కరీంనగర్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రైతుబంధు డబ్బులను పంట రుణానికి సర్దుబాటు చేయవద్దని బ్యాంకర్లను కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2022-23 సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన రుణ పరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) నిర్ధారణపై కలెక్టర్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యానవన, మత్స్యశాఖకు చెందిన ఉమ్మడి జిల్లా అధికారులు, బ్యాంక ర్లు, కేవీకే శాస్త్రవేత్తలతో అన్ని రంగాలకు చెందిన రైతుల గురించి చర్చించారు. పంట పరిమితులతోపాటు ఆక్వా, డెయిరీ, ఉద్యాన రంగంలో రుణ పరిమితులపై ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
రైతుబంధు డబ్బులను ఎట్టి పరిస్థితుల్లో పంట రుణానికి సర్దుబాటు చేయవద్దని, ఒకవేళ చేస్తే తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు. పంట రుణాల మంజూరుకు గానీ, రెన్యువల్కు గానీ ఏ బ్యాంకరు రైతుల పట్టాదారు పాసుపుస్తకం తీసుకోవద్దని, తీసుకుంటే తెలంగాణ పట్టాదారు చట్టం కింద నేరంగా పరిగణించాల్సి ఉం టుందన్నారు. మార్టిగేజ్ చేయించిన తర్వాత పాసు పుస్తకాలను బ్యాంకు వద్ద ఉంచుకోవద్దన్నారు. ఏమైనా ఉంటే ఈసీలో నమోదు చేయాలే తప్ప పట్టాదారు పాసుపుస్తకం తీసుకోవద్దని, ఆ ప్రకా రం కింది స్థాయిలో పనిచేసే సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు.
యాసంగి-2023 సంవత్సరంలో పంట రుణాలు సకాలంలో మంజూరు చేయాలని ఆదేశించారు. రైతులు కూడా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ఆయిల్ పామ్ రైతులను ప్రోత్సహించేలా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోపో, నాబార్డ్ ఏజీఎం మనోహర్రెడ్డి, ఎల్డీఎం ఆంజనేయులు, డీఏవో శ్రీధర్, కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణ, ఈవీహెచ్వో నరేందర్, యూ బీఐ ఆర్ఎం వంశీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.