MP Dharmapuri Arvind | కోరుట్ల, ఏప్రిల్ 9 : జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఐరెన్ లెగ్ శాస్త్రీ అని, ఆయన ఎక్కడ ఆడుగు పెడితే అక్కడ బుగ్గేనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని ఆపార్టీ రాష్ట్ర నాయకులు అనూప్ రావు నివాసంలో గురువారం ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి పోలేదని చెబుతూ ఆ పార్టీలోనే కొనసాగుతున్నాడని, గతంలో బోగ శ్రావణిని పార్టీ నుంచి వెళ్లగొట్టిండని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి పెద్ద మనిషి జీవన్ రెడ్డి ఇంటి పార్టీలో చిచ్చుపెట్టి పార్టీ నుంచి సాగనంపాడని ఆరోపించారు.
జీవన్ రెడ్డిని బీజేపీలోకి తీసుకువచ్చేందుకు కృషి చేశామని, కానీ ఆయన నుంచి రెస్పాన్స్ రాలేదని తెలిపారు. జీవన్ రెడ్డి తనకు అప్తులని, బీఆర్ఎస్ లోకి వెళ్తున్న జీవన్ రెడ్డికి గుడ్ లక్ టూ హిమ్ అంటూ విషెష్ తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అవగాహన లేకుండా పసుపు బోర్డుపై మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. సంజయ్ కు ప్రెస్టేషన్ ఎక్కువై ఆవాకులు, చవాకులు పేలుతున్నాడని దుయ్య బట్టారు. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం పసుపు పంట ఇండియాలో సాగు అవుతుందన్నారు. పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసమే పసుపు బోర్డు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రస్తుతం పసుపు ధర రూ. 16500 పలుకుతుందని తెలిపారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్తో కలిసి పని చేస్తున్నానని చెప్పుకొనే జగిత్యాల ఎమ్మెల్యే కేంద్రీయ విద్యాలయానికి స్థలాన్ని ఇప్పించడం చేతగావడం లేదన్నారు. కేంద్రీయ విద్యాలయం ఇప్పటికే నిజామాబాద్, బోధన్ లో ఏర్పాటు చేశామని, అక్కడ క్లాసులు కూడా నడుస్తున్నాయని తెలిపారు.
జగిత్యాల ఎమ్మెల్యే తన అభివృద్ధి, వియ్యంకుడికి బిల్లులు ఇప్పించేందుకే పార్టీ మారాడని ఆరోపించారు. తెలంగాణ తీసుకు వచ్చిన మహోన్నత వ్యక్తిగా కేసీఆర్ పై తనకు ఆపారమైన గౌరవం ఉందన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకొని ఉచిత పథకాలు అమలు చేయాలని, అప్పులు తెచ్చి కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి కి చురకలంటించారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత రూ.లక్ష కోట్ల అప్పులు పెరిగాయని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ లిల్లీపుట్ అని, ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆరోపించారు. కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి స్పాన్సర్ అని, బీజేపీని అణగదొక్కేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించవన్నారు.
ఎస్టీ విద్యార్థులకు అందాల్సిన రూ.206 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంతో కేంద్రానికి రిటర్న్ అయ్యాయని తెలిపారు. కోరుట్ల, మెట్ పల్లి ప్రాంత ప్రజల అభీష్టం మేరకు ముంబాయి రైలు నడుపుతున్నామన్నారు. ప్రజలు రైలును వినియోగించుకోకుండా బస్సుల్లో వెళ్లడం సరికాదన్నారు. ముంబాయి రైలును సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు నాయకులు డాక్టర్ అనూప్ రావు, రుద్ర శ్రీనివాస్, తిరుమల వాసు, కస్తూరి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.