింపుతున్న మోదీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతుంటే సామాన్యుడు ఎలా బతుకుతడు. ఇప్పుడిప్పుడే కట్టెల పొయ్యి వదిలి గ్యాస్పై వంట చేసుకుంటున్న పేదలను పొగచూరిన బతుకుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి తెస్తున్నరు. తెలంగాణ ప్రజలకు మీ కుట్రలు, కుతంత్రాలు అర్థమైనయ్. రానున్న రోజుల్లో మీ భరతం పట్టడం ఖాయం.
– మానకొండూర్లో బీఆర్ఎస్ నిరసనలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
మోదీతో దేశానికి ప్రమాదం
‘ప్రధాని మోదీతో దేశానికి చాలా ప్రమాదం పొంచి ఉంది. దేశ సంపదను తన మిత్రుడు అదానీకి దోచిపెట్టేందుకే ఎడా పెడా ధరలు పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారాన్ని వేస్తున్నడు. ఆయన ప్రధానమంత్రిగా ఉండడం మన దురదృష్టం. ఎనిమిదేండ్ల క్రితం రూ.400 ఉన్న సిలిండర్ ధరను ఇప్పుడు రూ.1200 చేసిండు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రధాని మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు పెంచుతూ దేశ ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నడు. మేమొక్కటే చెబుతున్నాం పెంచిన ధరలను వెంటనే దించాలి. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి గద్దె దించుతం.
– తెలంగాణ చౌక్లో నిర్వహించిన నిరసనలో మంత్రి గంగుల కమలాకర్
కేంద్ర ప్రభుత్వం బండ బాదుడుపై జనం భగ్గుమన్నది. గ్యాస్ ధరలను పెంచడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పోరుబాటపట్టింది. గురువారం పెద్దసంఖ్యలో తరలివచ్చిన మహిళలతో కలిసి కదం తొక్కింది. జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఖాళీ సిలిండర్లు, ప్లకార్డులు పట్టుకొని కేంద్రానికి వ్యతిరేకంగా నినదించారు. పలుచోట్ల బీజేపీ సర్కారు దిష్టిబొమ్మలు దహనం చేశారు. చౌరస్తాల్లో కట్టెల పొయ్యిపై వంటలు చేసి నిరసన తెలిపారు. ‘మోదీ డౌన్ డౌన్.. అచ్చే దిన్ కాదు సచ్చేదిన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. కాగా, కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, మానకొండూర్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కొడిమ్యాలలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొని, కేంద్రం తీరుపై మండిపడ్డారు.
కేంద్రంలోని బీజేపీపై జనం భగ్గుమన్నది. గ్యాస్ ధరల పెంపుపై ఆగ్రహించింది. మంత్రి కేటీఆర్ పిలుపునందుకొని గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి రోడ్లెక్కి ఆందోళనకు దిగింది. కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఎక్కడక్కడ ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో ధర్నాలు చేసింది. పలుచోట్ల సిలిండర్ల పక్కన పడేసి వినూత్న రీతిలో కట్టెల పొయ్యిమీద వంటలు చేసి నిరసన తెలిపింది. బీజేపీ పాలనలో పేదలకు కష్టాలు, కన్నీళ్లు తప్ప ఒరిగిందేమీలేదని, పైగా ఇప్పుడు సిలిండర్ ధరలను ఎడాపెడా పెంచుతూ ప్రజల నడ్డివిరుస్తున్నదని మండిపడింది. వెంటనే ధరలు దించాలని లేదంటే ప్రజాక్షేత్రంలో గుణపాఠం చెబుతామని హెచ్చరికలు జారీ చేసింది. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, మానకొండూర్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పూడూర్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు.
కేంద్రం వంట గ్యాస్ ధరలు పెంచినందుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలతో కలిసి ఆందోళనలు చేపట్టారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ధర్నా నిర్వహించారు. కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసి వంట చేశారు.మంత్రి గంగుల కమలాకర్తోపాటు జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ స్వయంగా వంట చేశారు. మానకొండూర్లోని పల్లెమీద కరీంనగర్-వరంగల్ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించగా, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు పాల్గొన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాలలో జరిగిన ధర్నాలో స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చొప్పదండి పట్టణంలోనూ పార్టీ నాయకులు నిరసనలతో హోరెత్తించారు. హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక ఖాళీ గ్యాస్ సిలిండర్లను ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు.