తెలంగాణచౌక్, జనవరి 26 : టీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల భద్రత కోసం కోట్లాది రూపాయల వ్యయంతో 51 ఆధునిక బస్సులను కొనుగోలు చేసినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం కొనుగోలు చేసిన సూపర్ లగ్జరీ బస్సుల్లో కరీంనగర్ రీజియన్కు కేటాయించిన రెండింటికి గురువారం ఆయన రిబ్బన్ కట్ చేశారు. అనంతరం బస్సుల్లో వసతులను పరిశీలించగా, ఆర్ఎం ఖుస్రోషాఖాన్ ఆధునిక బస్సుల గురించి వివరించారు. అనంతరం జెండా ఊపి బస్సులను ప్రారంభించారు అనంతరం విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే బయపడే పరిస్థితులు ఉండేవన్నారు. సీట్లు సరిగా లేకపోవడం, కాలపరిమితి ముగిసినవి ఉండేవని, రిపేర్ వస్తే మధ్యలోనే ఆగిపోయేవని, ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండే వారని గుర్తు చేశారు. ఆర్టీసీకి వచ్చి నష్టాలతో సంస్థను ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నాలు చేశారని తెలిపారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ టీఎస్ ఆర్టీసీని రాష్ట్ర ఆస్తిగా గుర్తించి బడ్జెట్లో కోట్లాది రూపాయల నిధులు కేటాయించారని చెప్పారు. సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపి తీసుకున్న చర్యల ద్వారా ఆర్టీసీ లాభాల బాటలోకి వస్తున్నదని చెప్పారు. కొత్త బస్సుల్లో లగ్జరీ సీట్లు, సెల్ చార్జింగ్, సీసీ కెమెరాలతోపాటు ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రయాణికులను అప్రమత్తం చేసేలా ప్రత్యేక అలారం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గత బస్సుల కెపాసిటీ 49 సీట్లు ఉండగా, కొత్త బస్సుల్లో విలాసవంతంగా ప్రయాణించేందుకు 36 సీట్లకు కుదించారని తెలిపారు. కరీంనగర్కు కేటాయించిన బస్సులను కరీంనగర్ నుంచి హైదరాబాద్ను నడిపిస్తారన్నారు.
ఫిబ్రవరి నుంచి యాదాద్రికి బస్సులు
కరీంనగర్ జిల్లా ప్రజలు యాదాద్రి లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు ఫిబ్రవరి మొదటి వారం నుంచి కరీంనగర్ నుంచి నేరుగా యాదాద్రికి రోజూ రెండు బస్సులు నడిచేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్రావు, జిల్లా గ్రంథాలయం చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, 9వ డివిజన్ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చల్ల హరిశంకర్, డిపో మేనేజర్లు ప్రణీత్, మల్లయ్య పాల్గొన్నారు.