దూరపు, దగ్గరి చూపుతో బాధపడుతూ కంటివెలుగులో పరీక్షలు చేయించుకన్న వారికి ఆర్డర్ అద్దాలు వచ్చాయి. వైద్య సిబ్బంది పంపిణీ చేయగా, లబ్ధిదారులు ఆనందంలో మునిగితేలుతున్నారు. తమకు కంటిచూపును ప్రసాదించిన సర్కారుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 16: ప్రభుత్వం అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా కంటివెలుగుకు అంకురార్పణ చేసింది. జనవరి 19 నుంచి రెండో విడుత శిబిరాలను ప్రా రంభించింది. అందులో భాగంగా అంతటా క్యాంపులు ఏర్పాటు చేశారు. వైద్యులు కంటి పరీక్షలు చేసి, దగ్గరి చూపు సమస్య ఉన్న వారికి అప్పటికప్పుడే అద్దాలు ఇచ్చారు. కానీ, ఒక్కరికే దూరం, దగ్గరి చూపు సమస్య ఉన్నా.. లేదా దూరం చూపు సమస్య ఉన్నా ఆర్డర్ తీసుకొని పంపిస్తామని చెప్పారు. ఎల్లారెడ్డిపేటకు చెందిన 15 మందికి, పదిరలో 29, హరిదాస్నగర్లో 52, వీర్నపల్లిలో 86 మందికి అలాంటి సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఆర్డర్ కండ్లద్దాలు గురువారం ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి పీహెచ్సీలకు రాగా, లబ్ధిదారులకు అందజేశారు.
సద్వినియోగం చేసుకోవాలి ..
కంటి వెలుగు ఒక మంచి ప్రోగ్రాం. కంటి చూపు సమస్య తెలుసుకోవడంతో పాటు అవసరమైన వారికి అద్దాలను ఇస్తున్నాం. ఆపరేషన్ అవసరమైన వారికి పెద్ద హాస్పిటల్కు రిఫర్ చేస్తున్నాం. నియర్విజన్, లాంగ్ విజన్ రెండు రకాల సమస్యలున్న వారికి అవసరమైన అద్దాలను ఆర్డర్ చేసి వచ్చిన వెంటనే ఇస్తున్నాం. పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– స్రవంతి, వైద్యాధికారి (ఎల్లారెడ్డిపేట)
అద్దాలు సక్కగున్నయ్
పోయిన్నెల 19 తారీఖు నాడు ఎల్లారెడ్డిపేటల కంటి పరీక్షలు చేయించుకున్న. డాక్టర్లు దగ్గరి, దూరపు సూపు ఇబ్బంది ఉన్నదని చెప్పిన్రు. మందులు రాసిచ్చిన్రు. అద్దాలు కొన్ని రోజులైనంక అత్తె ఇత్తమని జెప్పిన్రు. ఇయ్యాల్ల ఫోన్ జేసి రమ్ననంగనే హాస్పిటల్కు పోయిన. వాళ్లు ఇచ్చిన అద్దాలు సక్కగున్నయ్. సూపు మంచిగ కనిపిత్తున్నది. గిసోంటి మంచి పనిజేత్తున్న సర్కారుకు రుణపడి ఉంటం.
– పాలోజి అనసూయ, ఎల్లారెడ్డిపేట
అత్తయో రావో అనుకున్న
రెండు సూపులు సరిగ్గ లెవ్వు. నెల కింద దావఖాన కచ్చినప్పుడు నాకు తగ్గ అద్దాలు లెవ్వు. ఆర్డర్ పెట్టాలె అని డాక్టర్లు సెప్పిన్రు. అవి అత్తయో, రావో అనుకున్న. కానీ, జెల్దే అచ్చినయ్. అద్దాలు గూడ మంచిగున్నయ్. ఈడ క్యాంపు పెట్టెపటికె నా అసోంటోల్లు ఎంతో మంది సూపిచ్చుకుంటుర్రు. ఇది లేనోల్లకు మంచిగ పెట్టిన్రు. ఈ ప్రభుత్వం అందరికీ మంచిజేత్తున్నది. మాలాంటి పేదలు ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు రుణపడి ఉంటరు.
– గంట ధర్మయ్య, ఎల్లారెడ్డిపేట