జగిత్యాల : దళితుల జీవితాల్లో వెలుగులు నింపి ఆర్థిక అభివృద్ధి సాధించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ 11వార్డుకు చెందిన క్రాంతి అనే లబ్ధిదారుడికి దళిత బంధు పథకం ద్వారా మంజూరైన మారుతి ఎర్టిగా వాహనాన్ని అందజేసి మాట్లాడారు.
దళితులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు దళిత బంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
దళిత బంధు పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా బ్యాంకు లోన్ లింకేజీ లేకుండా 10 లక్షల రూపాయలను నేరుగా దళితుల అకౌంట్లలో జమ చేస్తున్నామన్నారు. దళితులు వారు కోరుకున్న రంగాల్లో ఎదిగేందుకు మంచి యూనిట్లను ఎంచుకొని ఆర్థిక సాధికారత సాధించాలన్నారు.
గతంలో దళితులను ఓటు బ్యాంక్ రాజకీయాలకే వాడుకున్నారని ఈ సందర్భంగా ప్రతిపక్షాలను ఉద్దేశించి విమర్శించారు.
కార్యక్రమంలో పట్టణ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.