గంగాధర, మార్చి 22: ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదారమ్మ మండలానికి తరలివచ్చి యాసంగి సాగుకు భరోసా కల్పించింది. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కృషితో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపూర్ రిజర్వాయర్కు మంగళవారం 9 గంటలకు అధికారులు నీటిని విడుదల చేశారు. నెల క్రితమే నారాయణపూర్ రిజర్వాయర్కు నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విజ్ఞప్తి చేశారు. ధర్మారం మండలం కటికెనపల్లి వద్ద పైపులైన్పై మట్టిని తొలగించి పంటలు సాగు చేయడంతో.. అప్పుడు అధికారులు నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నించగాప్రెషర్ను తట్టుకోలేక పైపులు పైకి లేచాయి. దీంతో ఎమ్మెల్యే రవిశంకర్ అధికారులతో మాట్లాడి, నిరంతరం పర్యవేక్షించి పైపులైన్కు మరమ్మతు చేయించారు. మంగళవారం నందిమేడారం నుంచి నీటిని విడుదల చేయడంతో రాత్రి 9 గంటల సమయంలో గోదావరి జలాలు నారాయణపూర్ రిజర్వాయర్కు చేరుకున్నాయి. నాటి ఉమ్మడి పాలనతో నిరుపయోగంగా ఉన్న ఎల్లంపల్లి పైపులైన్కు స్వరాష్ట్రంలో ప్రభుత్వం మరమ్మతులు చేయించి, గత ఐదేళ్లలో ఆరుసార్లు నారాయణపూర్ రిజర్వాయర్కు నీటిని విడుదల చేసింది. ఇక్కడి నుంచి నియోజకవర్గంలోని చెరువులను నింపింది. ఈ యేడాది యాసంగిలో వేసిన పంటలు ఎండిపోకుండా ఏడోసారి రిజర్వాయర్కు నీటిని విడుదల చేసింది. సర్కారు నీటిని విడుదల చేయడంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మంగళవారం రాత్రి నారాయణపూర్ రిజర్వాయర్ పంపుల వద్దకు చేరుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపూర్ రిజర్వాయర్కు నీటిని విడుదల చేయించి, నియోజకవర్గంలోని చెరువులను నింపి యాసంగి పంటలకు సాగు నీరందేలా చూడాలని నెల క్రితమే సీఎంకు విజప్తి చేసినట్లు తెలిపారు. కటికెనపల్లి వద్ద పైపులైన్ మరమ్మతుల వల్ల నీటి విడుదల ఆలస్యమైందన్నారు. అధికారులతో మాట్లాడి పైపులైన్ మరమ్మతు చేయించామని, పనులు పూర్తి కావడంతో నీటిని విడుదల చేశారని తెలిపారు. నీటిని విడుదల చేయించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామన్నారు. రైతులెవరూ ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆందోళన చెందవద్దని, చివరి మడివరకు సాగు నీరు అందేలా చూస్తామని భరోసా కల్పించారు.