Korutla | కోరుట్ల, జూన్ 25 : కోరుట్ల మండలంలోని అయిలాపూర్ కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థఙ అంకం రాహుల్ మృతిపై అనుమానాలు నివృత్తి చేయాలని, మృతికి కారకులైన వారిని చట్టపరంగా శిక్షించాలని కోరుతూ కోరుట్ల పట్టణంలో పద్మశాలీ సంఘం నేతలు, గ్రామస్తులు గురువారం నిరసన గళమెత్తారు. ఇంజనీరింగ్ విద్యార్థి మృతి మిస్టరీ ఛేదనలో పోలీసులు తాత్సరం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్లకార్డులతో నిరసనకు దిగారు. హైదరాబాద్ లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న అంకం రాహుల్ ఆంధ్రప్రదేశ్ లోని సింగరాయ కొండ ప్రాంతంలోని పాడుబడిన బావిలో ఇటీవల శవమై తేలాడు. ఇందుకు సంబందించి అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు.
రాహుల్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లోను కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో రాహుల్ మృతి చెంది సుమారు నెల రోజులు గడుస్తున్నా పోలీసులు రాహుల్ శవాన్ని కుటుంబసభ్యులకు అందజేయకపోవడాన్ని నిరసిస్తూ పద్మశాలీ కులస్తులు, అయిలాపూర్ గ్రామస్తులు పెద్ద ఎత్తున కోరుట్లకు చేరుకున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోరుట్లలోని కార్గిల్ చౌరస్తా జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, బీసీ రాజ్యాధికార సంఘం ప్రతినిధి దాసు సురేష్ మాట్లాడుతూ ఎంతో భవిష్యత్ ఉన్న అంకం రాహుల్ మృతి బాధకరమన్నారు. 25 రోజులు గడుస్తున్నా రాహుల్ మృతిపై రెండు రాష్ట్రాల పోలీసులు ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వడం లేదన్నారు. రాహుల్ ను బెదిరింపులకు గురి చేసిన వ్యక్తులపై ఇప్పటి వరకు ఏలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
నిరుపేద కుటుంబానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి మరణిస్తే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి కనీస స్పందన లేదన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని, రాహుల్ మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. మృతికి కారణమైన వారు ఎంతటి వారైనా చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని బీసీ బిడ్డకు న్యాయం జరిగే వరకు విశ్రమించేది లేదని ఉద్ఘాటించారు. అనంతరం కార్గిల్ చౌక్ నుంచి జాతీయ రహదారి మీదుగా కొత్త బస్టాండు వరకు ర్యాలీగా వెళ్లారు. అంబేద్కర్ విగ్రహానికి రాహుల్ తల్లిదండ్రులు రాజేష్, కవితతో కలిసి నాయకులు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు పద్మశాలీ సంఘం నేతలు కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహనికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘం జాతీయ కార్యదర్శి గడ్డం జగన్నాథం, జాతీయ రాజకీయ విభాగం అధ్యక్షుడు బొట్ల శివ శంకర్, యువజన విభాగం ఇన్చార్జి అవ్వారి భాస్కర్, తెలంగాణ పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామర్తపు మురళి, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మెతుకు సత్యం, తెలంగాణ పద్మశాలీ సంఘం ఉపాధ్యక్షుడు గుర్రం శ్రవణ్, రాష్ట్ర కార్యదర్శి కృష్ణ హరి, మీడియా కార్యదర్శి మార్త ప్రకాష్, జగిత్యాల జిల్లా పద్మశాలీ సంఘం అధ్యకుడు రుద్ర శ్రీ నివాస్, జిల్లా నాయకులు దీకొండ లక్ష్మీనారాయణ. చిలుక నర్సప్పా, మెతుకు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.