గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వేసవిలో భూగర్భజలాల పెంపే లక్ష్యంగా నీటి పారుదల శాఖ కసరత్తు చేస్తున్నది. ఉత్తర తెలంగాణకు, మరీ ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రజలకు ప్రాణాధారమైన నదిపై మరో చెక్ డ్యాం నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తున్నది. జిల్లాలో నది ప్రవాహం మొదలయ్యే ఇబ్రహీంపట్నం మండలం కోమటి కొండాపూర్ నుంచి ధర్మపురి దాకా సర్వే చేసింది. నది విస్తీర్ణం తక్కువగా ఉన్న మల్లాపూర్ మండలం వాల్గొండ వద్ద చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇక్కడ చెక్ డ్యాం నిర్మిస్తే జగిత్యాల, నిర్మల్ జిల్లాల మధ్య అనుసంధానం ఏర్పడడమే కాదు, పర్యాటకంగానూ అభివృద్ధి చెందే అవకాశముందంటూ ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించింది.
– జగిత్యాల, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ)
జగిత్యాల, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): మల్లాపూర్ మండలం గోదావరి పరీవాహక ప్రాంత గ్రామం వాల్గొండ. తెలంగాణలో వాల్గొండకు ప్రత్యేక చారిత్రక వారసత్వం ఉంది. వాల్గొండలో కళ్యాణి చాళుక్యుల కాలంలో (క్రీ.శ 1000 సంవత్సరం) నిర్మించిన త్రికూటాలయం ఉన్నది. వాల్గొండతోపాటు జగిత్యాల జిల్లాలోని నది పరీవాహక ప్రజలు, నిర్మల్ జిల్లాలోని గోదావరినది పరీవాహక గ్రామాల ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఈ క్రమంలో యాసంగి పంటను సాగు చేసే సమయంలో నీటి కోసం తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. సహజంగా గోదావరిలో నవంబర్ నుంచే నీటి లభ్యత తగ్గిపోతుంది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి సైతం నీటిని గోదావరిలోకి వేసవిలో వదిలిపెట్టే పరిస్థితి లేదు. దీంతో ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి, యాసంగి పంటలు వేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
రైతుల అవస్థలు గమనించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు నదిపై చెక్డ్యాం నిర్మాణం విషయాన్ని పరిశీలించాలని నీటి పారుదల శాఖ అధికారులను కోరారు. దాంతో స్పందించి జగిత్యాల జిల్లాలో గోదావరి నది అడుగుపెట్టే ఇబ్రహీంపట్నం మండలం కోమటి కొండాపూర్ నుంచి ధర్మపురి దాకా నదిపై సర్వే చేశారు. మల్లాపూర్ మండలం వాల్గొండ వద్ద నది వైశాల్యం తక్కువగా ఉండి చెక్ డ్యాం నిర్మాణానికి అనువుగా ఉందని అధికారులు గుర్తించారు. అలాగే నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్-జగిత్యాల జిల్లా వాల్గొండ గ్రామాల మధ్య అనుసంధానం ఏర్పడడంతోపాటు చారిత్రాత్మకమైన పుణ్యక్షేత్రాలు, నది పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ప్రకృతి రమణీయ దర్శన స్థలాల్లో పర్యాటక రంగం వృద్ధి చెందుతుందన్న అభిప్రాయంతో ప్రభుత్వానికి నివేదించారు. వాల్గొండ వద్ద గోదావరినదిపై చెక్ డ్యాం నిర్మించాల్సిన అవసరం, దాని వల్ల కలిగే ప్రయోజనాలపై పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేశారు.
