కరీం‘నగరం’ మెరుస్తున్నది. ప్రగతిలో పరుగులు తీస్తున్నది. దశాబ్ధాలుగా పెండింగ్లో ఉన్న ఎన్నో పనులు, కండ్ల ముందే పరిష్కృతమై సరికొత్త అందాలద్దుకుంటున్నది. గతంతో పోల్చితే గడిచిన రెండేళ్ల కాలంలో సాగుతున్న అభివృద్ధి ఔరా అనిపిస్తున్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో మంత్రి గంగుల, మేయర్ సునీల్రావు కృషితో ప్రగతిలో దూసుకెళ్తున్నది. పారిశుధ్య నిర్వహణలో అవార్డులను పొందుతూనే.. నిత్యం మంచినీటి సరఫరాను సక్సెస్ఫుల్గా కొనసాగిస్తున్నది. సీఎం అస్యూరెన్స్, స్మార్టు సిటీ కింద ప్రధాన రహదారులకు మోక్షం కలుగుతుండగా, కేంద్రం నిర్వహించిన సఫాయి మిత్ర ఛాలెంజ్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే నగరం నలువైపులా పనులు సాగుతుండగా, తిరిగి మరో రూ.615 కోట్ల పనులకు గురువారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయబోతుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
– కార్పొరేషన్, మార్చి 16
నగరానికి పక్కనే మానేరు డ్యాం గతంలో వేసవి వచ్చిందంటే తాగునీటి కోసం తిప్పలు పడాల్సి వచ్చేది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథలో భాగంగా నగరపాలక సంస్థ చేపట్టిన పనులతో ప్రస్తుతం నగరంలో ఏడాదిన్నరగా ప్రతి రోజూ మంచినీటి సరఫరా చేస్తున్నారు. అర్బన్ మిషన్ భగీరథలో భాగంగా రాష్ట్రంలోనే ఏ నగరంలో లేని విధంగా రూ.110 కోట్ల వ్యయంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నిర్మించి నగరంలో అన్ని ప్రాంతాల్లో సమయపాలనకు అనుగుణంగా నీటి సరఫరా అందిస్తున్నారు. ఇక బల్దియాలో విలీనమైన తొమ్మిది గ్రామాల్లోనూ ప్రతి రోజూ నీటి సరఫరా అందించేందుకు ఇప్పటికే రూ.6 కోట్లతో పైపులైన్ పనులు సాగిస్తున్నారు. ఈ వేసవిలోగా పనులు పూర్తి చేసి రోజు నీటి సరఫరా అందించే దిశగా ముందుకు సాగుతున్నారు. నిత్యం నీటి సరఫరాచేయడమే కాదు.. సక్సెస్ పుల్గా కొనసాగిస్తున్న ఏకైక కార్పొరేషన్గా పేరు సంపాదించుకుంది.
సఫాయి మిత్రలో రెండో స్థానం..
నగరంలో పారిశుధ్య పనుల నిర్వహణ విషయంలో మేయర్ సునీల్రావు, పాలకవర్గం, అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో మెరుగైన ఫలితాలను సాధిస్తూ దక్షిణ భారతదేశంలోనే ఒక మంచి గుర్తింపు సాధించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సఫాయిమిత్ర సురక్షా ఛాలెంజ్ పోటీల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచి తన సత్తాను చాటింది. వీటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన పట్టణ ప్రగతి నిధుల నుంచి నగరంలో మోడ్రన్ పబ్లిక్ టాయిలెట్స్ను నిర్మించారు. నగరంలోని 18 ప్రాంతాల్లోనూ నూతన టాయిలెట్స్ను నిర్మించి, దశాబ్ధాలుగా ఎదుర్కొంటున్న సమస్యకు విముక్తి కల్పించారు. ఎప్పటికప్పుడు ఈ టాయ్లెట్స్ పరిశుభ్రంగా ఉంచేలా పారిశుధ్య, ఇంజినీరింగ్ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
మౌళిక సదుపాయాల కల్పన
బల్దియా ఆధ్వర్యంలో ప్రజారోగ్యం కోసం నిధులు కేటాయించి పనులు సాగిస్తున్నారు. ఇప్పటికే 30 ప్రాంతాల్లో పట్టణ ప్రగతి నిధులతో ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేయగా, 18 ప్రాంతాల్లో వాకింగ్ ట్రాక్స్ అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు 30 పార్కులను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే 15 పార్కులకు పైగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేగా, మిగిలిన వాటిని కూడా రెండు నెలల్లోనే పూర్తి చేసే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు. ప్రతి వీధిలోనూ మంచినీటి పైపులైన్తోపాటు డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం, వీధిదీపాల ఏర్పాట్లను వేగవంతం చేశారు. నగరంలోని అన్ని ప్రధాన చౌరస్తాలను సుందరీకరణలో భాగంగా ఇప్పటికే ఆరు చౌరస్తాలను అభివృద్ధి చేయగా, మరికొన్ని పనులు సాగుతున్నాయి. అలాగే హరితహరంలో ప్రధాన రోడ్ల డివైడర్లల్లో నాటిన మొక్కలను సంరక్షించి రోడ్లను సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే నగరంలోని మానేరు డ్యాం కట్ట వెంట నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించే దిశగా పకడ్బందీ చర్యలు చేపట్టారు.
శరవేగంగా స్మార్ట్ పనులు
నగరానికి స్మార్ట్సిటీ మంజూరైన ఆరంభంలో అభివృద్ధి పనులు ఆలస్యం కాగా గత రెండేళ్లలో శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. స్మార్ట్సిటీ మొదటి విడుతలో రూ.350 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించగా, ఈ రెండేళ్లల్లోనూ సుమారు రూ.250 కోట్లకు సంబంధించి పనులు పూర్తి చేయించారు. మిగిలిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసే దిశగా ప్రక్రియ సాగుతోంది. అలాగే, స్మార్ట్లో భాగంగా మోడ్రన్ కాలనీగా తీర్చిదిద్దేందుకు హౌసింగ్బోర్డు కాలనీలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఇప్పటికే 80 శాతానికిపైగా పూర్తయ్యాయి. వీటితో పాటు ప్రస్తుతం రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న రూ.615 కోట్ల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
మంత్రి కేటీఆర్ సహకారంతో ముందుకు
స్థానిక మంత్రి గంగుల కమలాకర్తో పాటుగా మంత్రి కేటీఆర్ అందిస్తున్న సహకారంతో నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. వచ్చే ఒకటి రెండేళ్లలో నగరం యావత్తు సుందర మయంగా మారుతుంది. దశాబ్దకాలంగా పెండింగ్లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడమే కాకుండా అధికారుల పనితీరులోనూ విప్లవాత్మక మార్పులు తెస్తున్నాం. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అన్ని వర్గాల ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా అధికారులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. మేయర్గా విజయవంతంగా ముందుకు వెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, పాలకవర్గం సహకారం అందిస్తున్నది. -వై సునీల్రావు, మేయర్