సారంగాపూర్, జూన్ 17: సారంగాపూర్ (Sarangapur) మండలంలోని పోతారం పంచాయతీ పరిధిలోని గణేషపల్లి శివారులో మినిస్టేడియం, స్విమ్మింగ్ పూల్స్ నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.2.85కోట్లు మంజూరు చేసింది. మినిస్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి 8.06 ఎకరాల ప్రభుత్వ భూమిని తహసిల్దార్ కేటాయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ నిధుల లేమితో అగ్రిమెంట్ కాక నిర్మాణ పనులకు మోక్షం లేకుండా పోయింది. 2016-17 సంవత్సరంలో మినీస్టేడియం ఏర్పాటు కోసం గణేషపల్లి శివారులో స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. దీంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం 2.65 కోట్లు కేటాయిస్తు నిధులు విడుదల చేసింది. సంబంధిత శాఖ అధికారులు టెండర్లు ప్రక్రియను పూర్తి చేశారు.
మినిస్టేడియంలో అవుట్ డోర్ ఇండోర్ గేమ్స్ ఆడుకునేందుకు అనుకులాంగా ఉంటుంది. కబడ్డి, వాలీబాల్, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, టెన్నిస్, బ్యాడ్మింటన్తోపాటు ఇతర ఇండోర్ గేమ్స్ ఉంటాయి. రెండు స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేస్తుండగా ఇందులో ఒకటి చిన్నది. మరోకటి పెద్దగా ఉంటుంది. మొదట మినీస్టేడియం, స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటుకు అధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం రూ. 2.65కోట్లు మంజూరు చేయగా, పూర్తి స్థాయిలో మినిస్ట్రీడియం, స్విమ్మింగ్స్ ఫూల్స్ నిర్మాణం చేపట్టడం, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు అదనంగా మరో రూ. 35 లక్షలు మంజూరీకి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు పేర్కోన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి అయిందని కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ కాక పోవడంతో మండలంలో మినీస్టేడియం, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు కలగానే మిగలనుందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.