కోరుట్ల, ఫిబ్రవరి 22: ప్రజా సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ఎళ్లవేళలా అందుబాటులో ఉంటానని, మీ సేవకుడిలా పనిచేస్తానని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు స్పష్టం చేశారు. ఎన్నికల వేళ ప్రజలు గుర్తుకు వచ్చే నాయకులను నమ్మవద్దని, ప్రజా సమస్యలు తీర్చే ప్రభుత్వానికి అండగా ఉండాలని, నాయకులకు వెన్నుదన్నుగా నిలువాలని పిలుపునిచ్చారు. ఐదుసార్లు తనను ఆశీర్వదించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిదని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవకుడిగా పని చేస్తానని ఉద్ఘాటించారు. ఎన్నికల్లో తన వెన్నంటి నిలిచిన తన కొడుకు కల్వకుంట్ల సంజయ్కుమార్ను ప్రజలు కడుపులో పెట్టుకోవాలని కోరారు. బుధవారం కోరుట్ల పట్టణంలోని అయ్యప్ప గుట్ట కేదారి గార్డెన్లో 5, 19, 20, 21వ వార్డులకు చెందిన ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతరం ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, వాటి తీరు తెన్నులపై వార్డు ప్రజలకు వివరించారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అడుగకముందే వరాలిచ్చే దేవుడు సీఎం కేసీఆర్ అని, పేదింటి ఆడ బిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ.లక్షా నూటాపదహార్లు అందించి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారని కొనియాడారు.
ఈ రోజు దేశంలోని 28 రాష్ర్టాలు మన సంక్షేమ పథకాలనే ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడంలేదని ఆయా పార్టీల నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. మోదీ సొంత రాష్ట్రంలో కేవలం 600 పింఛన్ ఇస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని, కొత్తగా త్వరలోనే మరో 5 లక్షల మందికి అందించేందుకు సీఎం సంసిద్ధత వ్యక్తం చేశారని వివరించారు. 2018 కటాఫ్ తేదీతో బీడీ కార్మికులందరికీ ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలోనే కోరుట్ల నియోజకవర్గానికి అత్యధిక పింఛన్లు తీసుకువచ్చానని చెప్పారు. కోరుట్లలో వంద పడకల దవాఖాన నిర్మాణం, డివిజన్ ఏర్పాటు చేశామని, మినీ ట్యాంకు బండ్ సుందరీకరణ పనులు పూర్తి కానున్నట్లు తెలిపారు. అర్వింద్ తన నియోజకవర్గంలో అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. కల్వకుంట్ల కవిత ఎంపీగా ఉన్న సమయంలో ఏటా 70 లక్షల దాకా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. అంతకుముందు ఆయా వార్డులకు చెందిన 150 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్లతో పాటు కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యేతో కలిసి సంజయ్ పంపిణీ చేశారు. తర్వాత లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. సమ్మేళనంలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, కౌన్సిలర్లు గందం గంగాధర్, అన్వర్, పేర్ల సత్యం, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, ఆర్బీఎస్ అధ్యక్షుడు చీటి వెంకటరావు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
90శాతం వాగ్దానాలను నెరవేర్చా
అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పటి వకు ఇచ్చిన వాగ్దానాలను 90 శాతం నెరవేర్చా. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవకుడిగా పని చేస్తా. కోరుట్ల పట్టణంలో ఇప్పటి వరకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద 2,172 మంది లబ్ధిదారులకు సుమారు 19.54 కోట్లు అందించాం. రైతు బంధు కింద 1427 మంది రైతులకు 8 కోట్ల 36 లక్షల 54 వేలు, రైతు బీమా కింద 14 మంది రైతు కుటుంబాలకు 70 లక్షలు అందించి అండగా నిలిచాం. సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీ ద్వారా 1180 మంది లబ్ధిదారులకు 7.50కోట్లు వెచ్చించాం. కోరుట్లలో మొత్తం 13,797 మంది పింఛన్దారులకు ప్రతి నెలా 2కోట్ల 9లక్షల 22 నిధులు ఖర్చు చేస్తున్నాం.
– ఎమ్మెల్యే విద్యాసాగర్రావు
బతికున్నంతకాలం సీఎం సారును యాది పెట్టుకుంట
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం నాది. నాకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. బిడ్డలకు పెండ్లి చేసిన. నా భర్త రెండేళ్ల క్రితం కాలం చేసిండు. కూలీ పనిచేస్త. మానసిక వికలాంగుడైన కొడుకుకు నేనే దిక్కు. ఎట్ల బతుకుడో అనుకున్న. కానీ, కేసీఆర్ సారు మా కష్టాలు తీర్చిండు. నాకు 2116 పింఛన్, మతి స్థిమితం లేని నా కొడుక్కు 3116 పింఛన్ ఇచ్చి ఆదుకున్నడు. నా కష్టాలు గట్టెక్కించిన సీఎం సార్కు రుణపడి ఉంట. బతికున్నంత కాలం యాదిపెట్టుకుంట.
– మొండెద్దుల కమల, ప్రభుత్వ పథకం, లబ్ధిదారు, బీసీ కాలనీ (కోరుట్ల)
కేసీఆర్ సారు వెంటే నడుస్తం
గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూసినం. పార్టీలను చూసినం. కానీ, ఇలా మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నం. అడుగక ముందే సీఎం కేసీఆర్ సార్ అన్ని వర్గాలకు మేలు చేస్తున్నడు. పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నడు. ముస్లిం ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇస్తున్నడు. పెండ్లికి షాదీముబారక్ పథకం ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నడు. మంచి పనులు చేస్తున్న సీఎం సార్ వెంటే మేం నడుస్తం. ఎమ్మెల్యే విద్యాసాగర్రావు చేసిన మంచి పనులు ఆయన కొడుకు సంజయ్ గెలుపునకు బాటలు వేస్తయ్.
– సమ్రీన్ ఫాతిమా, అల్లమయ్య గుట్టవాసి (కోరుట్ల)
సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలి
సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నరు. ఇంటింటికీ ఏదో ఒక పథకం రూపంలో లబ్ధి చేకూరుస్తున్నరు. తెలంగాణలో ప్రభుత్వ పథకం అందని ఇల్లు లేదు. సంక్షేమ పథకాలు పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నయ్. కల్యాణలక్ష్మి కింద పేదింటి ఆడబిడ్డ పెండ్లికి రూ.లక్షా నూటాపదహార్ల సాయం అందుతున్నది. అందుకే కేసీఆర్ను మహిళలు పెద్దన్నగా పిలుస్తున్నరు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలువాలి. తెలంగాణ ప్రజలు సుఖంగా ఉండాలని పరితపించే సీఎంను ప్రజలు ఆశీర్వదించాలి. కుల, మతాల పేరిట చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకొనే నాయకులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి.