జగిత్యాల సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ధరూర్ క్యాంపులో ఉన్న
33 ఎకరాల ఎస్సారెస్పీ ఆబాది స్థలంలో 49.20 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ పాలనా భవనం రేపటి నుంచే అందుబాటులోకి రానున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రారంభించనున్నారు. దీంతోపాటు 119 కోట్లతో 27.08 ఎకరాల్లో మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ఇప్పటికే అధికారులు సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్ల్లు చేశారు.
– జగిత్యాల, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ)
మెడికల్ కాలేజీకి సొంత భవనం
జగిత్యాల, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : కొత్త జిల్లాగా అవతరించిన జగిత్యాలలో నూతన కలెక్టరేట్ నిర్మాణానికి ప్రభుత్వం విశాలమైన స్థలాన్ని కేటాయించడంతో పాటు నిర్మాణానికి కావాల్సిన నిధులను సైతం మంజూరు చేసింది. ప్రభుత్వ నిర్దేశిత ప్రణాళిక ప్రకారం సమీకృత కలెక్టరేట్ నిర్మాణం పూర్తి చేసింది. దీనిని ఈ నెల 7న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో కలెక్టరేట్కు తుది మెరుగులు దిద్దాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. దీంతో ఏర్పాట్లలో అధికారయంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కలెక్టరేట్ను పరిశీలించి, సీఎం పర్యటన, ప్రారంభోత్సవంపై కలెక్టర్ జీ రవికి సూచనలు చేశారు. ఈ మేరకు కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
49.20 కోట్లు.. 33 ఎకరాలు
సమీకృత కలెక్టరేట్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం 2017లో సూత్రప్రాయంగా నిర్ణయించింది. సకల సౌకర్యాలతో, ఆధునిక పద్ధతిలో కలెక్టరేట్ నిర్మాణం చేపట్టేందుకు స్థలాన్ని పరిశీలించి, వివరాలు పంపాలని ఆదేశించింది. దీంతో అప్పటి కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ ధరూర్ క్యాంపులో ఉన్న 33 ఎకరాల ఎస్సారెస్పీ ఆబాది స్థలం సమీకృత కలెక్టరేట్ నిర్మాణానికి అనువుగా ఉందని నివేదిక పంపించారు. ఈ మేరకు కలెక్టరేట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు 49.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. హైదరాబాద్కు చెందిన నవతేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సమీకృత కలెక్టరేట్ నిర్మాణానికి 2017 నవంబర్లో శ్రీకారం చుట్టింది.
కేటాయించిన 33.14 ఎకరాల స్థలంలో 8 ఎకరాల్లో జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం, అదనపు కలెక్టర్ కార్యాలయం, జిల్లా రెవెన్యూ అధికారి క్యాంపు కార్యాలయాలను నిర్మించింది. 6 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కలెక్టర్ కార్యాలయం, 2877 చదరపు అడుగుల విస్తీర్ణంలో అదనపు కలెక్టర్ క్యాంపు కార్యాలయం, 2130 చదరపు అడుగుల వైశాల్యంలో జిల్లా రెవెన్యూ అధికారి క్యాంపు కార్యాలయాలను నిర్మించింది. ఇక జీప్లస్ 2 పద్ధతిలో 19,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో జిల్లా స్థాయి అధికారుల గృహ సముదాయాలను నిర్మించింది. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, రెవెన్యూ అధికారుల క్యాంపు కార్యాలయాలను దాదాపు రెండున్నరేళ్ల క్రితమే నిర్మించడంతో పాటు ప్రభుత్వానికి అప్పగించారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు ఆయా క్యాంపు కార్యాలయాల నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.
సకల సౌకర్యాలు
సకల సౌకర్యాలు, అధునాతన పద్ధతిలో సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం పూర్తయింది. 31 శాఖలకు సంబంధించిన కార్యాలయాలకు గదులను నిర్మించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ల కోసం మూడు పెద్ద చాంబర్లను నిర్మించారు. అలాగే విజిటర్స్ వెయింటింగ్ హాల్తో పాటు ఇంటిగ్రేటెడ్ మీటింగ్ హాల్, మూడు మినీ మీటింగ్ హాళ్లను సైతం నిర్మించారు. కలెక్టర్, ఇద్దరు అదనపు కలెకర్లు, పరిపాలనా అధికారి చాంబర్లను కేస్ట్ సీలింగ్ (సెంట్రల్ ఏసీ) ఏర్పాటు చేశారు.
సమీకృత సమావేశ మందిరంలోనూ సెంట్రల్ ఏసీ చేశారు. మూడు అంతస్తుల్లో నిర్మించిన కలెక్టరేట్లో అంతర్గత రోడ్ల నిర్మాణం కొన్ని నెలల కిందటే పూర్తి చేశారు. అలాగే, కలెక్టరేట్ పైభాగంలోకి చేరుకునేందుకు రెండు లిఫ్ట్లను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో విద్యుత్ సౌకర్యం కోసం 315 కేవీ సామర్థ్యం కలిగిన రెండు విద్యుత్ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అలాగే 160 కేవీ సామర్థ్యం కలిగిన జనరేటర్ను అమర్చారు. సమీకృత కార్యాలయం చుట్టూ ప్రహరీ నిర్మించారు. సీఎం కేసీఆర్ కలెక్టరేట్ను ప్రారంభించనున్న నేపథ్యంలో తుది మెరుగులు దిద్దే పనిలో కాంట్రాక్టర్లు, అధికారులు నిమగ్నమయ్యారు.