మసక బారిన కళ్లకు ‘కంటి వెలుగు’ కొత్త కాంతులు తీసుకువస్తున్నది. ఆర్థిక స్థోమత లేక వైద్య పరీక్షలు నిర్వహించుకోలేని నిరుపేదల్లో ధైర్యం నింపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెండో విడుత కంటి వైద్య శిబిరాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తున్నది. మూడో రోజు 23,343 మందికి పరీక్షలు చేసి, 4,788 మందికి అద్దాలు పంపిణీ చేసినట్లు యంత్రాంగం తెలిపింది.
విద్యానగర్, జనవరి 23 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాలు పండుగలా సాగుతున్నాయి. వైద్య పరీక్షలు ఇంటి ముందే చేయించుకునే అవకాశం రావడంతో జనం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడో రోజు సోమవారం 23,343 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 4,788 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశారు. దూరం, దగ్గరి చూపు మందగించిన వారికి అద్దాల తయారీ కోసం 3,790 ఆర్డర్లు పంపారు. కరీంనగర్ జిల్లాలో 6670 మంది, రాజన్న సిరిసిల్లలో 3631 మంది, జగిత్యాలలో 7612 మంది, పెద్దపల్లిలో 5430 కంటి పరీక్షలు చేయించుకున్నారు. కరీంనగర్ జిల్లాలో 1697 మంది, రాజన్న సిరిసిల్లలో 953 మంది, జగిత్యాలలో 1277 మంది, పెద్దపల్లిలో 861 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశారు. దూరం, దగ్గరి చూపు మందగించిన వారికి అద్దాల తయారీ కోసం కరీంనగర్ జిల్లాలో 1046, రాజన్న సిరిసిల్లలో 902, జగిత్యాలలో 1086, పెద్దపల్లిలో 756కు ఆర్డర్లు పంపారు.
దగ్గరి చూపు సరిగ లేదు.
కొన్నెళ్లుగా నాకు దగ్గరి చూపు సరిగ లేదు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాటు చేశాక కంటి పరీక్షలను చేయించుకోవాలనుకున్న. మా ఊరుల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరానికి పోయిన. నాకు ఉన్న దగ్గరి చూపు సమస్యను చూపించుకున్న. పరీక్షలు చేసి, కంటి అద్దాలిచ్చిండ్రు. ఇప్పడు బాగానే కనిపిస్తుంది. గింత జేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారును మరిచిపోను.-
– చెర్లపల్లి సుధాకర్, గర్రెపల్లి(సుల్తానాబాద్ రూరల్)
రెండోసారి కంటి అద్దాలు తీసుకున్న
మొదటిసారి కంటి వెలుగులో కంటి అద్దాలను తీసుకున్న. మళ్లీ రెండో సారి కంటి వెలుగు కార్యక్రమంలో కంటి పరీక్షలను చేయించుకున్న. పరీక్షలు చేసి అద్దాలను మార్చి ఇచ్చిండ్రు. ఇప్పడు ఇంకా మంచిగ కనిపిస్తున్నయ్. ఇంతకుముందు చాన మంది కరీంనగర్కు పోయి కంటి పరీక్షలను చేయించుకునేటోళ్లు. డబ్బులను ఖర్చు చేసుకుని పోయినా అక్కడ గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేంది. కానీ కంటి వెలుగులో ఒక్కసారే కాకుండా రెండు మూడు సార్లు అడిగిమరీ ఇత్తుండ్రు.
-పొలాడి చిత్ర, బొంతకుంటపల్లి (సుల్తానాబాద్ రూరల్)
అప్పుడప్పుడూ తలనొప్పి అచ్చేది
నాకు తలనొప్పి అచ్చేది. కుట్టుమిషన్తో జాకెట్స్, చీరలు కుట్టుకునే సమయంలో మస్తు ఇబ్బందయ్యేది. సూదిలో ద్వారం ఎక్కించాలంటే చూపు సరిగా కనిపించేది కాదు. కానీ ఊర్ల కంటి వెలుగుశిబిరానికి పోయిన. అక్కడ కంటి పరీక్షలు చేసి అద్దాలిచ్చిండ్రు. కంటి అద్దాలు పెట్టుకున్నాక తలనొప్పి తగ్గింది. చూపు గూడ బాగుంది. ఇప్పడు సూదిలో ద్వారా ఎక్కిస్తున్న.
-ముదిగిరి చంద్రకళ(సుల్తానాబాద్ రూరల్)
పైసా ఖర్సు లేదు
నేను మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికురాలిని. చాన దినాలుగ దూరం చూపు మస్కగ కనిపిత్తంది. దీంతో తలంతా నొస్తుండె. ఇంతకుముందు ప్రైవేటు దవాఖాన్ల చూపెట్టుకున్న. అద్దాలు, చుక్కల మందులకు వెయ్యి రూపాల దాకా అయినయి. గిప్పుడు మా అంబేద్కర్నగర్ల పెట్టిన కంటి వెలుగు క్యాంపుల పరీక్షలు చేయించుకున్న. డాక్టర్ ఇచ్చిన అద్దాలు పెట్టుకున్న మంచిగ కనబడుతంది. తలనొప్పి కూడా పోయింది. పైసా ఖర్చు లేకుండా మంచి అద్దాలు ఇచ్చిండ్రు.
