‘కాంగ్రెస్ను నమ్మితే ధరణి రద్దయితది. ధరణిపోతే ఎన్కటిలెక్క గోస పడుతం. డిజిటల్ రికార్డులు మాయమై రాత పుస్తకాలు వస్తయి. మళ్ల పటేల్, పట్వారీ వ్వవస్థ వస్తది. పైసా లేకుండా పనికాదు. ఎవరు లంచమిస్తే వారి పేరు మీద భూములు పట్టాలైతయ్. రాత్రికి రాత్రే రికార్డులు మారుతయ్. కౌలుదారు భూ యజమానికి కొట్లాటలు మొదలైతయ్. పైరవీకారులు పుట్టుకొస్తరు. పొలం పనులు వదిలి పెట్టి ఆఫీసులు, దళారుల చుట్టూ తిరగడానికే సరిపోతది. పదేండ్లు వెనక్కి వెళ్తం.’ అని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అచ్చేది లేదు.. సచ్చేదు లేదు గానీ, పూటకోమాట చెబుతూ పరేషాన్ చేస్తున్నదని మండిపడుతున్నారు. ధరణిని రద్దు చేస్తామన్న ఆ పార్టీని బంగాళాఖాతంలో వేస్తామని హెచ్చరిస్తున్నారు. భూములకు రక్షణ కల్పించి, ఇబ్బందులు లేకుండా చేసిన సీఎం కేసీఆర్ను మరోసారి గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
– కరీంనగర్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కాంగ్రెస్ ధరణిని రద్దు చేస్తే కష్టాలు తప్పవు. కౌలుచట్టంతో రైతులు, కౌలుదారులకు అనవసర వివాదాలు తలెత్తుతయ్. లేనిపోని గొడవలు మొదలైతయి. భూ యజమాని ఇబ్బంది పడాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తుంది. ఇవన్నీ ఉండద్దనే ముందు చూపుతో రైతుబిడ్డ అయిన కేసీఆర్ ధరణి తెచ్చిండు. ఇప్పుడు ఎలాంటి సమస్యల్లేవు. భూములకు రక్షణ పెరిగింది. నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు అయితున్నయి. మళ్లీ ధరణిని కాంగ్రెసోళ్లు రద్దు చేస్తరట? బంగాళాఖాతంల కలుపుతరట? ఎందుకు? దోపిడీ కోసమేకదా.. రైతులను ఆగం చేసేటందుకే కదా.. ఇది రైతులందరూ ఆలోచించాలె. నాడు అరిగోస పెట్టి, ఇప్పుడు మళ్లీ వస్తున్న కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలె. భూములకు రక్షణ కల్పించిన బీఆర్ఎస్నే గెలిపించుకోవాలె.
– పోరెడ్డి రంగారెడ్డి, రైతు పెద్దపాపయ్యపల్లి (హుజూరాబాద్ టౌన్)
కరీంనగర్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘మునుపు భూమికి సంబంధించిన ఏదైనా దస్త్రం కావాలంటే మా దగ్గర లేదంటూ రెవెన్యూ వాళ్లు ముప్పు తిప్పులు పెటిన్రు. ఎవరికి చెప్పుకుంటవో చెప్పుకపో అన్నరు. ఏ అధికారి వద్దకు వెళ్లినా పని గాలే. ఏమన్నంటే ఆ దస్ర్తాలు చినిగిపోయినవి అనేటోళ్లు. నిజాం కాలం నాటి రికార్డులు మా దగ్గర ఉంటయా..? అని బెదిరించేటోళ్లు’ అని జిల్లా రైతులు నాటి పాలనలో పడ్డ గోసను గుర్తు చేసుకున్నారు. ధరణి వచ్చిన తర్వాత ఎవరి దగ్గరకు పోవాల్సిన అవసరం లేకుండా పోయిందని, రిజిస్ట్రేషన్ అయిన వెంటనే కాగితాలు వస్తున్నాయని, తమ పాస్బుక్కులు పట్టుకొని పోతే చాలు ధరణిలో చూసి లోన్లు ఇస్తున్నారని సంతోష పడుతున్నారు. స్వరాష్ట్రంలోనే తమ భూములకు భద్రత ఏర్పడిందని, గ్రామాల్లో జాగల కిరికిరి పోయిందని, ఉన్నదాంట్లో కొంత అమ్ముకుంటే.. వెంటనే మా పాస్బుక్కులో తగ్గి.. కొన్నోళ్ల పేరిట ఎక్కుతున్నదని, వాళ్లకు మ్యుటేషన్ అయితున్నదని చెబుతున్నారు.
