కార్పొరేషన్, మార్చి 29: కరీంనగర్ నగరపాలక సంస్థ ఆస్తి పన్నుల వసూలులో జోరు పెంచింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ పటిష్ట కార్యాచరణ చేపట్టగా, ఇప్పటి వరకు 80 శాతం మేరకు పన్నుల వసూలు పూర్తయింది. ఏటా 90 శాతానికి పైగా ఆస్తి పన్నులు వసూలవుతుండగా.. ఈసారి దానిని అధిగమించే లక్ష్యంతో అధికార యంత్రాంగం కృషి చేస్తున్నది. అయితే మరోవైపు ఈ ఏడాది పన్నుల వసూళ్ల విషయంలో ఉన్నతాధికారులు పెద్దగా దృష్టి సారించలేదన్న విమర్శలూ వస్తున్నాయి. మార్చి నెలలో మాత్రమే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి బిల్ కలెక్టర్పై వసూళ్ల కోసం ఒత్తిడి తీసుకువచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్ నగరపాలక సంస్థకు ఏటా రూ. 39 కోట్ల మేరకు ఆస్తి పన్నులు రావాల్సి ఉంది. కాగా, ఈ సారి ఇప్పటి వరకు రూ.31.50 కోట్ల (80 శాతం) మేరకు వసూలయ్యాయని రెవెన్యూ అధికారవర్గాలు తెలిపాయి. అలాగే నగరపాలక సంస్థకు నగరంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల భవనాల నుంచి ఆస్తి పన్నుల రూపంలో భారీగానే బకాయిలు ఉన్నాయి.
అయితే ఏటా ఆయా సంస్థలకు నోటీసులు ఇవ్వడమే తప్ప పెద్దగా వసూలయ్యే పరిస్థితి ఉండదు. కానీ, ఈ సారి బల్దియా ఉన్నతాధికారులు ఈ బకాయిలపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో గతంతో పోలిస్తే పన్నుల వసూలులో మంచి పురోగతి వచ్చిందని అధికారవర్గాలు చెబుతున్నారు. ప్రభుత్వ సంస్థల నుంచి బల్దియాకు రూ. 22 కోట్ల మేరకు బకాయిలు ఉండగా, ఈ సారి మాత్రం రూ.3.50 కోట్లకు పైగా వసూలు చేశారు. మరో రెండు రోజుల్లో మరిన్ని బకాయిలు వసూళ్లు అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు ఈ నెల 31న ఆదివారం అయినప్పటికీ పన్నులు చెల్లించే వారి కోసం నగరపాలక సంస్థ కార్యాలయం తెరిచే ఉంటుందని అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రెవెన్యూ విభాగానికి చెందిన బిల్ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు చెల్లింపుదారుల కోసం అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. పన్నులు చెల్లించే ఇంటి యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే నగరపాలక సంస్థకు రూ.35 లక్షల మేర పన్నులు వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక శని, ఆదివారాల్లోనూ భారీగానే పన్నులు వసూలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.