కరీంనగర్ ఐఎంఎల్ డిపో అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారింది. దుకాణాలకు మద్యం కేటాయింపులో అవకతవకలకు పాల్పడుతూ ఉద్యోగులు పెద్ద ఎత్తున డబ్బు దండుకుంటున్నట్లు తెలిసింది. డిపో అధికారులకు సంబంధం లేకుండా స్టాక్ క్రయవిక్రయాల పట్టికను నమోదు చేసే కాంట్రాక్టు ఉద్యోగి మద్యం డిపోను నడిపించడం విమర్శలకు తావిస్తున్నది. సాధారణ కంప్యూటర్ ఆపరేటర్గా చేరిన సదరు ఉద్యోగి డిపోపై పెత్తనం చెలాయించడమే గాకుండా, ఏకంగా నాలుగు వాహనాలు సొంతంగా కొని ట్రాన్స్పోర్ట్ చేస్తుండడం వెనుక అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతున్నది.
– రాంనగర్, ఏప్రిల్ 21
మద్యం దుకాణాల్లో ప్రాంతాలవారీగా అనేక రకాల మద్యం బాటిళ్లు అమ్ముడవుతుంటాయి. వీటిలో ఒకో ప్రాంతంలో ఒకో బ్రాండ్ ఎకువగా కొనుగోలు చేస్తుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మద్యం దుకాణదారులు ఆయా బ్రాండ్లను ఎకువ సంఖ్యలో దిగుమతి చేసుకుంటారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో బీర్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అధిక సంఖ్యలో బీర్లు కొనుగోలు చేస్తారని దుకాణాదారులు కూడా పెద్ద మొత్తంలో స్టాక్ తీసుకునేందుకు డీడీలు తీస్తుంటారు. తమకు అనుకూలంగా అమ్ముడయ్యే మద్యం బ్రాండ్లను ఏ సంఖ్యలో కావాలో దానికి తగిన రేట్లు డీడీ తీసి ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తారు. దానికి అనుగుణంగా మద్యం డిపో నుంచి వారికి ఆయా బ్రాండ్లను సరఫరా చేయాల్సి ఉంటుంది.
మద్యం డిపోలో ఉన్న స్టాక్, బ్రాండ్ల వివరాలను ప్రత్యేకమైన యాప్లో నమోదు చేయడం ద్వారా ఏయే బ్రాండ్ ఎంతవరకు స్టాక్ ఉన్నాయో మద్యం వ్యాపారులు తెలుసుకొని డీడీలు తీసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ యాప్లో బ్రాండ్ల వారీగా స్టాక్ వివరాలు ఉండడంతో మద్యం దుకాణాదారులు వారి డిమాండ్కు తగినట్లు మద్యం దిగుమతి చేసుకునేందుకు డీడీలు తీస్తుంటారు. అయితే, రెండింటిలో వివరాలు చూసి డీడీలు తీసిన వ్యాపారులకు ఒకోసారి వారికి అవసరమైన బ్రాండ్లను ఐఎంఎల్ డిపో నుంచి ఇవ్వడం లేదు. దీనికి ప్రధానంగా చెబుతున్న కారణం రేషన్ పద్ధతిలో మద్యం కేటాయిస్తామని, అడిగినంత ఇవ్వలేమని వ్యాపారులకు తేల్చి చెప్తున్నారు.
ఇండెంట్లో చూసిన తర్వాతే డీడీలు తీశామని, స్టాక్ ఎందుకు ఇవ్వలేరని వ్యాపారులు నిలదీసినా సమాధానం చెప్పేవారు లేరు. డిపోలో ఉన్న మేనేజర్లు కాంట్రాక్టు ఉద్యోగి చెప్పు చేతల్లో నడుస్తూ అవినీతికి పాల్పడుతుండడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. సదరు కాంట్రాక్టు ఉద్యోగి కొందరు వైన్స్ యజమానుల దగ్గర మామూళ్లు తీసుకుంటూ వారు అడిగిన మద్యం బ్రాండ్లను పరిమితికి మించి ఇస్తున్నారని, మామూళ్లు ఇవ్వని వారికి రేషన్ పద్ధతిలో కేటాయిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై పలువురు వైన్స్ యజమానులు ఇప్పటికే డిపో మేనేజర్లకు ఫిర్యాదు చేసినా కాంట్రాక్టు ఉద్యోగి చెప్పు చేతుల్లో ఉండడంతో వారు స్పందించడం లేదని మద్యం దుకాణదారులు వాపోతున్నారు.
కాంట్రాక్టు ఉద్యోగిగా చేరి రూ.కోట్లకు పడగలెత్తిన సదరు ఉద్యోగి ఏకంగా సొంతంగా ట్రాన్స్పోర్ట్ వ్యాపారం కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. నాలుగు డీసీఎం వాహనాలను కొనుగోలు చేసి దుకాణాలకు మద్యం రవాణా చేసే కాంట్రాక్టు కుదుర్చుకొని ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్ ఐఎంఎల్ డిపో నుంచి 248 దుకాణాలకు మద్యం రవాణా అవుతుంది. డీడీలు తీసిన దుకాణాదారులకు ట్రాన్స్పోర్ట్ చేసేందుకు ముందే ఒప్పందం కుదుర్చుకున్న ఈ కాంట్రాక్టు ఉద్యోగి తనకు ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం కల్పించిన దుకాణదారులకు అడిగిన బ్రాండ్లను అడిగినంతగా ఇస్తూ తనకు ట్రాన్స్పోర్ట్ ఇవ్వని దుకాణదారులకు రేషన్ పద్ధతిన కేటాయింపులు చేస్తున్నట్లు మద్యం దుకాణాదారులు ఐఎంఎల్ డిపో మేనేజర్కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మద్యం స్టాక్ వివరాలను నమోదు చేసేందుకు యాప్ను రూపొందించిన ప్రభుత్వం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ అనుభవం కలిగిన ఉద్యోగులను కాంట్రాక్టు పద్ధతిని నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా సీటెల్ అనే కంపెనీ కాంట్రాక్టు దకించుకొని డిపోల వారీగా సిబ్బందిని నియమించింది. ఆ కాంట్రాక్టు పద్ధతిలో చేరిన సదరు ఉద్యోగి ఏకంగా మూడు జిల్లాలకు మద్యం రవాణా చేసే ఐఎంఎల్ డిపోను తన చెప్పు చేతల్లో ఉంచుకొని నడిపిస్తున్నా ఎక్సైజ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
ఇకనైనా సదరు కాంట్రాక్టు ఉద్యోగి అవినీతిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, రూ.కోట్లు పెట్టి దుకాణాలు దకించుకున్నా సరుకు ఇవ్వకపోవడంతో వ్యాపారం జరగడం లేదని మద్యం వ్యాపారులు మొరపెట్టుకుంటున్నారు. ఈ విషయమై ఐఎంఎల్ డిపో మేనేజర్ రవిని సంప్రదించగా, రెండు నెలలుగా రేషన్ పద్ధతిలో మద్యం కేటాయిస్తున్నామని, ఇబ్బందులు ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎలాంటి అవకతవకలు లేవని, మొత్తం 250 మద్యం దుకాణాలకు స్టాక్ను బట్టి రేషన్ పద్ధతిలో కేటాయింపులు జరుగుతాయని తెలిపారు.