జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ మండలం రంగసాగరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన పడిగెల చంద్రయ్య(35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ధర్మపురి మండలం తీగల ధర్మారంలో ఉండే తన అక్క ఇంటికి శుభకార్యానికి వెళ్లిన చంద్రయ్య.. ఆదివారం ఉదయం 9 గంటలకు బయటికి వెళ్లాడు. బయటికి వెళ్లి వస్తా అని తన భార్య కళావతికి చెప్పి వెళ్లిన చంద్రయ్య.. మధ్యాహ్నం అయినా తిరిగి ఇంటికి రాకపోయేసరకి.. తన స్వగ్రామం రంగసాగరుకు వెళ్లాడని భావించింది.
కానీ.. కాసేపటికే చంద్రయ్య ఫోన్ నుంచి ఓ వ్యక్తి కళావతికి ఫోన్ చేసి చంద్రయ్య చనిపోయాడని చెప్పడంతో వెంటనే తన బంధువులతో సహా అక్కడికి చేరుకుంది కళావతి. అనుమానాస్పద స్థితిలో చంద్రయ్య మృతి చెంది ఉండటం చూసి కళావతి షాక్ అయింది.
చంద్రయ్య మెడపై గాయాలు ఉండటం.. కడుపులో కూడా కరెంట్ షాక్తో కాలిన గాయాలు ఉన్నాయని గుర్తించారు. అనుమానం రావద్దని.. చెరువు పక్కన తీసుకొచ్చి పడేశారని కళావతి ఆరోపించింది. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో తన పిల్లలకు న్యాయం చేయాలని.. తన భర్త చావుకు కారణమైన వాళ్లను చట్ట ప్రకారం శిక్షించాలని కోరింది.