జగిత్యాల : విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. పదవ తరగతి వార్షిక పరీక్షల సందర్భంగా సోమవారం జగిత్యాల పట్టణ కేంద్రం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఓల్డ్ ) పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. పరీక్షా గదుల్లో వెలుతురు, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా ఉన్నాయా అనే విషయాలను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కేంద్రంలోకి అనుమతించరాదని స్పష్టం చేశారు.
సీసీ కెమెరాల పర్యవేక్షణ సక్రమంగా కొనసాగాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షల సమయంలో పారదర్శకత, క్రమశిక్షణ పాటించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రీక్షలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆయన వెంట డీఈవో కె. రాము, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.