కార్పొరేషన్, సెప్టెంబర్ 14: టీఆర్ఎస్ ప్రజల గుండెల్లోంచి వచ్చిన పార్టీ అని, రాష్ట్రంలో మరో 20 ఏండ్లు అధికారంలో ఉంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. మంగళవారం 59వ డివిజన్లో నిర్వహించిన టీఆర్ఎస్ కమిటీ సమావేశానికి హాజరై, మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతి, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని, ఓట్లు అడిగే హకు తమకే ఉందని స్పష్టం చేశారు. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అంటూ ప్రాణాలకు తెగిం చి రాష్ట్ర ప్రజల కలను సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏండ్లలో ఎన్నో పార్టీలు అధికారంలో ఉన్నా కరీంనగర్ అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. తలాపునే మానేరు డ్యాం ఉన్నా నగర ప్రజలు తాగునీటి కోసం మొన్నటిదాకా ఇబ్బందులు పడ్డారని, స్వరాష్ట్రంలో ఆ ఇబ్బందులన్నీ తీరాయన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మండుటెండల్లో చెరువుల మత్తళ్లు దుంకుతున్నాయని, బీడు భూములు సైతం సాగులోకి వచ్చాయని చెప్పారు. ఎల్ఎండీ ఎప్పుడూ నిండుకుండలా ఉంటున్నదని, ఇప్పుడు నగరంలో ప్రతిరోజు తాగునీటి సరఫరా జరుగుతున్నదని చెప్పారు. నగరాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, ఇప్పటివరకు రూ.600 కోట్లకు పైగా నిధులు ఇచ్చారని వివరించారు. భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే టీఆర్ఎస్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పా రు. మేయర్ వై.సునీల్రావు, నగర పార్టీ ఇన్చార్జి చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు గందె మాధవి, తోట రాములు, ఐలేందర్యాదవ్, నగర నాయకులు పాల్గొన్నారు.