జగిత్యాల : జిల్లాలో హరిత వనాలను పెంచడానికి ఫారెస్ట్ అధికారులు సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు. సాధారణ అవసరాలకు వాడే డ్రోన్ల ద్వారా క్షీణించిన అడవులను పునరుద్ధరించడం కోసం గుట్టలపైన విత్తనాలను నాటడానికి సీడ్ బాల్స్ ని వినియోగించారు.
దాదాపు 25 వేల విత్తనాలను డ్రోన్ టెక్నాలజీ ద్వారా నాటారు. సమస్యాత్మకంగా ఉండే ఎత్తైన గుట్టలు లాంటి ప్రాంతాల్లో మొక్కలు నాటడానికి కృషి చేస్తున్నామని జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.
సాధారణంగా మొక్కలు నాటడానికి అత్యధిక సమయం తీసుకునే ఎత్తైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక టెక్నాలజీని వాడటం ద్వారా దాదాపు.. ఒక కిలోమీటరు వరకు జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట గుట్ట ప్రాంతంలో 25 వేల వరకు సీడ్ బాల్స్ వేశామని ఆయన తెలిపారు.
టెక్నాలజీ వాడడంతో అతి తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలను నాటే ఈ ప్రక్రియ విజయవంతంగా జగిత్యాల అటవీశాఖ అధికారులు పూర్తి చేయగలిగారు. పూర్తిగా స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించామని ఫారెస్ట్ శాఖకు ఎలాంటి ఖర్చు లేదని డీఎఫ్ వో వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్వో ప్రణీత్ కౌర్, డీఆర్వో అరుణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.