విద్యానగర్/ కొత్తపల్లి, జనవరి 24: వచ్చే రెండు నెలల్లో వైద్య కళాశాల తాత్కాలిక భవన నిర్మాణ పనులు పూర్తి చేసి, ఆగస్టులో తరగతులు నిర్వహిస్తామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. పేద విద్యార్థులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన గొప్ప వరం ప్రభుత్వ వైద్య కళాశాల అని చెప్పారు. మంగళవారం కొత్తపల్లి మున్సిపల్ పరిధిలోని రాష్ట్ర విత్తన గిడ్డంగుల సంస్థ విత్తన శుద్ధి క్షేత్రంలో రూ.7కోట్లతో చేపట్టనున్న వైద్య కళాశాల తాతాలిక భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసి, విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్లో రెండు ప్రైవేట్ వైద్య కళాశాలలున్నా పేద విద్యార్థుల కోసం సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేశారని, అందుకు కరీంనగర్ జిల్లా ప్రజల తరఫున సీఎంకు, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పలు సార్లు కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు వీలైనంత త్వరగా వైద్య కళాశాల పనులు ప్రారంభించి, ప్రవేశాల కోసం సిద్ధం చేయాలని సూచించారని చెప్పారు. ఈ క్రమంలో విత్తనశుద్ధి క్షేత్రం గోదాంలో తాతాలిక భవన నిర్మాణానికి రూ.7కోట్లు మంజూరు చేశారని తెలిపారు.
నాలుగు గోదాంలతో పాటు 20 ఎకరాల స్థలాన్ని కాలేజీ కోసం కేటాయించామని, ఇందులో తరగతి గదులు, లైబ్రరీ, అనాటమీ ల్యాబ్, బయో కెమిస్ట్రీ ల్యాబ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిసియోలజీ, అడ్మినిస్ట్రేషన్, బ్లాక్ తాతాలిక భవన నిర్మాణ పనులు చేపట్టి ఆగస్టులో 100 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నట్లు చెప్పారు. వచ్చే రెండు నెలల్లో తాతాలిక భవన నిర్మాణ పనులు పూర్తి చేస్తామని, ఆగస్టులో తరగతులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని వివరించారు. పనులను కలెక్టర్, కళాశాల ప్రిన్సిపాల్ పర్యవేక్షిస్తారని తెలిపారు. శాశ్వత భవన నిర్మాణం ప్రస్తుతం టెండర్ దశలో ఉందని, పూర్తి కాగానే సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేస్తారని చెప్పారు. ఇక్కడ జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, నగర మేయర్ వై సునీల్ రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి – హరి శంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మారెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల, కొత్తపల్లి తహసీల్దార్ లక్ష్మీ నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్ ఉన్నారు.