ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు సమస్యల గూటిలో చిక్కుకుంటున్నాయి. అధికారపార్టీ ఇచ్చిన హామీలు అటకెక్కగా ఆరు నెలల నుంచి అద్దె ఇండ్లకు కిరాయిలు చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయి. నూతన భవనాల నిర్మాణం లేకపోవడం, అద్దె చెల్లించాలంటూ ఒత్తిడి పెరుగుతుండడం, ఉన్న వాటిని దూరంగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో మార్చుతుండడం, టీచర్లు, ఆయాల ఖాళీలు పెరుగుతుండడం మూలంగా ఆశించిన లక్ష్యం చేరుకోలేక సేవలు అందనంత దూరంగా వెళ్తున్నాయి.
కరీంనగర్ కలెక్టరేట్, జూలై 25 : నిరుపేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లోని మహిళలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణతోపాటు వారికి పౌష్టికాహారం అందిస్తూ, పూర్వప్రాథమిక విద్యనందించడమే లక్ష్యంగా కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటి పనితీరుపై విమర్శలు వస్తుండగా, అధికారులు చోద్యం చూస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక దృష్టి సారించినట్టు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో పౌష్టికాహారం అందిస్తూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పునాదిరాళ్లుగా నిలుస్తున్న ఈ కేంద్రాల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనున్నదా..? అనే ఆందోళన అందరిలో నెలకొన్నది. ఎన్నికలకు ముందు అధికార నేతలు ఇచ్చిన హామీలు అటకెక్కుతుండగా కేంద్రాల్లో అందిస్తున్న సేవలు నామ్కే వాస్తేగా మారుతున్నాయనే ఆవేదన వ్యక్తమవుతున్నది. ఉమ్మడి జిల్లాలో 13 ప్రాజెక్టులు కొనసాగుతుండగా, వీటి పరిధిలో 3,134 అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తుండగా, అందులో 900కు పైగా కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటికి ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు అద్దె బకాయిలు విడుదల చేయకపోవడంతో యజమానులు అద్దె చెల్లించాలంటూ చేస్తున్న ఒత్తిడి తట్టుకోలేక టీచర్లు ఇక్కట్ల పాలవుతున్నారు. కొన్నిచోట్ల టీచర్లే చెల్లిస్తుండగా, మరికొన్నిచోట్ల సొంత పూచీకత్తుపై కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అద్దె భారమవుతుందనే భావనతో అధికారులు కేంద్రాలను ప్రస్తుతమున్నచోటు నుంచి ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ఒత్తిడి తెస్తుండడంతో సిబ్బంది మార్చుతున్నారు.
దీంతో, సుదూర ప్రాంతానికి మారిన కేంద్రాలకు వెళ్లలేక లబ్ధిదారులు అంగన్వాడీల సేవలందుకోలేక, చిన్నారులు పూర్వ ప్రాథమిక విద్యకు దూరమవుతున్నారు. మారిన కేంద్రాల్లో లబ్ధిదారులు, విద్యార్థుల సంఖ్య తగ్గుతుండగా, వెలవెలబోతున్నాయి. వాటిని పూర్వపు స్థితికి తేవాలంటూ అధికారులు ఒత్తిడి తెస్తుండగా ఆయాలు, టీచర్లు నెత్తి నోరు బాదుకుంటున్నారు. దీనికితోడు పదవీ విరమణతో ఖాళీ అవుతున్న వారి స్థానంలో కొత్త నియామకాలు లేక, వాటి బాధ్యతలు కూడా ఉన్నవారికే అప్పగిస్తున్నారు. తమ విధులే నిర్వహించడం భారంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో అదనంగా అప్పగిస్తున్న కేంద్రాల్లో విధుల నిర్వహణ తలకు మించిన భారంగా మారిందని ఆయాలు, టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,100కు పైగా టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితం కాగా, ఈ భారం కూడా అధికారులు తమపైనే వేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. నూతన భవనాల నిర్మాణం కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారడంతో ఉమ్మడి జిల్లాలో కేంద్రాల నిర్వహణ అధ్యానంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. చాలాచోట్ల భవనాల నిర్మాణం పునాదులకే పరిమితం కాగా, ఆరోగ్య రక్షణ, పూర్వ ప్రాథమిక విద్యాబోధక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామంటూ పదే పదే చేస్తున్న ప్రకటనలు ఉత్తవే అవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర గడిచినా ఇప్పటి వరకు రెండు శాతం కూడా భవనాల నిర్మాణం పూర్తికాలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధిపై ప్రభుత్వం చెప్పేదోటి.. ఆచరణలో మరోటి చూపుతున్నదని స్పష్టమవుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.