KTR| సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 13: సిరిసిల్ల నేతన్న నైపుణ్యం మరోసారి ప్రపంచానికి తెలిసింది. సాంకేతికతను, మగ్గాన్ని జోడించి సిరిసిల్లకు చెందిన ప్రముఖ నేతకార్మికుడు నల్ల విజయ్కుమార్ రూపొందించిన ‘క్యూ ఆర్ కోడ్’ శాలువాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం హైదరాబాద్ లోని నందినీనగర్ నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ ప్రతిభను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
శాలువా ప్రత్యేకతలు..
‘పోగు బంధంతో ఫోన్ బంధం’ అనే కాన్సెప్ట్ తో ఈ శాలువాను రూపొందించారు. శాలువాపై నేసిన క్యూఆర్ కోడ్ ను మొబైల్ ఫోన్ తో స్కాన్ చేస్తే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రముఖ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల గొప్పతనాన్ని, యాదాద్రి ఆలయాల వైభవాన్ని తెలిపేలా ఈ కోడ్ ను తీర్చిదిద్దారు. కేవలం 15 రోజుల వ్యవధిలో ఇంతటి అద్భుతమైన శాలువాను విజయ్ కుమార్ రూపొందించడం విశేషం.
కేసీఆర్ చేసిన అభివృద్ధి తెలపాలనే..
నేతన్న నల్ల విజయకుమార్ మాట్లాడుతూ మా నాన్న గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీర తయారు చేశారు. ఆయనే నాకు స్ఫూర్తి, గతంలో నేను రంగులు మారే చీర, అగ్గిపెట్టెలో పట్టే చీర తయారు చేసినప్పుడు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్నట్లు తెలిపారు. అది తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. కేసీఆర్ తెలంగాణకు చేసిన అభివృద్ధిని, మన వారసత్వ సంపదను పది మందికి తెలియజేయాలనే ఆలోచనతోనే ఈ క్యూఆర్ కోడ్ లువాను రూపొందించానని పేర్కొన్నారు. సిరిసిల్ల ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలకు అడ్డా అని నిరూపించడమే తన లక్ష్యం చెప్పారు. ఈ అద్భుత ఆవిష్కరణను కేటీఆర్ చేతుల మీదుగా కేసీఆర్ కు అందించాలని కోరినట్లు పేర్కొన్నారు. దీనికి స్పందించిన కేటీఆర్ తప్పకుండా ఈ శాలువాను కేసీఆర్ కు అందజేస్తామని హామీ ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. నేతన్నకు కేటీఆర్ ఎల్లప్పుడూ అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్రెడ్డి, సీనియర్ నాయకులు జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.