పాతాళగంగ పైకొచ్చింది.. కేవలం మీటరు లోతులో ఉంది. గతేడాది ఇదే నెలలో 7 మీటర్లకు పైగా లోతులో ఉండగా, ఈ ఏడాది జూన్లో 8.11 మీటర్ల లోతులో నీటిమట్టం ఉంది. భూగర్భజలాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సత్ఫలితాలు వచ్చాయి. ఈ క్రమంలో జిల్లాలోని 15 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. జూన్లో ఆరు రోజుల 32.1 మి.మీ, జూలైలో 19 రోజుల పాటు 662.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 490 మి.మీ.లు కాగా, 172 మి.మీ.లు అధికంగా కురిసినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మరో రెండేళ్ల పాటు సాగు, తాగునీటికి ఢోకా ఉండదని భూగర్భ జలవనరుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
– కలెక్టరేట్, ఆగస్టు 14
కరీంనగర్ జిల్లాలో గత నెలలో కురిసిన వర్షాలతో పాతాళానికెళ్తున్న గంగమ్మ తిరుగు పయనమైంది. ఈసారి ఆలస్యంగానైనా విస్తారంగా వానలు పడడంతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఏకంగా భూమికి మీటరు లోపే నీరు ఉంది. దీంతో రెండేండ్ల దాకా తాగు, సాగు నీటికి ఢోకా ఉండదని భూగర్భ జల వనరుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వానకాలం సీజన్ ఆరంభమైన నెలన్నర రోజుల వరకు కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. దీంతో ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. విత్తనాలు వేసిన రైతులు చినుకు జాడకోసం ఆకాశానికేసి చూశారు. అనంతరం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఉపరితల ద్రోణి ప్రభావం జిల్లాపై పడింది. దీంతో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. ఫలితంగా జిల్లాలో సగటున 4.19 మీటర్లలోతులోకి భూగర్భజలాలు వచ్చాయి. గతేడాది ఇదే నెలలో 7 మీటర్లకు పైగా లోతులో ఉండగా, ఈ ఏడాది జూన్లో 8.11 మీటర్ల లోతులో నీటిమట్టం ఉంది. ఈ ఏడాది కురవాల్సిన వర్షపాతంలో సగానికి పైగా కేవలం 19 రోజుల్లోనే కురిసింది. తద్వారా గత జూన్తో పోల్చితే 3.92 మీటర్ల పైకి జలం ఉబికి వచ్చింది.
15 మండలాల్లో అధిక వర్షపాతం
జిల్లాలోని 15 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. జూన్లో ఆరు రోజుల పాటు పడిన వర్షాలకు 32.1 మి.మీ, జూలైలో 19 రోజుల పాటు కురిసిన వర్షాలకు 662.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 490 మి.మీ. కాగా, 172 మి.మీ. అధికంగా కురిసినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ వర్షాకాలంలో 26 రోజుల పాటు విస్తారంగా కురిసిన వర్షాలతో జిల్లాలోని 1,397 చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లు నిండుకుండలా మారాయి. వచ్చీపోయే నీటితో కళకళలాడుతుండగా, భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి భూ ఉపరితలానికి సమీపంలోనే నీరు పుష్కలంగా లభిస్తున్నది. దీంతో తాగు నీటికి ఇబ్బందులు ఉండవని ప్రజలు సంతోషపడుతున్నారు. స్వరాష్ట్రంలో మొట్టమొదటగా జలవనరుల సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి.
జిల్లాలో గతంలో కంటే పరిస్థితులు గణనీయంగా మెరుగయ్యాయి. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడిక తీయడం, ఉపాధి హామీ పథకంలో కుంటలు, చెక్డ్యామ్లకు మరమ్మతులు చేపట్టడంతో పాటు ప్రజల చైతన్యం కూడా భూగర్భ జలాల పెంపునకు దోహదపడిందని అధికారులు పేర్కొంటున్నారు. వరుసగా కురిసిన వర్షాలతో పాతాళగంగ పైపైకి రాగా, భూగర్భ జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ఫీజో మీటర్ల ఆధారంగా జిల్లా కేంద్రంతో పాటు గుండి, సైదాపూర్ ప్రాంతాల్లో మీటరు లోపే నీటి నిల్వలు ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నగునూర్, లక్ష్మీపూర్లో రెండు మీటర్ల లోపు, ఇల్లందకుంట, వావిలాల, రాఘవపల్లిలో మూడు మీటర్లలోపు, వెలిచాల, రుక్మాపూర్, బూరుగుపల్లి, గన్నేరువరం, మైలారం, అల్గునూరు, తాడికల్, రాయికల్, హుజూరాబాద్, వీణవంక, మల్యాలలో ఆరు మీటర్లలోపు, చిగురుమామిడిలో పది మీటర్లలోపు నీటి నిల్వలు ఉన్నట్లు భూగర్భ జల వనరుల శాఖ అధికారులు వెల్లడించారు.
సాగు, తాగు నీటికి ఇబ్బందుల్లేవు
గత నెలలో జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాకాలంలో నమోదు కావాల్సిన వర్షపాతంలో సగానికి పైగా జూలైలోనే పడింది. రాష్ట్ర ప్రభుత్వం భూగర్భ జలాల సంరక్షణ కోసం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయి. ఫలితంగా భూగర్భ జల మట్టం గణనీయంగా పెరిగింది. రెండేళ్ల పాటు తాగు, సాగు నీటికి ఇబ్బందులు ఉండకపోవచ్చు. వర్షపు నీరు వృథా కాకుండా రైతులు కూడా ఎక్కడికక్కడ భూమిలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటే, భూగర్భ జలాలు మరింత పెరుగుతాయి.
– శైలశ్రీ మల్లికాదేవి, భూగర్భ జలవనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్, కరీంనగర్