సిరిసిల్ల/ సిరిసిల్ల టౌన్/ కలెక్టరేట్, జూలై 22 : ‘తెలంగాణ ప్రభుత్వం పెద్దసంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. పట్టుదలతో చదివి కొలువులు సాధించాలి’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సెల్ఫోన్ పక్కన పెట్టి ప్రణాళికతో చదివితే కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాలు చేజిక్కించుకోవచ్చని నిర్దేశం చేశారు. శుక్రవారం ఆయన సిరిసిల్లలో ఆకస్మికంగా పర్యటించారు. మధ్యాహ్నం 12:40 గంటలకు పట్టణానికి చేరుకున్న ఆమాత్యుడు 29వ వార్డులోని బీసీ స్టడీ సర్కిల్ను సందర్శించారు. ఉద్యోగార్థులకు పోటీ పరీక్షలపై దిశానిర్దేశం చేశారు. 100 మందికి రూ. 2లక్షల విలువైన స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో సీజనల్ వ్యాధుల కట్టడిపై అధికారులతో సమీక్షించారు. అక్కడి నుంచి జిల్లా దవాఖానకు చేరుకున్నారు. పలు విభాగాలను పరిశీలించి వైద్యసిబ్బందికి సూచనలు చేశారు. డెంగీ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షకాలం ముగిసేదాకా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాలని కోరారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడారు. త్వరలోనే బీసీ స్టడీ సర్కిల్కు శాశ్వత భవనాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అభ్యర్థులు సెల్ఫోన్లు పక్కన పెట్టాలని, ప్రణాళికతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. సిరిసిల్లలోని సినారె కళామందిరంలో 500 మంది అభ్యర్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. నిధులు, నీళ్లు, నియామకాల కోసమే తెలంగాణను సాధించుకున్నామని పేర్కొన్నారు. ఎనిమిదేండ్లలో ఈ దిశగా అనేక చర్యలు తీసుకొని సత్ఫలితాలు సాధించామని చెప్పారు. నియామకాల్లోనూ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. కేసీఆర్ పాలనలోని మొదటి ఐదేండ్లలో 1.32లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. రెండోసారి అధికారాన్ని చేపట్టి ఇప్పుడు ఏకంగా ఒకేసారి 81వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తున్నామన్నారు. ప్రైవేట్ రంగంలోనూ లక్షలాదిమందికి ఉపాధి కల్పించామని తెలిపారు. కానీ ఇందుకు భిన్నంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో 35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ప్రధాని కేవలం రూ.10 లక్షల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించడం విడ్డూరమన్నారు.
సిరిసిల్ల, వేములవాడ స్వయం సమృద్ధి
ఉమ్మడి పాలనలో కఠిక దుర్భిక్షం తాండవించిన సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలు స్వరాష్ట్రంలో స్వయంసమృద్ధి సాధించాయని పేర్కొన్నారు. నాడు బోర్లువేసి బొక్కబోర్లపడ్డ ఇక్కడి రైతాంగం ఇప్పుడు ఉబికి వస్తున్న జలాలను చూసి సంబురపడుతున్నారని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసుకున్నామన్నారు. అనేక ప్రాజెక్టులను కట్టి సాగునీటి గోస తీర్చామని తెలిపారు. ఫలితంగానే మన రాష్ట్రం భారతదేశపు ధాన్యాగారంగా భాసిల్లుతున్నదని ఉదహరించారు. ఇంటింటికీ భగీరథ నీరందిస్తున్న ఘనత తెలంగాణ సర్కారుకే దక్కిందన్నారు. జిల్లాలో ఆరు మీటర్లు పెరిగిన భూగర్భ జలాలతో ముస్సోరీలో జలసంరక్షణపై ట్రైనీ ఐఏఎస్లకు పాఠంగా మారిందని వివరించారు. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చునని.. ఇందుకు సీఎం కేసీఆరే నిదర్శనమన్నారు. సిరిసిల్ల జిల్లాలో మధ్యమానేరు, అన్నపూర్ణ రిజర్వాయర్లు నిర్మించామని పేర్కొన్నారు. ఎండాకాలంలో నర్మాల ఎగువమానేరు కాళేశ్వరం ఎత్తిపోతలతో పరవళ్లు తొక్కిందని ప్రాజెక్టు చరిత్రలోనే ఇదొక అద్భుతఘట్టమని అభవర్ణించారు.
వెల్డన్.. గోహెడ్..
జిల్లా దవాఖానలో 2.5కోట్లతో ఏర్పాటు చేసిన పిల్లల సంరక్షణ విభాగం, కంటి శస్త్రచికిత్సల ఆపరేషన్ థియేటర్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం రోగులతో మాట్లాడి దవాఖానలో శుభ్రత, అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సందర్భంగా వైద్యసిబ్బందిని అభినందించారు. ‘వెల్డన్.. గో హెడ్’ అంటూ ప్రశంసించారు. మీ పనితీరు కారణంగానే జిల్లావైద్యశాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అవార్డులు వరించాయని చెప్పారు. ఆయాచోట్ల కార్యక్రమాల్లో కలెక్టర్ అనురాగ్ జయంతి, జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటస్వామి, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు, టీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సిరిసిల్ల వైద్యశాల సూపరింటెండెంట్ మురళీధర్రావు, కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్ ఉన్నారు.