గతంలో అమ్మినోళ్ల భూమి నుంచి కట్ అయ్యేది కాదని, కొన్నోళ్లకు ఎక్కాలంటే నెలలు తిరగాల్సి వచ్చేదని, లంచాలు ఇవ్వనిదే పని అయ్యేది కాదని, ఇటు ఏ గ్రామంలో చూసినా భూతగాదాలే కనిపించేవని, అవి హత్యలకు కూడా దారితీసేవని అప్పటి రోజుల గురించి చెప్పారు. ఇప్పుడు అంతా మంచిగున్న సమయంలో కాంగ్రెసోళ్లు ధరణి ఎత్తేస్తామంటున్నారని మండిపడుతున్నారు. ధరణి ఎత్తేస్తే ఎన్కటి లెక్క దళారులే వస్తారని, మళ్లీ గొడవలు జరుగుతాయని, అరిగోస పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ గురించి ఆలోచించి ధరణిని తెచ్చి భూములకు రక్షణ కల్పించి, గొడవలు లేకుండా చేసిన కేసీఆర్కు కర్షకలోకం అండగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
ధరణి పోర్టల్ను తీసివేస్తే రైతులు మళ్లీ దోపిడీకి గురవుతారు. కాంగ్రెస్ నేతలకు రైతులు సల్లగుండడం ఇష్టం లేదు. వారిని దోచుకోవడానికి ఆ పార్టీ నేతలకు మార్గాలు కావాలి. అందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నరు. కొత్త పోర్టల్ వస్తే రైతు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. పటేల్, పట్వారీ వ్యవస్థతో భూములు తారుమారయ్యే ప్రమాదం ఉంది. లంచాలు ఇవ్వకపోతే అధికారులు పని చేయరు. గతంలో ఒకరి పేరు మీద ఉన్న భూమిని మరొకరి పేరుపై రాసేటోళ్లు. అలాంటి మోసాలు జరగొద్దనే సీఎం కేసీఆర్ ధరణి తెచ్చి రైతు భూమికి భద్రత కల్పించిండు. రైతు బీమా కల్పిస్తుండు. వడ్లు కొనుగోలు చేసి డబ్బులు నేరుగా మా అకౌంట్లో వేస్తుండు. కాంగ్రెస్ కపట నాటకాలను ఎన్నికల్లో తిప్పికొడతాం.
– నూకల శ్రీనివాస్ యాదవ్, రైతు, మైలారం(గన్నేరువరం)
నాకు 15 ఎకరాల భూమి ఉంది. మొత్తం భూమి ధరణి ద్వారా ఆన్లైన్లో ఎక్కింది. ఇప్పుడు రికార్డుల్లో భద్రంగ ఉంది. గతంల కాంగ్రెస్ పాలించినప్పుడు భూమి పట్టా పాసుబుక్కులు, పహనీలు కావాలంటే, ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుండె. పట్వారీలకు పైసలు ఇస్తెనే పనులు జరుగుతుండె. కాంగ్రెస్కు ఓటేస్తే ధరణిని తీసేసి, భూమాత తీసుకస్తామని అంటున్నరు. అట్లయితే మళ్లీ పైరవీకారుల రాజ్యమొస్తది. కాంగ్రెసోళ్లు ఇప్పుడు రెవెన్యూ రికార్డుల్లో కౌలుదారు, అనుభవ దారు కాలమ్ పెడతామంటున్నరు. అదే జరిగితే రైతుల బతుకులు ఆగమాగమైతయ్. ప్రస్తుత ధరణితో మా భూములకు భద్రత వచ్చింది. సర్వే నంబర్ల సాయంతో ఇప్పుడు మా భూములను మొబైల్లోనే చూసుకుంటున్నం. భూమాత పోర్టల్పై మాకు నమ్మకం లేదు. మళ్లీ కాంగ్రెసోళ్లు కొత్త రూల్స్ పెడుతరు. మాకు మళ్లీ కష్టాలు వస్తయ్. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధుతో మాకు పంట పెట్టుబడి సాయం అందుతున్నది. ఇప్పుడు కాంగ్రెసోళ్లు వచ్చి భూమాత అని కొత్తగా అంటున్నరు. వాళ్లు వస్తే మాకు సాయం అందుతుందనే నమ్మకం లేదు.
