జగిత్యాల, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా స్పష్టం చేశారు. సంక్షేమంలో సరికొత్త అధ్యాయం సృష్టించి ప్రజల ఉద్యమ ఆకాంక్షలు, ప్రజాసంక్షేమమే ప్రాధాన్యాలుగా, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే బాధ్యతగా ముందుకు వెళ్తామన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రసంగించారు. రాష్ట్రం ప్రగతి వైపు పయనిస్తున్నదని, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. అభయహస్తం పథకంలో ఆరు గ్యారెంటీల అమలులో జిల్లాలో 3,35,781 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.
రేషన్ కార్డుల కోసం 62,305 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఇప్పటి వరకు 13,10,000 మంది వినియోగించుకున్నారని తెలిపారు. అర్హులైన మహిళలకు ప్రతి నెలా 2,500 ఆర్థికసాయం, 500కే వంట గ్యాస్ సిలిండర్ను ప్రభుత్వం త్వరలోనే అందిస్తుందన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. రైతు ఆర్థిక స్థితి పెరిగితే గ్రామాలు బాగుంటాయనే లక్ష్యంతో రైతు భరోసా పథకం ద్వారా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి ఏడాదికి 15 వేలు, రైతు కూలీలకు 12 వేల ఆర్థికసాయం అందించనున్నట్లు చెప్పారు.
2 లక్షల రైతు రుణ మాఫీకి సంబంధించి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయని, 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే గృహ యజమానులకు గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం, ఎస్సీ, ఎస్టీలకు లక్ష అదనంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పారు. ఇళ్లు లేని తెలంగాణ అమవీరుల కుటుంబాలకు, ఉద్యమ కారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం పంపిణీ చేస్తామని, చేయూత పథకం ద్వారా వృద్ధులకు రూ.4 వేలు, దివ్యాంగులకు 5 వేలు త్వరలోనే అందిస్తామని వివరించారు. జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్న పార్లమెంట్ సభ్యులు, జడ్పీ చైర్పర్సన్, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శాంతి భద్రతలకు కృషి చేస్తున్న జిల్లా జడ్జి, ఎస్పీ, పోలీస్ యంత్రాంగానికి అభినందనలు చెప్పారు.