జగిత్యాల : దళిత బంధు దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అంబేద్కర్ కలలుగన్న స్వరాజ్య స్థాపనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల అర్బన్ మండలంలోని తిప్పన్న పేట గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని దళిత బంధు పథకం యూనిట్ ద్వారా మంజూరైన నీరటి గంగాధర్ కన్స్ట్రక్షన్ షాప్ ను ప్రారంభించారు.
ముప్పలపు చెరువు అవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో గ్రామాలకు మహర్దశ పట్టిందన్నారు. గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారాయన్నారు. గ్రామాలు ఆర్థికంగా బలపడేందుకు సీఎం కేసీఆర్ పల్లెప్రగతి ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు. పల్లె ప్రగతి పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
దేశానికి కేసీఆర్ పాలన ఆవసరమని అనేక రాష్ర్టాల ప్రజలు, నాయకులు కోరుకుంటున్నారన్నారు. దళితబంధు పథకాన్ని చూసి ప్రతిపక్ష నాయకులకు నిద్రపట్టడం లేదన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎంపీపీ ములాసపు లక్ష్మి, జెడ్పీటీసీ మహేశ్, రూరల్ ఎంపీపీ రాజేద్రప్రసాద్, సర్పంచ్ రౌతు జయ, ఉప సర్పంచ్ బొడ్డు బుచ్చన్న, తదితులున్నారు.