– గుర్రం చంద్రారెడ్డి, రైతు (చొప్పదండి)
సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన ధరణి పోర్టల్తో భూ రికార్డులు పదిలంగా ఉన్నాయి. నాకు 5 ఎకరాల భూమి ఉంది. ధరణి రికార్డులో నమోదైన నాభూమి వివరాలు నా వేలిముద్ర, అనుమతి లేకుండా రికార్డులు మార్చేందుకు ఎవరికీ సాధ్యం కాదు. కాంగ్రెస్ వస్తే ధరణిని తీసేస్తామంటున్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం భూమాత పోర్టల్ను ప్రవేశపెడితే భూ రికార్డులన్నీ అస్తవ్యస్తంగా మారుతాయి. కౌలుదారు, అనుభవదారు కాలాలు పెడతామని చెప్పుతున్నరు. ప్రస్తుతం నడుస్తున్న ధరణి పోర్టల్ చాలా మంచిగా ఉంది.
-బుర్ర రమేశ్, రైతు, సిరిసేడు(ఇల్లందకుంట)
కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణితో నా సమస్య పరిష్కారమైంది. గతంలో నా భూమి విషయంలో సమస్య ఉండడంతో ఎన్నో సార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ధరణితో నా సమస్య పరిష్కారమైంది. ఇగ ఇప్పుడు కాంగ్రెసోళ్లు ధరణి తీసేసి భూమాత పెడుతామంటున్నరు. ధరణి తీసేస్తే నాలాంటి రైతులకు అన్యాయం జరుగుతది. మళ్లి పట్వారీ వ్యవస్థ వచ్చి ఇబ్బంది అవుతుంది. మారైతులకు ధరణియే బాగున్నది.
– అప్పని అశోక్, రైతు, రాయికల్(సైదాపూర్)
ధరణితో భూ సమస్యలు లేకుండా అయ్యాయి. ఒకేసారి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ నిమిషాల్లోనే పూర్తవుతుంది. పారదర్శకంగా సేవలు అందుతున్నయి. రైతులు అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేదు. అరగంటలోనే రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ పూర్తి చేసి, పట్టా పాస్ బుక్, రిజిస్ట్రేషన్ పత్రాలు అందుతున్నాయి. సమయం వృథా కాదు. ఎవరి చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ధరణి వచ్చాకే రైతుబంధు, రైతుబీమా వచ్చి అండగా నిలుస్తున్నయి. భూమిని అమ్మాలన్న.. కొనాలన్న ఇబ్బందులు తొలగిపోయాయి. పైరవీలు లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నయి. మళ్లా కాంగ్రెసోల్లు వచ్చి ధరణి తేసిస్తే ఆగమైతం.
– పొలం కనకయ్య, రైతు, గొల్లపల్లి (తిమ్మాపూర్ రూరల్)
ధరణి ఎత్తేస్తే మళ్లీ భూతగాదాలే. నాడు పరిపాలించిన కాంగ్రెస్ పాలనలో రైతుల భూములకు రక్షణ లేకుండా పోయింది. పట్వార్లకు చేతి వాటం ఇస్తే రికార్డులు తారుమారు చేసుకోవచ్చు. భూ రికార్డుల్లో పేర్లను, విస్తీర్ణంలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని కాంగ్రెసోళ్ల ఆలోచన. కానీ ధరణితో ఏ రికార్డుల్లో ఎంత భూమి ఉందో.. ఎవరి పేరున ఉందో మన మొబైల్లోనే వివరాలు చూసుకోవచ్చు. అక్రమాలు జరిగితే మన మొబైల్కు సమాచారం అందుతుంది. పట్టా చేసుకోవల్సి వస్తే యజమాని వేలి ముద్రలు అవసరం. కాబట్టి వేరే వారికి మార్పిడి చేయకుండా భద్రంగా ఉంటుంది.
– నల్ల మనోహర్రెడ్డి, రైతు, సదాశివపల్లి (మానకొండూర్ రూరల్)
ధరణి రాకముందు భూముల విషయంలో రైతులు పడే బాధలు చెప్పుకోవడానికి వీలు లేకుండా ఉండే. ఏండ్లు గడిచినా సమస్య పరిష్కారం కాక వందలాది మంది రైతులు రోడ్డున పడ్డరు. వీటన్నింటికి ధరణి అడ్డుకట్ట వేయడంతో అన్నదాతలకు మేలు జరిగింది. ధరణితో ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరిగే బాధలు తప్పినయి. ఇప్పుడు ఏ రికార్డు కావాలన్నా మీసేవ నుంచి నిమిషాల్లో తీసుకుంటున్నం. ధరణి పాసుపుస్తకంతో లోన్లు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లతో పాటు ఏ పనైనా సులువుగా అవుతున్నది. రైతు బంధు డబ్బులతో పాటు రైతుబీమా, ధాన్యం అమ్మిన డబ్బులు నేరుగా మా బ్యాంకు ఖాతాల పడుతున్నయి. గతంతో పోల్చితే ధరణితో రైతుకు మేలు జరుగుతున్నది. ఎన్నికల్లో లబ్ధి కోసం పాత రెవెన్యూ పద్ధతిని తీసుకువస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతూ రైతులను తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నరు.
– తుమ్మ ప్రతాప్రెడ్డి, రాణిపూర్ (ముకరంపుర)
సక్కగా ఉన్న ధరణి గురించి కాంగ్రెసోళ్లు సోయి లేకుండా మాట్లాడుతున్రు. ధరణి తీసేత్తే భూమి పత్రాల కోసం పాత లెక్క రోజుల తరబడి తాసీల్ కార్యాలయం చుట్టూ తిరగాలే. గిప్పుడు మీ సేవకు వెళ్తే ఐదు నిమిషాల్లో పహాణీలు అత్తున్నయ్. ధరణిపై భట్టి విక్రమార్క మాట్లాడిన తీరును రైతులు తిప్పి కొట్టాలే. ధరణితోనే ఎవుసం భూములు పదిలంగా ఉన్నయ్. కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తే రైతుల బతుకులు కుక్కల చింపిన విస్తరే అయితది. అక్కరురాని పనులు కాకుండా రైతులకు ఏమైనా ఫాయిదా ఉండేటట్లు ఆలోచన చేయున్రి. అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న కాంగ్రెసోళ్లకు రైతులందరే దిమ్మ తిరిగే విధంగా ఎన్నికల్లో బుద్ధి చెప్పాలే.
-పంజాల కుమారస్వామి, రైతు(హుజూరాబాద్)
ధరణి తీసేస్తే రైతులకు మళ్లీ దరిద్రం వస్తది. ధరణి రాక ముందు ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగేవి. లంచాలు ఇచ్చినా పనులు కాకపోయేవి. ఇప్పుడు మీసేవకు పోయి చలాన్ కట్టుకుంటే గంట సేపట్ల భూమి పట్టా అయితంది. పాత పాస్బుక్ ఉంటే వెంటనే సర్వేనంబర్లు ఎక్కిస్తన్రు. కొత్తదైతే వారం రోజుల్లో ఇంటికే బుక్ వత్తది. గతంలో పహాణీల్లో పేర్లు మాయమయ్యేవి. ఇట్లా ఎందుకు జరిగిందని పట్వారీని అడిగితే పోయిన పట్వారీ చేసిండని, ఆయనను అడిగితే నాకేం తెల్వదని ఇబ్బంది పెట్టేవారు. ఇప్పుడు ఆన్లైన్లో మన భూమి ఎంత ఉంది అని ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ధరణితో రైతులకు మేలు జరుగుతుంది.
-కాశిరెడ్డి చిరంజీవరెడ్డి, రైతు, తుమ్మనపల్లి(హుజూరాబాద్రూరల్)