కార్పొరేషన్/ ధర్మపురి, నవంబర్ 29 : ‘ఎదురులేని నేత కేసీఆర్. సీమాంధ్ర కుట్రలను ఛేదించి రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు ఆయన. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన ఆమరణ దీక్ష చరిత్రలో ఒక అపూర్వ ఘట్టంలా నిలిచిపోతుంది. ప్రత్యేక ఆకాంక్షను ప్రజ్వలింపజేసి, తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకురార్పణ చేసిన రోజును ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. సీఎం కేసీఆర్ కృషితోనే తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది.’ అని టీఆర్ఎస్ నేతలు కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగి, మంగళవారానికి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లాలో ‘దీక్షా దివస్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయాచోట్ల సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, దీక్షలకు దిగారు. కరీంనగర్లో జడ్పీ చైరపర్సన్ విజయ, మేయర్ సునీల్రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి, తెలంగాణ చౌక్లో కేసీఆర్ కటౌట్కు పాలాభిషేకం చేశారు.
తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన కేసీఆర్ దీక్షకు నేటితో 13 ఏండ్లు. ఉద్యమ నాయకుడిగా ఆయన ‘తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు దిగారు. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ప్రజ్వలింపజేసి, తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకురార్పణ చేసిన ఈ రోజును టీఆర్ఎస్ దీక్షా దివస్గా పాటిస్తున్నది. మంగళవారం ఉమ్మడి జిల్లాలో దీక్షా దివస్ను ఘనంగా జరుపుకున్నారు. ఆయాచోట్ల నాడు దీక్ష జరిగిన తీరును గుర్తు చేసుకున్నారు. రాష్ర్టాన్ని సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపారని, దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని కొనియాడారు. బీఆర్ఎస్తో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని ధీమా వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లాకేంద్రంలోని తెలంగాణ అమరుల స్తూపం వద్ద మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, నగర మేయర్ యాదగిరి సునీల్రావు ఘన నివాళులర్పించారు. అనంతరం స్థానిక తెలంగాణ చౌక్లో సీఎం కేసీఆర్ కటౌట్కు పాలాభిషేకం చేశారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ పిలుపు మేరకు టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హుజూరాబాద్ అంబేదర్ చౌరస్తా వద్ద మంగళవారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఏరియా దవాఖానలో బాలింతలకు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. దీక్షా దివస్ వేడుకలను బహ్రెయిన్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ టీ(బీ)ఆర్ఎస్ బహెరాన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్కుమార్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్ బొలిశెట్టి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
వెల్గటూర్లో అంబేద్కర్ కూడలి వద్ద సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్ర పటానికి పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులను స్మరించుకుని నినాదాలు చేశారు. వెల్గటూర్ ఎండపల్లి మండలంలోని పాతగూడూర్కు చెందిన బోయిని సతీశ్ ఢిల్లీలో ప్లకార్డు పట్టుకుని ‘జై తెలంగాణ’ నినాదాలు చేశారు. సిరిసిల్ల టెక్స్ టైల్స్ పార్కు కమాన్ వద్ద టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ ఉద్యమ పోరాట ఫలితమే నేడు స్వరాష్ట్రంలో సంక్షేమ పథకాలు పొందుతున్నామని వారు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేశ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై తెలంగాణ, జై కేసీఆర్ అని నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ధీరోదాత్తుడు సీఎం కేసీఆర్
స్వరాష్ట్రం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి కొట్లాడిన ధీరోదాత్తుడు సీఎం కేసీఆర్. తెలంగాణను మలుపు తిప్పిన రోజే దీక్షా దివస్. తెలంగాణ కోసం నియోజక వర్గంలో అలుపెరుగని పోరాటం చేశాం. అనేక కేసులతో జైలు శిక్ష సైతం అనుభవించాం. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించాలి.
సీమాంధ్ర పార్టీలు చేసిన కుట్రలను ఛేదించి, తెలంగాణ సమాజాన్ని ఒక్క తాటిపైకి తెచ్చి రాష్ర్టాన్ని సాధించిన గొప్ప నేత కేసీఆర్. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకారమైంది. అప్పటి సీమాంధ్ర ప్రభుత్వం కరీంనగర్లో పోలీసు బలగాలతో కేసీఆర్ను అరెస్టు చేసి ఖమ్మం తరలిస్తుండగా మేధావులు, విద్యార్థులు, న్యాయవాదులు, ఉద్యోగులు, జర్నలిస్టులు ప్రజలు రోడ్లపైకి వచ్చి అండగా నిలువడం మరిచిపోలేది. ఆ సమయంలో కేసీఆర్ వెంట నిలిచినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఆనాటి దీక్ష అపూర్వ ఘట్టంలా నిలిచిపోతుంది. ప్రజల కష్టాలు తెలిసిన ఉద్యమ నేతగా కేసీఆర్ స్వరాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి గొప్పగొప్ప పథకాలు అమలు చేస్తున్నరు. అభివృద్ధిలోనూ తెలంగాణను ఆదర్శంగా నిలుపుతున్నరు. ప్రజలంతా ఆయనకు అండగా నిలవాలి.
– కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర మంత్రి (ధర్మపురి)