– గడ్డం విజయ, అంబేద్కర్నగర్ (సిరిసిల్ల టౌన్)
ఫోన్ నంబర్లు కనిపించకపోయేవి..
నాకు ఫోన్ జేయాలంటే నంబర్లు కనపడకపోయేవి. దగ్గరి చూపు లేకుండె. మస్తు ఇబ్బందయితుండె. కంటి వెలుగులో పరీక్షలు చేసుకున్న. డాక్టర్లు అద్దాలిచ్చిండ్రు. ఇప్పుడు మంచిగ కనిపిత్తుంది. ఫ్రీగా కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చిన సీఎం కేసీఆర్ సారు మేలు మరువం.
-గంట సమ్మయ్య, హమాలీ కార్మికుడు, బోర్నపల్లి(హుజురాబాద్ టౌన్)
రీడింగ్ గ్లాస్ ఇచ్చిన్రు..
ఎన్నో రోజుల నుంచి పేపర్ చదవడం ఇబ్బందిగా ఉండె. కంటివెలుగు శిబిరానికి వస్తే డాక్టర్లు పరీక్షించి రీడింగ్ గ్లాసెస్ ఇచ్చిన్రు. పేపర్ స్పష్టంగా చదువుతున్నా. ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఇంటిదగ్గరే క్యాంపులు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉన్నది.
– సూర్యశేఖర్, సుభాష్నగర్
ఇప్పుడు కంటి చూపు మంచిగుంది.
కంటి చూపు ఇప్పుడు మంచిగుంది. నేను ఎవుసంతోపాటు గోదాంల హమాలీ పని జేస్త. దగ్గరి చూపు మందగించింది. చిన్న అక్షరాలు ఏర్పుడ్తలేవు. కంటి వెలుగులో పరీక్షలను చేయించుకుని అద్దాలు తెచ్చుకున్న. ఇప్పుడు చూపు మంచిగ కనిపిత్తంది. చిన్న అక్షరాలు కూడా కనిపిత్తున్నయ్. ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
-మొండెద్దుల రాజయ్య, గర్రెపల్లి(సుల్తానాబాద్ రూరల్)
సూదిలో దారం కనిపించకపోయేది
కొన్నేండ్ల సంది టైలరింగ్ పని జేత్తున్న. అయితే నాకు సూదిలో దారం పెట్టాల్నంటె ఇబ్బంది అయ్యేది. చాలా టైం పట్టేంది. కానీ కంటి వెలుగుల చూపించుకుంటె అద్దాలిచ్చిండ్రు. అవి పెట్టుకున్నంక కండ్లు మంచిగ కనిపిస్తున్నయి. రూపాయి ఖర్చు లేకుండా కంటి పరీక్షలు చేసి నాకు ఫ్రీగ ఎంతో మంచి అద్దాలు ఇచ్చిన సర్కారుకు, కేసీఆర్ సారుకు నేను, నా కుటుంబం రుణపడి ఉంటం.
-సింగం వసంత, టైలరింగ్, బోర్నపల్లి(హుజూరాబాద్ టౌన్)
ఆరేళ్లుగా బాధపడుతున్నా
ఆరేళ్లుగా కంటి చూపుతో బాధపడుతున్నా. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి చూపించుకున్నా అలాగే ఉన్నది. దగ్గరి వస్తువులు కూడా కనిపించడం లేదు. ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగులో ప్రభుత్వ వైద్యులు పరీక్షించి నాకు అద్దాలు ఇచ్చారు. ఇప్పుడు కళ్లు మంచిగా కనిపిస్తున్నయ్.
– శకుంతల, సుభాష్నగర్
అద్దాల డిజైన్లు మంచిగున్నయ్
నాకు కొన్ని రోజుల సంది చిన్న అక్షరాలు కనబడుత లేవు. కంటి వెలుగులో పరీక్షలు చేయించుకుంటే అద్దాలిచ్చిండ్రు. ఇవి పెట్టుకుంటే మంచిగ కనపడ్తంది. బయట మార్కెట్ల లెక్క తీరొక్క డిజైన్లు ఉన్నయ్. సీఎం కేసీఆర్ పెట్టి కంటి వెలుగు శిబిరం అందరికి మంచిగ అక్కరకత్తంది. పైస ఖర్సు లేకుండా సర్కారే కంటి పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇత్తుంటె సంతోషమైతంది. ప్రవేటు దవాఖాన్లయితే రెండు వేల దాకా అయితది.
– మహాదేవుని రమాదేవి(ఇల్లంతకుంట)