అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్పించేందుకు యంత్రాంగం యుద్ధమే చేస్తున్నది. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం అక్టోబర్ ఒకటి నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్న ఆదేశాల మేరకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. అందులో భాగంగా శని, ఆదివారాల్లో స్పెషల్ క్యాంపులను నిర్వహిస్తున్నది. ఈ మేరకు ప్రతి బూత్ పరిధిలో రెండు రోజులపాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) అందుబాటులో ఉండనుండగా, కొత్తగా నమోదు, అనుమానాల నివృత్తి, మార్పులు చేర్పులు చేసుకునే అవకాశమున్నది. అయితే అర్హత ఉన్న ప్రతి ఓటరును జాబితాలో చేర్చాలన్న లక్ష్యంతో మూడు నెలల నుంచి ప్రయత్నాలు చేస్తుండగా, ఇప్పటికే ఆయా జిల్లాల్లో నమోదు 12 నుంచి 15 శాతం పెరిగింది. మిగిలిన అర్హులను సైతం జాబితాలో చేర్చడంతోపాటు వందశాతం లక్ష్యంతో కలెక్టర్లు ముందుకెళ్తుండగా, ఈ సారి ఓటరు నమోదు గడువు ఈ నెల 19తో ముగియనున్నది. వచ్చే నెల 4న తుది జాబితా విడుదల చేయనుండగా, ఎన్నికల సంఘం ఇచ్చిన అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నది.
– కరీంనగర్, ఆగస్టు 31 (నమస్తేతెలంగాణ ప్రతినిధి)/ కలెక్టరేట్
కరీంనగర్, ఆగస్టు 31 (నమస్తేతెలంగాణ ప్రతినిధి)/ కలెక్టరేట్ : అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్చేందుకు నాలుగు జిల్లాల అధికారయంత్రాగం క్షేత్రస్థాయిలో తలమునకలైంది. మూడు నెలల నుంచి కసరత్తు చేస్తున్నది. అయితే కొన్ని చోట్ల ఆశించిన దానికన్నా ఎక్కువ స్పందన వస్తుండగా.. మరికొన్ని చోట్ల నామమాత్రంగా ఉన్నది. వీటిని దృష్టిలో పెట్టుకున్న అక్టోబర్ ఒకటి నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు అవకాశం కల్పిస్తున్నది. అలాగే అర్హత ఉండి, ఓటు హక్కు నమోదు చేసుకోలేని వారిని గుర్తించి.. జాబితాలో చేర్పిస్తున్నది. దీనిపై విసృత ప్రచారం చేస్తూనే మరోవైపు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నది. మొదటి విడుతగా ఆగస్టు 26, 27 తేదీల్లో మొదటిసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. తిరిగి శని, ఆదివారాల్లో (ఈ నెల 2, 3 తేదీలు) స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ తేదీల్లో బీఎల్వోలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్లో ఉంటారు. కొత్తగా నమోదు, అనుమానాల నివృత్తి, మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశమిచ్చారు. ఇదే సమయంలో పంచాయతీల పరిధిలో ఈ రెండు రోజులపాటు పంచాయతీ సిబ్బంది ఇంటింటా తిరిగి, అర్హత ఉండి ఓటరు జాబితాలో పేరు లేని వారిని గుర్తించి నమోదు చేయించేందుకు చర్యలు తీసుకుంటారు. స్పెషల్ డ్రైవ్లో నేరుగా నమోదు చేసుకునే వీలుకాని వారు.. అక్టోబర్ 19వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసలు బాటు కల్పించారు. కానీ, బీఎల్వోల వద్ద నమోదు చేసుకుంటే పని సులువవుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా, అందుకు సంబంధించిన తుది జాబితాను అక్టోబర్ 4న విడుదల చేస్తారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం చూస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నిల్లో ఈ జాబితా ప్రకారమే ఓటు వేయడానికి ఆస్కారం ఉంటుంది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్లు పదేపదే కోరుతున్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం గత జనవరిలో ఓటర్ల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం చూస్తే గడిచిన నాలుగేళ్లలో (2018 డిసెంబర్ ఎన్నికల నుంచి 2023 జనవరి నాటికి) ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,85,496 మంది ఓటర్లు పెరిగారు. యంత్రాగం ఓటు హక్కుపై చేపట్టిన అవగాహన కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైందన్న అభిప్రాయాలున్నాయి. నిజానికి గతంలో చూస్తే ఉమ్మడి జిల్లాలో లక్ష నుంచి 1.50 లక్షలకు మించి ఓటర్ల సంఖ్య పెరగలేదు. కానీ, గత జనవరి నాటికే 1.85 లక్షలు ఈ సారి పెరిగింది. 2018 ఎన్నికల సమయంలో ఓటర్ల సంఖ్య 27,87,549 ఉంటే.. గత జనవరిలో ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా ప్రకారం 29,73,045 మంది ఉన్నారు. ఈ లెక్కన గడిచిన నాలుగేళ్లలో 1,85,496 మంది ఓటర్లు పెరిగారు. ఇదిలా ఉంటే గడిచిన మూడు నెలలుగా ఓటరు నమోదు ప్రక్రియలో ఆయా జిల్లాలో ఉన్న ఓటర్లు 12 నుంచి 15 శాతం వరకు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల నిర్వహించే స్పెషల్ డ్రైవ్తోపాటు 19వరకు ఉన్న అవకాశాన్ని కలిపి చూస్తే.. ఈ సంఖ్య మొత్తం 2.50 లక్షలకు చేరవచ్చన్న అంచనాలున్నాయి. అయితే ఇంతకు మించి వచ్చినా, మార్పులు చేర్పులతోపాటు కొంత మంది మరణించిన వారి ఓట్లు తొలగిస్తున్న నేపథ్యంలో పెరుగుదల రెండున్నర లక్షలకు వరకే ఉండే అవకాశమున్నది.
అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కొత్తగా ఓటు నమోదుతోపాటు మార్పులు, చేర్పులు కూడా చేస్తున్నారు. అయితే ఫైనల్ జాబితా అక్టోబర్ 4న విడుదలవున్న నేపథ్యంలో.. మార్పులు చేర్పులకు ఇదే చివరి అవకాశమని, అందుకే ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు, పూర్తి వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అందుకు మరో 19 రోజులు మాత్రమే గడువు ఉన్న పరిస్థితుల్లో జాబితాను ప్రతి ఒక్కరూ చూసుకోవాల్సిన అవసరమున్నది. గతంలో బీఎల్వోల వద్దకు వెళ్తేనే ఈ వివరాలు తెలిసేవి. వీటిని అధిగమించడానికి ఓటరు జాబితాలో పేరు ఉన్నదా..? లేదా? అని తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం ఆన్లైన్లోనే అవకాశం కల్పించింది. పేరు చూసుకోవడంతోపాటు కొత్తగా ఓటు నమోదు, అలాగే ఏవైనా తప్పులుంటే సవరణను ఆన్లైన్లో చేసుకునే వెసలుబాటు ఇచ్చింది. అందుకోసం voters.eci.gov.in పోర్టల్ లాగిన్ కావాలి. అందులో పూర్తి వివరాలు ఉంటాయి.
ఒకవైపు కొత్త ఓటర్లను నమోదు చేస్తున్న యంత్రాంగం, మరోవైపు బోగస్పై దృష్టి పెట్టింది. ఒకే ఇంటిలో అధిక ఓట్లు ఉన్నట్లుగా గుర్తిస్తే.. సదరు ఇంటికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నది. ఆరు ఓట్లకుపై బడి ఉన్న ఇండ్లు చాలానే ఉన్నాయి. కొత్త సాఫ్ట్వేర్ ఆధారంగా ఒకే ఇంటి నంబర్లో ఆరు ఓట్లకుపైగా ఉన్న ఓటర్ల వివరాలను సేకరించి, బూత్ లెవల్ అధికారులకు పంపిస్తున్నారు. సదరు జాబితా ఆధారంగా ఆ ఇంటికి వెళ్లి, సదరు ఓటర్లు ఆ ఇంట్లో ఉన్నారా..? లేరా..? ఒక వేళ ఉంటే అందుకు సంబంధించిన ధృవపత్రాలను బీఎల్వోలు పరిశీలిస్తారు. ఆ వివరాలు సరిగా లేని పక్షంలో ఆ ఓటుపై బీఎల్వోలు నిర్ణయం తీసుకోనున్నారు. అయితే సదరు నిర్ణయానికి కారణాలను అదే ఫార్మెట్లో పొందుపరచాలి. తద్వారా బోగస్ ఓట్లకు భారీగా కళ్లెం వేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే రెండు చోట్ల ఓట్లు ఉన్న వారిని గుర్తించి.. పరిశీలన చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒకే చోట మాత్రమే ఓటు ఉండాలి. అయితే రెండు చోట్ల ఓటు ఉన్నవారికి సమాచారం ఇచ్చి, వారు కోరుకున్న చోట ఓటు ఉంచి మిగిలిన దానిని తొలగిస్తున్నారు. గతంలో వివిధ కారణాలతో పలువురి పేర్లు జాబితాలో తొలగించారు. అవి కరెక్టుగా ఉన్నాయా..? లేదా..? చూస్తున్నారు. పొరపాటు ఉంటే వెంటనే వాటిని సవరించి అర్హులకు అన్యాయం జరగకుండా జాబితాలో చేరుస్తున్నారు.