23.43కోట్ల తో అంచనాలు
వాల్గొండ వద్ద నిర్మల్, జగిత్యాల జిల్లాలను కలుపుతూ, గోదావరినదిలో చెక్ డ్యామ్ను నిర్మించేందుకు 23.43 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనాలు రూపొందించారు. వాల్గొండ రామలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో గోదావరినదిలో 78డిగ్రీల రేఖాంశం, 19 డిగ్రీల అక్షాంశం వద్ద ఈ చెక్డ్యాం నిర్మాణానికి ప్రపోజల్ చేశారు. 830 మీటర్ల పొడవున 3 మీటర్ల ఎత్తుతో చెక్డ్యాం నిర్మాణం చేయాలని సూచించారు. అలాగే చెక్డ్యాంను చిన్న కాజ్వేగా సైతం రూపొందించాలని, దీంతో నవంబర్ నెల నుంచి జూన్ దాకా రెండు జిల్లాల రైతులకు, ప్రజలకు ప్రయాణ సాధనంగా ఉపయోగపడుతుందని అధికారులు ప్రపోజల్లో పేర్కొన్నారు. ఈ నిర్మాణానికి ఎలాంటి భూసేకరణ అవసరం లేదని, అలాగే ఈ చెక్డ్యాం నుంచి ఆయకట్టును స్థిరీకరించేందుకు నేరుగా కాలువలు తవ్వడం ఉండదని, కేవలం గోదావరి పరీవాహక ప్రాంతంలోని గ్రామాల్లో భూగర్భజలాల వృద్ధితోపాటు టూరిజం అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఈ చెక్డ్యామ్ నిర్మాణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
చెక్డ్యాం నిర్మాణంతో వేసవిలో గోదావరినదిలో నీరు చాలా దూరం వరకు నిలిచే అవకాశముంటుంది. వేములకుర్తి వద్ద గంగనాల ప్రాజెక్టు ప్రాంతం నుంచి నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ వద్ద నిర్మిస్తున్న బరాజ్ దాకా గోదావరిలో నీరు నిలిచే అవకాశాలున్నాయని నీటి పారుదల శాఖ చెబుతున్నారు. ఈ చెక్డ్యాం నిర్మాణం వల్ల నిర్మల్ జిల్లాలోని లింగాపూర్, సారంగాపూర్, బాదనకుర్తి, మస్కాన్పూర్, సుర్జాపూర్, జగిత్యాల జిల్లాలోని వాల్గొండ, కొత్త దాంరాజ్పల్లి, పాతదాంరాజ్పల్లి, సంగెం, శ్రీరాంపూర్, ఒబులాపూర్, నడికుడ, మొగిలిపేట, వేంపెల్లి వెంకట్రావుపేట గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుందని, మల్లాపూర్ మండలం పర్యాటక కేంద్రంగా మారుతుందని నివేదికలో పొందుపర్చారు. ఈ నివేదికను నీటి పారుదల శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.
రెండు జిల్లాలకు మేలు
వాల్గొండ వద్ద చెక్డ్యాం నిర్మిస్తే జగిత్యాల, నిర్మల్ జిల్లాల పరిధిలోని 15 గ్రామాల రైతులకు మేలు జరుగుతుందని, చెక్డ్యాం వల్ల గోదావరిలో నీరు నిలుస్తుందని, దీంతో గోదావరి పరీవాహక గ్రామాల్లో భూగర్భజలాలు వృద్ధి చెందుతాయని అధికారులు నివేదికలో పొందుపర్చారు. వేసవిలో అత్యవసర పరిస్థితులు వచ్చి, తాగునీటికి ఇబ్బందులు వస్తే చెక్ డ్యాం నుంచి రెండు జిల్లాల పరీవాహక గ్రామాల ప్రజలకు నీరందించే అవకాశముంటుందని పేర్కొన్నారు. వాల్గొండ, ఆ గ్రామ సమీపంలో ఉన్న వేంపల్లి, వెంకట్రావుపేట, మల్లాపూర్ గ్రామాల్లో చారిత్రక ఆనవాళ్లు, ప్రకృతి రమణీయత నెలకొని ఉన్నది. చెక్డ్యాం వస్తే ఈ ప్రాంతాలన్నీ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. ఇప్పటికే వాల్గొండ, నిర్మల్ జిల్లాల మధ్య, గోదావరిలో రెండు ఎడ్లబండి బాటలు ఉన్నాయి. నవంబర్ నుంచి జూన్ దాకా రెండు జిల్లాల ప్రజలు సరుకుల రవాణా, ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెక్డ్యాంతోపాటు చిన్న కాజ్వేగా నిర్మాణం చేపడితే రెండు జిల్లాల మధ్య సరుకుల రవాణాకు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు మార్గం సుగమమం అవుతుందని నీటి పారుదల శాఖ అధికారులు నివేదిక రూపొందించారు.
చెక్డ్యాం నిర్మాణానికి ప్రయత్నం
మల్లాపూర్ మండలం వాల్గొండ-నిర్మల్ జిల్లా సారంగాపూర్ మధ్య గోదావరినదిలో దాదాపు కిలోమీటర్ పొడవునా చెక్ డ్యాం నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నాం. రెండు జిల్లాల మధ్య గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు, రైతులు ఆయకట్టు స్థిరీకరణ, యాసంగి పంటను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చారిత్రాత్మకమైన వాల్గొండ, వేంపల్లి వెంకట్రావుపేట, మల్లాపూర్ గ్రామాల్లో ప్రకృతి రమణీయత సైతం అద్భుతంగా ఉంటుంది.
పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ఈ గ్రామాలతో పాటు, నిర్మల్ జిల్లా పరిధిలో ప్రకృతి రమణీయత కలిగిన గ్రామాలు టూరిస్టు స్పాట్లుగా అభివృద్ధి చెందుతాయి. దీంతో పాటు, చెక్డ్యామ్ను కాజ్వేగా నిర్మిస్తే, రెండు జిల్లాల మధ్య చిన్న రవాణా సదుపాయం సైతం అభివృద్ధి చెందుతుంది. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి వినేదికలు పంపారు. దాదాపు 25 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నిధుల మంజూరు కోసం ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రితో పాటు, నీటిపారుదల శాఖ మంత్రిని కలిసి విన్నవించా. వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేయించి, చెక్డ్యాం నిర్మాణం జరిగేలా చూస్తా.
– కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు