తిమ్మాపూర్, జూన్ 4: పంట మంచిగ పండాలన్నా.. రైతుకు లాభాలు అధికంగా రావాలన్నా.. దానికి మూలం విత్తనమే. అలాంటి విత్తనం కొనుగోలులో రైతులు అప్రమత్తంగా లేకపోతే శ్రమ, పెట్టుబడి నష్టపోకతప్పదు. విత్తన ఎంపికలో పలు జాగ్రత్తలు పాటించడం వల్ల ఇలాంటి వాటిని నివారించవచ్చు.
తిమ్మాపూర్ మండలంలో ఈ వానకాలం 18,350 ఎకరాలు, మక్క 450ఎకరాలు, పత్తి 750ఎకరాలు, కూరగాయాలు ఇతర పంటలు 950ఎకరాల్లో పంటలు సాగు కానున్నాయి. వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతుండడంతో విత్తనాలు వేయడానికి రైతులు దుకులు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సీజన్లో వరి, పత్తి, మక్క, ఇతర కూరగాయాల పంటలపై రైతాంగం దృష్టి సారిస్తున్నది. ఎకువ మంది రైతులు విత్తనాలను ప్రైవేట్ దుకాణాల్లో కొనుగోలు చేస్తుంటారు. పంటల సాగు సమయంలో అనేక నకిలీ విత్తనాల కంపెనీలు ప్రచారం ముమ్మరం చేస్తాయి. దీంతో నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి పంటలు సాగు చేసిన రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పుడు సీజన్ కావడంతో గ్రామాలకు వెళ్లి నాసిరకం విత్తనాలను తక్కువ ధరలకు రైతులకు అంటగట్టేందుకు దళారులు ప్రయత్నిస్తుంటారు. తీరా విత్తనాలు వేసిన తర్వాత అవి మొలకెత్తవు, మొలకెత్తినా పత్తి లాంటి ఏడాది పంటల్లో నెలలు గడిచినా పూత ఉండదు, కాత ఉండదు. అప్పుడు నాసీరకం అని తెలియడంతో మోసపోవడం రైతువంతవుతుంది.
తెలంగాణ ప్రభుత్వం నకిలీ విత్తనాల కట్టడి కోసం పకడ్బందీ చర్యలు చేపట్టింది. వ్యవసాయ, పోలీసు శాఖలను సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు నిత్యం తనిఖీలు చేస్తున్నారు. వ్యవసాయ, పోలీస్ జిల్లా బాస్లు సైతం కంపెనీల్లో తనిఖీలు చేపడుతున్నారు. అయినప్పటికీ కొన్నిచోట్ల రైతులను దళారులు మోసం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
నకిలీ విత్తనాల విక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండడంతో మండల స్థాయిలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అల్గునూర్లో రెండు దుకాణాల్లో విత్తనాలపై అనుమానం వచ్చి నాణ్యత పరిశీలించగా.. లోపం ఉండడంతో పత్తి, వరి విత్తనాల డీలర్లు, కంపెనీలపై అధికారులు కేసు వేశారు.=
విత్తనాల్లో ప్రభుత్వ పరంగా విడుదలయ్యేవి, ప్రైవేట్ కంపెనీల నుంచి విడుదలయ్యేవి ఉంటాయి. ప్రభుత్వం రూపొందించిన రకాలు నోటిఫైడ్ పేరిట మారెట్లోకి వస్తాయి. ప్రైవేట్ సంస్థలు రూపొందించిన విత్తనాలను నాన్ నోటిఫైడ్ పేరిట విక్రయిస్తారు. నోటి ఫైడ్ విత్తనాల నాణ్యత పంపిణీ ప్రమాణాలు 1960 విత్తన చట్టం పరిధిలోకి వస్తాయి. నోటిఫైడ్ విత్తనాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేనట్లయితే ఉత్పత్తి దారులు పంపిణీ దారులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు.
రైతులు విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు అవి మేలు రకమైనవేనా? కాదా? అనే విషయం పరిశీలించాలి. నాసీరకం విత్తనాలకు సంబంధించి వ్యాపారులు ప్రచారం చేసినా, విక్రయించినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. ప్యాకింగ్, లేబుల్, ఉత్పత్తి తేదీ, తదితర వివరాలు చూడాలి. అలాగే రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్యాకెట్లు లేదా బ్యాగులు, రసీదులు పంట పూర్తయ్యేదాక భద్రపరుచుకోవాలి.
-జే సురేందర్, ఏవో, తిమ్మాపూర్.