నిజామాబాద్ : అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు రాబోయే ఎన్నికల్లో ఓట్లతో సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ (BRS) నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్దన్( Bajireddy Goverdhan) పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యం కాని హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రజలను నమ్మించి మోసం చేసిందని దుయ్యబట్టారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ (KCR) దేశంలో మరెక్కడా అమలు కాని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి చూపించారని పేర్కొన్నారు. పదేళ్ల పాటు రాష్ట్రం పచ్చగా కళకళలాడిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వెంట కరువును తెచ్చిందని ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. ప్రజలకు ముఖం చూపే అర్హత లేదని విమర్శించారు.
ప్రజల చెవిలో బీజేపీ పువ్వు పెడితే, తలపై కాంగ్రెస్ భస్మాసుర హస్తం పెట్టిందని తెలిపారు. ప్రజలకు మేలు చేసే బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించి కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని కోరారు. బీర్పూర్ మండలం రొల్ల వాగు ప్రాజెక్ట్ గేట్ల ఏర్పాటుకు కృషి చేస్తానని, గల్ఫ్ కార్మికుల(Gulf labours) సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని బాజీరెడ్డి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్మన్ దావా వసంత, లోక బాబూరెడ్డి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.