బోయినపల్లి, ఫిబ్రవరి 5: రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ఆర్అండ్ కాలనీలో కార్పొరేట్ హంగులతో కంటి దవాఖాన అందుబాటులోకి వచ్చింది. గ్రామానికి చెందిన వైరాగ్యం బుచ్చమ్మ, చంద్రమౌళి స్మారకార్థం కంటి వైద్యుడైన వారి కొడుకు రాజలింగం బీసీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో 2021లో ఈ వైద్యశాలను నిర్మించారు. రాజలింగంతో పాటు అతడి భార్య రీటా సైతం నిరుపేదలకు కేవలం రూ. 50 కే కంటిచికిత్సను అందిస్తూ ఔదార్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అవసరమున్నవారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తూ పుట్టిన గడ్డపై మమకారాన్ని చాటుకుంటున్నారు. పూర్వపు కొదురుపాకకు చెందిన బుచ్చమ్మ- చంద్రమౌళి కొడుకు రాజలింగం హైదరాబాద్లో ప్రముఖ కంటి వైద్య నిపుణుడిగా గుర్తింపు పొందాడు. ఆయన భార్య రీటా కూడా కంటి వైద్యురాలు. కొదురుపాక శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్లో మునిగిపోవడంతో ఆర్అండ్ఆర్ కాలనీని నిర్మించారు. అయితే సొంతూరికి ఏదైనా చేయాలనే తలంపుతో 2021లో బహుళ అంతస్తుల్లో ఆధునాతన సౌకర్యాలతో కంటి దవాఖానను నిర్మించారు. అదే సంవత్సరం డిసెంబర్ 19న వైద్యసేవలను ప్రారంభించారు. ఇందులో నామినల్ ఫీజు రూ.50తో కంటి పరీక్షలు చేస్తారు. అవసరమున్నవారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తారు. ఈ వైద్యశాలలో నిత్యం వైద్యులు అందుబాటులో ఉంటారు. రాజలింగం ప్రతి రెండో శని, ఆదివారాలు, నాల్గో ఆదివారం సేవలందిస్తారు. అతడి భార్య రీటా ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటారు. కాగా శనివారం తొలిసారిగా 13 మందికి కంటి ఆపరేషన్లు చేశారు. వీరిని ఆదివారం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. మండలంలోని అన్ని గ్రామాలు, పాఠశాలల్లో కంటి చికిత్సపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని రాజలింగం చెప్పారు.
ట్రస్టు సభ్యులు వీరే
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు, కొదురుపాక ఉపసర్పంచ్ హేజీబు రవిచందర్, డాక్టర్ బొలుమాల అనంతం, డాక్టర్ పూర్ణచందర్ రావు (యూఎస్ఏ), డాక్టర్ శాంతి (ఇప్పనపల్లి), బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.ఎస్ రావు, డాక్టర్ రాజలింగం, డాక్టర్ రీటా, డాక్టర్ రిషబ్, డాక్టర్ దివ్య, ఎక్స్ అఫీషియో సభ్యులు సర్పంచ్ జోగినపల్లి శ్యామల వెంకట్రామరావుతో పాటు మరో 9 మంది ఉన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
పేదలు కొదురుపాక కంటి దవాఖానలో అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి. కేవలం పేదల కోసమే ఈ దవాఖానను ఏర్పాటు చేశాం. నిర్వహణ కోసం నామినల్ చార్జీలు తీసుకుని, నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం. వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారు. వచ్చే రోగులను బట్టి ప్రతి వారం కంటి ఆపరేషన్లు నిర్వహిస్తాం.
– డాక్టర్ రీటా బహుదుర్, కంటి వైద్య నిపుణులు, కొదురుపాక
పుట్టిన ఊరికి సేవ చేయాలనే..
నా తల్లిదండ్రులు బుచ్చమ్మ, చంద్రమౌళి పేరిట ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు కంటి వైద్యం అందించేందుకు మా గ్రామంలో కంటి దవాఖాన నిర్మించాం. పుట్టిన ఊరికి సేవ చేయాలనే లక్ష్యంతో ఉచితంగా వైద్యం అందించేందుకు రూపకల్పన చేశాం. గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు పూర్తిగా సహకరించారు. కంటి వైద్యం పట్టణాల్లో చాలా ఖరీదైంది. అందుకే పేదలకు నామినల్ ఫీజు తీసుకుని కంటి పరీక్షలతోపాటు అవసరం ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నాం.
– వైర్యాగ్యం రాజలింగం, కంటి వైద్య నిపుణులు, కొదురుపాక
ఉన్న ఊళ్లెనే ఆపరేషన్ చేయించుకున్న
ఉన్న ఊళ్లెనే కంటి ఆపరేషన్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఏడాది నుంచి కుడి కన్ను మసక మసక కనిపిస్తున్నది. పైసల్ లేక ఆపరేషన్ చేయించుకునుడు ఎట్ల అని మస్తు బాధపడ్డ. ఇప్పుడు నా ఊళ్లెనే ఇంటి ముందున్న దవాఖానలో శనివారం ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించుకున్న. మా అసోంటి పేదలకు ఈ దవాఖాన చాలా ఉపయోగపడుతది.
– ర్యాకం భారతి, కొదురుపాక
పల్లెటూరిలో పట్నం వైద్యం
పల్లెటూరిలో పట్నంలో అందించే వైద్యం చేయ డం చాలా సంతోషంగా ఉన్నది. పరీక్షల కోసం రూ. 50 తీసుకుని, ఉచితంగా కంటి ఆపరేషన్ చేస్తున్నరు. ఇలాంటి కంటి వైద్య శిబిరాలు పేదలకు చాలా ఉపయోగ పడుతాయి. పేదలతోపాటు బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఈ దవాఖానతో మేలు జరుగుతది.
– తుంగ దేవరాజు, సిరిసిల్ల