కొత్తపల్లి, జూలై 3 : తెలంగాణలో చేనేత కార్మికులను ఆదుకున్నది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. శుక్రవారం కొత్తపల్లి చేనేత పారిశ్రామిక సహకార సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ్యులతో ప్రమాణం చేయించి మాట్లాడారు.
బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేనేత రంగాన్ని బలోపేతం చేయడంతోపాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో పండుగలకు అవసరమైన చీరల తయారీ బాధ్యతలను అప్పగించారని చెప్పారు. కానీ, కాంగ్రెస్ సర్కారు వస్త్రాల టెండర్లను ఇతర రాష్ట్రాలకు అప్పగిస్తూ కార్మికుల కడుపు కొడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంతో మంది ఉపాధి లేక రోడ్డున పడే దుస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని, చేనేత కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వాసాల రమేశ్, చేనేత పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు మునీందర్, ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, కార్యదర్శి హనుమాండ్లు, మేనేజింగ్ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.