నాడు: విరివిగా వర్షాలు కురిసినప్పుడో.. పాల్వంచ, కూడవెళ్లి వాగులు నిండి వరదనీరు చేరినప్పుడో.. వానకాలం మధ్యలో ఎగువమానేరు జలకళను సంతరించుకొనేది.. అప్పుడే ఆయకట్టు రైతాంగం పంటలు సాగు చేసేది..వానలు పడకుంటే భూములను పడావు పెట్టుకొనేది..అప్పర్ మానేరు 70 ఏండ్ల చరిత్రలో కనిపించిన పరిస్థితి ఇది..
నేడు: వానల కోసం మొగులుకేసి చూడాల్సిన అవసరం లేదు.. పంటలకు నీళ్లెట్ల అని రంది పడాల్సిన పని లేదు. ఎదురెక్కివచ్చిన కాళేశ్వర ధారతో ఎగువమానేరు జలకళలాడుతున్నది. గతంలో ఎన్నడూలేనివిధంగా ఈ యేడు జూలైలోనే విడుదల చేసిన నీళ్లను చూసి రైతాంగం మురిసిపోతున్నది. తమ కలలను సాకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నది.
– గంభీరావుపేట, జూలై 8
గంభీరావుపేట, జూలై 8 : అప్పటి సిరిసిల్ల తాలుకా పరిధిలోని గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల పరిధిలోని మెట్ట ప్రాంతానికి నీరందించే లక్ష్యంతో 70 ఏండ్ల కింద రెండు టీఎంసీల సామర్థ్యంతో అప్పర్ మానేరును నిర్మించారు. వర్షాలు అధికంగా పడ్డప్పుడు ఎగువన కామారెడ్డి జిల్లా పాల్వంచ, సిద్దిపేట జిల్లా కూడవెళ్లి వాగుల వరద నీటితోనే ఈ ప్రాజెక్టు నిండేది. అది కూడా ఆగస్టు లే దా సెప్టెంబర్లోనో జలకళను సంతరించుకొనేది. అప్పుడే రైతులు సాగుకు ఉపక్రమించేవారు. యాసంగిలోనే పంటలు వేసేవారు. కానీ ప్రస్తుతం సీఎం కేసీఆర్ ని ర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో మెట్ట ప్రాంతానికి మహర్దశ పట్టింది. సిరిసిల్ల ప్రాంతాన్ని గోదావరి జలాలతో పునీతం చేస్తానని మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు మల్లన్న సాగర్ కాలువ వద్ద రెగ్యులేటర్ను ఏర్పాటు చేశారు. దీంతో ఎగువమానేరు రైతులకు అవసరం ఉన్నప్పుడల్లా గోదావరి జలాలు వచ్చి చేరుతున్నాయి.
ఎగువ మానేరు ప్రాజెక్టు ద్వారా యాసంగి పంటలకు మాత్రమే నీటిని విడుదల చేసేవారు. ఆదికూడా చివరి ఆయకట్టుకు అందేదికాదు. కానీ ఈ ఏడాది మల్లన్నసాగర్ ద్వారా ప్రాజెక్టును నింపారు. గతానికి భిన్నంగా జూలై మొదటి వారంలోనే కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు. గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల పరిధిలోని 13 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఈ నేపథ్యంలో ఆయకట్టు రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. పొలాలు దున్ని నాట్లేసేందుకు సిద్ధమవుతున్నారు.
నాకు నర్మాల మానేరు కింద ఎకరం భూమి ఉన్నది. వాన కాలంలో ఎప్పుడు నీళ్లు ఇచ్చోటోల్లు కాదు..వానలు బాగా పడి వాగుల ద్వారా నీళ్లు వచ్చే ప్రాజెక్టు నిండి మత్తడి దుంకితే నీటిని విడుదల చేసేవారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మానేరును నింపే అవకాశం ఉండడంతో వారం రోజుల కిందట కాలువలకు ఇడిసిన్రు. పొలాన్ని దున్ని నారు పోసిన.
– వండూరి రాములు, రైతు (నర్మాల)
మాకు తెలిసినప్పటి నుంచి ఎప్పడూ లేని విధంగా జూలై 1న అప్పర్ మానేరు నుంచి వాన కాలం పంటల కు సాగు నీరు విడుదల చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో నర్మాల ప్రాజెక్టుకు గోదావరి జలాలు రావడంతో వర్షాల కోసం ఎదిరిచూడాల్సిన అవసరం లేదు. ప్రాజెక్టు పరిధిలో చివరి ఆయకట్టుకు నీరందేలా కాలువలను మరమ్మతు చేస్తున్నాం. నిజం నవాబులు నిర్మించిన ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ చేపట్టిన కాళే శ్వరం ప్రాజెక్టుతో నజరాన అందించినట్లుంది. – ఎడబోయిన రాజు. సర్పంచ్ (నర్మాల)