Day Care Centre | జగిత్యాల, మే 19: జగిత్యాల జిల్లా కేంద్రంలో వయోవృద్ధుల సంక్షేమం కోసం బహుళసేవల డే కేర్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తెలిపారు. ఇవాళ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా స్థాయి సమావేశంలో డే కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం వివరాలను వెల్లడించారు.
తమ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. నర్సింహా రావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేసిన వినతి మేరకు కుటుంబసభ్యులు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా 37 డే కేర్ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందన్నారు. పగలంతా వృద్ధులు ఈ కేంద్రాల్లో సేదతీరవచ్చునని, అటల్ వయో అభ్యుదయ యోజన నిబంధనల మేరకు ఈ డేకేర్ సెంటర్లు నిర్వహించేందుకు సిద్ధం చేసిన దస్త్రంపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంతకం అనంతరం ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారని వివరించారు.
వృద్ధుల్లో ఒంటరి భావనను పోగొట్టేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడనున్నాయని, వీటిని వయోవృద్ధుల సంక్షేమ శాఖ నిర్వహించనుందని, నిర్వహణకు ప్రభుత్వం ఏటా రూ.4.61 కోట్లు ఖర్చు చేయనుందన్నారు. ఒక్కో కేంద్రంలో 50 మందికి సదుపాయాలు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హనుమకొండ జిల్లాల్లో రెండేసి చొప్పున, మిగతా 29 జిల్లాల్లో ఒకటి చొప్పున ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
ఒక్కో డే కేర్ సెంటర్లో 50 మందికి అవసరమైన ఏర్పాట్లు ఉంటాయని, కిచెన్, వైద్యుల గది, విశాలమైన హాల్, క్యారమ్స్, టెన్నిస్, చెస్ వంటి ఆటవస్తువులు, లైబ్రరీ, ఇతర మౌళిక సదుపాయాలు కల్పిస్తారని, ప్రతివారం రెండుసార్లు వైద్యులతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా ఇస్తారు. ఇక్కడికి వచ్చే వృద్ధులకు రాగి జావ, పండ్లు, పండ్ల రసాలు, ఉప్మా, టీ, బిస్కెట్లు అందించేలా ప్రణాళికలు రూపొందించారని హరి ఆశోక్ కుమార్ తెలిపారు.
ఈ మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో డే కేర్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు పోవడం పట్ల తమ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ పక్షాన వారికి హరి అశోక్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు, ఉపాధ్యక్షుడు పి.హన్మంత రెడ్డి, ఎండీ యాకూబ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పూసాల ఆశోక్ రావు, జగిత్యాల డివిజన్ అధ్యక్షుడు బి.రాజేశ్వర్, కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం, మెట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు వొజ్జల బుచ్చిరెడ్డి, జగిత్యాల రూరల్ మండలం అధ్యక్షుడు నక్క ఇంద్రయ్య, జగిత్యాల పట్టణ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది పి.సతీష్ రాజ, మహిళా నేతలు కరుణ, విజయలక్ష్మి, రాధ, మంజరి, పద్మ తదితరులు పాల్గొన్నారు.