నాటిపాలనలో అధ్వానంగా మారిన కల్వల ప్రాజెక్టుకు పునర్జీవం పోసుకోబోతున్నది. స్వరాష్ట్రంలో పునర్నిర్మాణానికి అడుగుపడింది. ఇచ్చిన మాటమేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ డీటెయిల్స్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారీకి తాజాగా 18 లక్షల నిధులు మంజూరు చేయించారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు వెల్లడించారు.
– శంకరపట్నం, ఆగస్టు 31
శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్టుకు ఘన చరిత్ర ఉన్నది. 1970లో నిర్మించిన ఈ ప్రాజెక్టు, శంకరపట్నం, వీణవంక మండలాల్లో 2030 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేది. శంకరపట్నం, సైదాపూర్, హు స్నాబాద్ మండలాల నుంచి 422 కిలోమీటర్ల మేర క్యాచ్మెంట్ ఏరియాను కలిగి ఉండేది. కానీ నాటి సమైక్య పాలకులు జలవనరులను నిర్లక్ష్యం చేయడంతో ఈ ప్రాజెక్టు కూడా అధ్వానంగా మారింది. మొత్తం పూడిక నిండిపోయింది. ఆయకట్టు రైతులకు పూర్తిగా భరోసా ఇవ్వలేకపోయింది. జూలైలో కురిసిన భారీ వర్షాలకు గండి పడింది. ఫలితంగా 400 ఎకరాలు ముంపునకు గురికావడంతో రైతులు, మత్స్యకారులు నిరాశ చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే జూలై 29న మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, మానకొండూర్, హుస్నాబాద్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితల సతీశ్కుమార్తో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పరిశీలించారు. ఈ విషయమై సీఎం కేసీఆర్తో చర్చించి, కల్వల ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సరికొత్తగా పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రైతులెవరూ అధైర్యపడొద్దని భరోసానిచ్చారు. నాడు రైతులకు ఇచ్చిన మాట మేరకు తాజాగా ప్రాజెక్టు పునర్మాణానికి సంబంధించి ప్రాథమిక సర్వే, డిజైన్, నివేదికల రూపకల్పన, అంచనా పనుల కోసం 18 లక్షలు మంజూరు చేయించారు. ఈ విషయాన్ని గురువారం బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు వెల్లడించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు.