పెద్దపల్లి, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : డీ83 కెనాల్ ద్వారా మంథని ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని సీఈ సుధాకర్రెడ్డిని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదేశించారు. డీ83 పరిధిలో వేలాది ఎకరాల్లో వరి పొలాలు ఎండే ముప్పు ఉండడం, సాగునీరివ్వాలని రైతులు విజ్ఞప్తి చేయడం, దీనిపై సోమవారం నమస్తే తెలంగాణలో ‘నీళ్లు లేక నెర్రెలు’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో మంత్రి స్పందించారు.
ఈ మేరకు డీ 83 కెనాల్ నుంచి గుండారం నుంచి కమాన్పూర్, రామగిరి, ముత్తారం మండలాల్లో పొలాలకు మంగళవారం ఉదయం నుంచి నీరివ్వాలని సూచించారు. ఎగువ భాగంలో కాలువకు మోటర్లు పెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అనుమతులు లేకుండా మోటార్లు పెట్టే రైతులకు కరెంట్ కట్ చేయాలని చెప్పారు. మంథని డివిజన్ పరిధిలోని అన్ని మండలాల రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సాగునీరివ్వాలని సీఈని మంత్రి ఆదేశించారు.