కోరుట్ల/ జగిత్యాల టౌన్/ ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 25: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. తొమ్మిది గంటలకు ఎగ్జామ్ కాగా, అరగంట ముందే నుంచే కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. కొందరు 9.05 గంటలు దాటిన తర్వాత రావడంతో అధికారులు అనుమతించలేదు. దీంతో స్టూడెంట్స్ కంటతడి పెడుతూ కేంద్రాలను నుంచి తిరిగివెళ్లారు.
ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన పిట్ల శరణ్య ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 15 నిమిషాలు ఆలస్యంగా చేరుకోవడంతో పోలీసులు అనుమతించలేదు. అదేవిధంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురాకు చెందిన విద్యార్థిని అస్రా మహిన్ ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. ఆమె తండ్రి అబ్దుల్ రహమాన్ ఎంత బతిమిలాడినా నిబంధనల కారణంగా పరీక్షకు అనుమతించలేదు. అలాగే కోరుట్ల మాస్ట్రో కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి రెహమాన్ 16 నిమిషాలు, మరో విద్యార్థి మహ్మద్ తాజ్ 40 నిమిషాలు ఆలస్యంగా రాగా, అధికారులు పరీక్షా హాల్లోకి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు నిరాశతో ఇంటికి తిరిగివెళ్లారు.
పుట్టెడు దుఃఖంలో పరీక్షకు
జమ్మికుంట/ జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 25: తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు విద్యార్థులు, పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాశారు. జగిత్యాల రూరల్ మండలం నూకపెల్లి అర్బన్ కాలనీకి చెందిన కనకాల అనూష అప్పుల బాధతో మంగళవారం ఆత్మహత్య చేసుకోగా, ఆమె పెద్ద కూతురు రమ్యశ్రీ బుధవారం దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్షకు హాజరైంది. అలాగే జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లికి చెందిన రైతు గుజ్జుల గోపాల్రావు(45) గుండెపోటుతో పొలం ఒడ్డుపై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయన కూతురు అక్షయణి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో పరీక్షకు హాజరైంది. అంతలోనే తండ్రి మృతి చెందిన విషయం తెలుసుకొని కంటతడి పెట్టింది.