Jeevan Reddy : జగిత్యాల కాంగ్రెస్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కొన్ని రోజులుగా అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి (Tatiparthi Jeevan Reddy) పార్టీని వీడే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. తనను కాదని ఈమధ్యే పార్టీలో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar)కు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో చిన్నబుచ్చుకున్నారు. కొత్తవారికి పెద్దపీట వేసి.. పాతవారిని అవమానపరుస్తున్నారని పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి కాంగ్రెస్కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా సోమవారం ఆయన ఇంటికి సమీపంలోని కాంగ్రెస్ ఫ్లెక్సీలను అభిమానులు తొలగించారు.
కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న జీవన్ రెడ్డి తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నారు. సీనియర్ నాయకుడైన తనకు సముచిత ప్రాధాన్యం లభించకపోవడంతో పలుమార్లు రేవంత్ సర్కార్పై మండిపడిన ఆయన.. కొత్త దారి చూసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. రేవంత్ ప్రభుత్వం పనితీరుపై తీవ్ర ధిక్కార స్వరం వినిపిస్తున్న జీవన్ రెడ్డి సోమవారం కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి నిరసన లో పాల్గొన్నారు. తద్వారా పార్టీ మార్పుపై క్లారిటీ ఇవ్వకున్నా .. మారడం పక్కా అనే సంకేతాలు ఇచ్చారు జీవన్ రెడ్డి. ఈ క్రమంలోనే జీవన్ రెడ్డి నివాసం వెలుపల ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఫ్లెక్సీలను ఆయన అభిమానులు తొలగించారు.
కాంగ్రెస్ ఫ్లెక్సీ తొలగిస్తున్న జీవన్ రెడ్డి అభిమానులు

జీవన్ రెడ్డి ఆదేశాలతోనే వారు ఫ్లెక్సీలను చించేసి.. తొలగించినట్టు సమాచారం. ఇటీవల పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి పయనమెటు? అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సోమవారం ఉదయం జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. ఆయన లైట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నలభై ఏండ్ల కాంగ్రెస్ ప్రయాణానికి మీరిచ్చిన బహుమతి ఇదేనా? ..ఇక కాంగ్రెస్ తో నా ప్రయాణం చాలు అంటూ జీవన్ రెడ్డి బదులిచ్చినట్టు సమాచారం.